Dubai Real Estate: పశ్చిమాసియాలో రేగిన ఉద్రిక్తతలు అరబ్ దేశాలను కుదిపేస్తున్నాయ్. ఇరాన్-ఇజ్రాయెల్ వార్తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని విధంగా ఎఫెక్ట్ అవుతోంది. ముఖ్యంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి భారీ నష్టం వాటిల్లుతోంది. గతేడాది దుబాయ్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద ఫారిన్ గ్రూప్ భారతీయులే. 85 వేల కోట్ల నుంచి 95 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్లను ఇండియన్స్ కొనుగోలు చేశారు. 2025లో దుబాయ్ అన్ని రకాల ఆస్తుల్లో దాదాపు 23 లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలను నమోదు చేసింది. గతేడాది దుబాయ్లో భారతీయుల లావాదేవీల వాటా 23 శాతంగా ఉంది. 2023లో ఈ వాటా కేవలం 12 శాతం మాత్రమే. నాన్ అరబ్ పెట్టుబడిదారుల్లో బ్రిటన్, చైనాకు చెందినవారు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
దుబాయ్లో ఆస్తుల కొనుగోళ్లలో భారతీయులు 20 నుంచి 22 శాతం వాటా కలిగి ఉన్నారు. భౌగోళిక సామీప్యత, యూఎస్ డాలర్తో యూఏఈ దిర్హామ్ అందించే స్థిరత్వం, ఆకర్షణీయమైన రెంట్స్ లాంటివి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయ్. వేలాది మంది భారతీయులు దుబాయ్లో పెట్టుబడిగా అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుగోలు చేశారు. చాలా మంది డెవలపర్లు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేసే క్లయింట్లకు.. రెంటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తారు. భారత్తో పోలిస్తే దుబాయ్లో రెంట్స్ 6 నుంచి 8 శాతం ఎక్కువగా వస్తాయి. అందుకే.. దుబాయ్ అంటే ఇండియన్స్లో ఇంత క్రేజ్ పెరిగింది. కానీ.. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయ్. కొనుగోలుదారులు అభివృద్ధి చెందుతున్న క్రమంలో.. యుద్ధం రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గేందుకు కారణమవుతోంది.
కొన్నేళ్లుగా ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న దుబాయ్.. ఇప్పుడు సేఫ్ హెవెన్ కాదనే నమ్మకం బలపడుతోంది. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు దుబాయ్ని తాకడంతో.. అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టిన భారతీయులతో పాటు మిగతా దేశాల పెట్టుబడిదారులంతా ఆందోళనలో ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా గల్ఫ్ రీజియన్లో ఏ యుద్ధం జరిగినా దుబాయ్ సేఫ్గానే ఉండేది. కానీ.. గడిచిన కొద్దిరోజుల్లో ఇరాన్ మిసైళ్లు నేరుగా పోర్టులు, ఎయిర్పోర్టులు, రెసిడెన్షియల్ ఏరియాలని తాకడంతో.. ఆ నమ్మకం సడలింది. వీటి వల్ల భౌతికంగా జరిగిన నష్టం తక్కువే అయినా.. దుబాయ్ ఎప్పటికీ సేఫ్ అనే భద్రత, నమ్మకం దెబ్బతిన్నాయ్. ఎయిర్లైన్ సర్వీసులు నిలిచిపోవడంతో.. ట్రాన్సిట్ హబ్గా ఉన్న దుబాయ్ ప్రతి నిమిషానికి మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది.
యుద్ధం దెబ్బకు.. రియల్ ఎస్టేట్పైనా భారీ ఇంపాక్ట్ పడింది. 2022 నుంచి 2025 మధ్య దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. 60 నుంచి 70 శాతం వృద్ధిని చూసింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు తలకిందులైపోయాయ్. 2025లో జరిగిన అమ్మకాల్లో.. 65 శాతానికి పైగా ఆఫ్-ప్లాన్ ప్రాజెక్టులే ఉన్నాయ్. యుద్ధ భయంతో.. కొత్త ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. దిగ్గజ కంపెనీల షేర్లు కూడా పడిపోయాయ్. అంతర్జాతీయ బ్యాంకులు కొత్తగా లోన్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయ్. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారతీయుల వాటానే అత్యంత కీలకం. దుబాయ్లో విదేశీ పెట్టుబడిదారుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. 3 నుంచి 8 కోట్ల బడ్జెట్లో ఇళ్లు కొన్న వాళ్లంతా.. రీ-సేల్ వాల్యూ పడిపోతుందేమోనని భయపడుతున్నారు. అయితే, బిలియనీర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు కొన్న అల్ట్రా లగ్జరీ విల్లాలు ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నాయ్. ఇండియన్ డెవలపర్స్ కూడా దుబాయ్లో భారీ ప్రాజెక్టులు చేపట్టారు. వీరికి కూడా ఇప్పుడు డిమాండ్ తగ్గడం.. తలనొప్పిగా మారింది.
దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో టూరిజం బ్యాక్ బోన్ లాంటిది. షార్ట్ టర్మ్ ప్రాపర్టీల ద్వారా ఆదాయం పొందుతున్న వారికి బుకింగ్స్ రద్దవడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. రంజాన్, సమ్మర్ సీజన్ వేళ టూరిస్టుల రాక తగ్గడం వల్ల రిటైల్ మార్కెట్ కుదేలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి.. దుబాయ్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోలేదు. కానీ.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. యుద్ధ మేఘాలు ఎప్పటికి తొలగుతాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో.. ఆస్తుల ధరలు 15 నుంచి 20 శాతం దాకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసినవారు కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితులు కూడా లేవు. అయితే, దుబాయ్ ఈ సంక్షోభం నుంచి ఎంత త్వరగా కోలుకుంటుందన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్.
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, మిసైల్ దాడులతో.. దుబాయ్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే ఇమేజ్.. ఈ పరిణామాలతో మసకబారింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు పెట్టుబడిదారులు సహజంగానే ఆందోళన చెందుతారు. కానీ.. దుబాయ్పై ఏకంగా బాంబు దాడులే జరగడంతో.. ఇంతకుముందెన్నడూ కనిపించని టెన్షన్ ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. దశాబ్దకాలంగా దుబాయ్ అంటే కేవలం టూరిజం డెస్టినేషన్ మాత్రమే కాదు.. పశ్చిమాసియా ఆర్థిక రాజధానిగా ఎదిగింది. ఇక్కడ మిసైళ్లు, యుద్ధ వాతావరణం అనేది ఎవరూ ఊహించని ఎలిమెంట్. ఇన్వెస్టర్లు ఎప్పుడూ స్థిరత్వాన్ని కోరుకుంటారు. తాజా దాడులతో.. దుబాయ్ నాట్ సేఫ్ అనే భావన టూరిస్టుల్లోనూ, ఇన్వెస్టర్లలోనూ కలిగింది. గల్ఫ్ దేశాలు భౌగోళికంగా ఇరాన్కు దగ్గరగా ఉండటంతో.. తమ ఆస్తులకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
దుబాయ్ ఎకానమీకి రియల్ ఎస్టేట్ అనేది వెన్నెముక లాంటిది. ఇక్కడ పెట్టబడి పెట్టేవారిలో భారతీయులు, యూరోపియన్లు, రష్యన్లు, చైనా వాళ్లు ఎక్కువ. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లోనూ.. గతంలో దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్పోలు నిర్వహించారు. వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ, స్టేబుల్ కరెన్సీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్యాక్స్ ఫ్రీ హై-రెంటల్ ఇన్కమ్, పదేళ్ల వరకు గోల్డెన్ వీసా, తక్కువ వడ్డీ రేట్లు, జీరో ట్యాక్స్, ఇండియాలోని మెట్రో నగరాల్లో ఉన్న రేట్లతో పోలిస్తే.. తక్కువ రేటు అని ప్రమోట్ చేశారు. అంతేకాదు.. జీరో పర్సెంట్ ప్రాపర్టీ ట్యాక్స్, వన్ పర్సెంట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, ఎనిమిదేళ్ల పేమెంట్ ప్లాన్, ఫైవ్ స్టార్ రేటెడ్ ప్రాపర్టీ, దుబాయ్కి ఫ్రీ ట్రిప్స్ అంటూ ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నారు. కోటిన్నర, 2 కోట్ల లోపే రేట్లు పెట్టి.. డబుల్, ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్లు, విల్లాలపై ఇన్వెస్ట్ చేయాలని ఆఫర్లు ఇచ్చారు. దాంతో.. భారతీయులే దాదాపు లక్ష కోట్ల దాకా పెట్టుబడులు పెట్టారు. అక్కడ.. విల్లాలు, ఫ్లాట్లు కొనుక్కొని అద్దెకు ఇచ్చారు. కానీ.. ఇరాన్ దాడులతో మొత్తం లెక్కే మారిపోయింది. పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తతలతో.. లావాదేవీల్లో వేగం తగ్గిపోతుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు కొంత కాలం ఆగుతారు. వృద్ధి రేటు కూడా నమ్మెదించే అవకాశాలున్నాయ్.
యుద్ధం ఎప్పుడొచ్చినా.. ఎక్కడొచ్చినా.. మొట్టమొదట ఎఫెక్ట్ అయ్యేది టూరిజమే. విమాన సర్వీసుల రద్దు, ఆకాశ మార్గాల మార్పు వల్ల టూరిస్టుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇప్పటికే దుబాయ్లో ఉన్న విదేశీయులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తిరిగి ఎప్పటికి వస్తారో తెలియదు. పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆలోచిస్తారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసినోళ్లు.. ఇప్పటికిప్పుడు అమ్మేద్దామనుకున్నా రేటు రాదు. పోనీ.. రెంట్కి ఇద్దామంటే.. ఖాళీ చేసి వెళ్లిపోయే వాళ్లు తప్ప.. వచ్చే వాళ్లు ఉండరు. ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత, పర్యాటక రంగం కోలుకునేందుకు.. కొని నెలల టైమ్ పడుతుంది. ముఖ్యంగా.. యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదు. అవి తగ్గిన ఆరు నెలల తర్వాత.. దుబాయ్లో మళ్లీ స్థిరత్వం వస్తుంది. దుబాయ్ చరిత్రని చూస్తే.. సంక్షోభాల నుంచి వేగంగా కోలుకునే శక్తి ఉంది. అక్కడ ఉన్న వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరెక్కడా లేదు. ఇది.. ఇన్వెస్టర్లను తిరిగి ఆకర్షిస్తుందని నమ్ముతున్నారు. కొందరు స్మార్ట్ ఇన్వెస్టర్లు అయితే.. ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే ధరలు తగ్గుతాయని ఆశించి పెట్టుబడులు పెడతారు. కానీ.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే దుబాయ్ మాత్రమే కాదు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటోంది.
ఈ క్లిష్ట సమయంలో.. యూఏఈ ప్రభుత్వం కూడా దౌత్యపరంగా తెలివిగా వ్యవహరిస్తోంది. ఎవరి పక్షం వహించకుండా.. శాంతిని కోరడం వల్ల.. గ్లోబల్ బిజినెస్ హబ్గా తన గుర్తింపుని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎందుకంటే.. ప్రపంచ ఆర్థిక, లైఫ్స్టైల్ సెంటర్గా దుబాయ్ కనిపిస్తోంది. ఇక్కడ అనేక మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుండటం, పాలసీల్లో సరళత్వం, దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు బలమైన మద్దతు అందిస్తోంది. దుబాయ్ గనక తన పూర్వ వైభవాన్ని అందుకోవాలంటే.. యుద్ధం ముగిసిన తర్వాత ఏడాది నుంచి ఏడాదిన్నర నిలకడైన శాంతి అవసరమవుతుంది. అప్పుడే.. సేఫ్ హెవెన్ అనే ఇమేజ్ మళ్లీ బలపడుతుంది. అప్పటివరకు.. దుబాయ్పై ఆందోళనలు ఇలాగే ఉంటాయ్.
Also Read: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం భరోసా, తెలంగాణ ప్రగతికి యాక్షన్ ప్లాన్ ఇదే
Story by: Anup, Big Tv