Dharmapuri Sanjay: నిజామాబాద్ జిల్లా రాజకీయ దిగ్గజం, దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీకోసం ఎంతో చేసినా తనకు ఎలాంటి గుర్తింపు దక్కడంలేదని, తనను పార్టీ అస్సలు పట్టించుకోవడంలేదని మాజీ మేయర్ సంజయ్ మదనపడుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అసలు తండ్రి చక్రం తిప్పిన పార్టీలో తనయుడికి ఎందుకా పరిస్థితి తలెత్తింది?
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన దివంగత ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ .. అడుగులో అడుగులేస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు ఆయన తనయుడు ధర్మపురి సంజయ్. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో అప్పట్లో డీఎస్ కాంగ్రెస్ పై అసంతృప్తితో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. తండ్రితో పాటే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి మాజీ మేయర్ సంజయ్ కూడా టీఆర్ఎస్లో చేరారు. అయితే తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయనకు పార్టీ టికెట్ కేటాయించకపోయినా, పోటీచేసే అవకాశం కల్పించకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.
తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సంజయ్ కృషి చేసి సత్తా చాటుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం ఆయన పూర్తిస్థాయిలో పాటుపడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో ప్రత్యర్థి పార్టీలు గట్టి పోటీ ఇచ్చినా, కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో ధర్మపురి సంజయ్ కీలక పాత్ర పోషించారు. ఇంత చేసినా సంజయ్.. తనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని చిన్నబుచ్చుకున్నారట. అవసరం ఉన్నప్పుడు ఆయనను పార్టీలోకి తీసుకున్న పార్టీ పెద్దలు, ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీకోసం ఎంతో చేసినా తనకు ఎలాంటి గుర్తింపు దక్కడంలేదని, తనను పార్టీ అస్సలు పట్టించుకోవడంలేదని సంజయ్ మదన పడుతు న్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన నేత లెందరికో కార్పొరేషన్ పదవులు దక్కాయని, అన్ని అర్హత లున్నా తనను పార్టీ ఏ కోశానా లెక్కలోకి తీసుకోలేదని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ రగిలిపోతున్నారంట. ఆ క్రమంలో కాంగ్రెస్లో ఆయన కొనసాగితే, తమ మనుగడ కష్టమని, పార్టీలో సంజయ్ మటే చెల్లుబాటయ్యే అవకాశం ఉందని జిల్లా కాంగ్రెస్ నేతల్లో పలువురు భావిస్తున్నట్లు తెలిసింది.
ఆ క్రమంలో పథకం ప్రకారమే సంజయ్ని పొమ్మనలేక పొగ పెడుతున్నట్టు ఆయన అనుచరులు, సన్నిహితులు భావిస్తున్నారు. జస్టిస్ ఫర్ ‘డీఎస్ఆర్’ అంటూ సంజయ్ మద్దతుగా నిజామాబాద్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయన అనుచరవర్గం తమ నిరసన వ్యక్తం చేస్తోంది. సంజయ్ రాజకీయంగా ఎదిగితే తమకు ప్రమాదమనే భయంతోనే ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతు న్నారంటున్నారంటున్నారు. ప్రస్తుతం ఆత్మాభిమానాన్ని చంపుకుని. పార్టీలో ఇమడలేకపోతున్నానని, రాజీనామా చేస్తానని తన అనుచరులతో సంజయ్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఒకవేళ సంజయ్ నిజంగానే కాంగ్రెస్కు రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ మొదలైంది. సోదరుడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్తో కుటుంబ కలహాల కారణంగా బీజేపీలో చేరే అవకాశం లేదంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్లొ చేరినా ప్రాధ్యాన్యం దక్కుతుందనే నమ్మకం లేదని భావిస్తున్నారట. ఇక మిగిలింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పెట్టబోయే కొత్త పార్టీ మాత్రమే అని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అదలా ఉంటే.. పార్టీ వీడే ఆలోచనలో వున్న సంజయ్ ని అధిష్టానం బుజ్జిగించి, కోరుకున్న ప్రాధాన్యత దక్కేలా నామినేటెడ్ పదవిని కట్టబెడితే అలక వీడుతారా? అనే కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి.
Also Read: నాగర్కర్నూల్ బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేతల జంప్!
Story by: Apparao, Big Tv