Etala Rajender: నిన్నటి దాకా ఈటల రాజేందరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులతో రాజేందర్ను ఆ పదవి వరిస్తుందా? లేదా..? అనేది చర్చినీయంశంగా మారింది. కొత్త స్టేట్ ప్రెసిడెంట్ను ప్రకటించడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. నిన్నమొన్నటి దాకా ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసుల పేరుతో తెలంగాణ అధ్యక్ష నియామకం మరింత వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ పార్టీలో స్టార్ట్ అయిందట. ఇంతకు అధ్యక్షుడి కుర్చీపై ఈటల రాజేందర్కున్న ఆశలు నెరవేరతాయా..?
ఈటలకు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టీస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గత 14 నెలల నుంచి కాలేశ్వరం కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగు బాటుకు కారణాలపై అధికారగణాన్ని జుడీషియల్ విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిటీ ప్రస్తుతం పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ చేసింది. అదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్హాట్ చర్చలకు దారితీస్తోంది. అంతేకాదు ఇటు బీజేపీలో అటు బీఆర్ఎస్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు నోటీసులు జారీ అవ్వడం కలకలరం రేపుతోంది.
బీఆర్ఎస్ ప్రభత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల
గత బీఆర్ఎస్ ప్రభత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కీరోల్ పోషించిన ఈటల రాజేందర్ కాలేశ్వరం నిర్మాణ వైఫల్యంలో ఎలాంటి పాత్ర పోషించారు? లక్ష కోట్లతో నిర్మాణం జరగడం? కుంగుబాటుకు గురవ్వడం? అందుకు కారణాలేంటనేది కమిషన్ విచారణ చేస్తోంది. నిర్మాణ సమయంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పాత్ర ఏంటనేది తేల్చడానికి ఆయన్ను విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాలేశ్వరం బ్యారేజీల లొకేషన్ మార్పు, ప్లానింగ్, డ్రాయింగ్, డిజైన్, నిధుల విడుదల, నిర్మాణం, వైఫల్యంలో.. ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్రమంతా జరుగుతోందట.
రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈటల ఎపిసోడ్
ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే నెల 5న కమిషన్ ముందుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు అంతకంటే ముఖ్యంగా ఎంపీ ఈటల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. నిన్నటిదాకా ఈటల రాజేందర్ అధ్యక్ష పదవిని వ్యతిరేకిస్తున్న పాత నేతలoదరికీ.. కమిషన్ ఇచ్చిన నోటీసులు అస్త్రంగా మారిందని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్తో పాటు కాషాయ వర్గాలు అంటున్నాయంట.
రాజేందర్ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కామెంట్లు
ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో కొత్త, పాత నేతల పంచాయితీ తారస్థాయిలో ఉంది. వలస వచ్చిన కొత్త నేతలెవరికీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకూడదని పాత నేతలంతా కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. బండి సంజయ్ లాంటి నేతలు ఏకంగా అర్బన్ నక్సలైట్లు అని పరోక్షంగా ఈటల రాజేందర్ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్కు కాలేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులు పెద్ద స్పీడ్ బ్రేకర్లా మారాయంటున్నారు.
ఆపరేషన్ సింధూర్ వచ్చి తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక పంచాయితీకి ఉపశమనం
ఇప్పటికే సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అంశంలో గత ఏడాది నుంచి ఎటు తేల్చుకోలేక తర్జనభర్జన పడుతోంది. పాత నేతలకి ఇవ్వాలా..?కొత్త నేతలకు ఇవ్వాలా..? పాత నేతలకు ఇస్తే కొత్త నేతలతో సమస్య … కొత్త నేతలకు ఇస్తే పాత నేతలతో సమస్య ఉండటంతో అధిష్టాన పెద్దలు ఎటు తేల్చుకోలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ వచ్చి తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక పంచాయితీకి కొంతవరకు ఉపశమనం ఇచ్చినప్పటికీ.. తాజాగా మరో సమస్య వచ్చి పడినట్లైంది. కాలేశ్వరం కమిషన్ ఈటల రాజేందర్ కు ఇచ్చిన నోటీసులతో అధ్యక్ష ఎన్నిక మరింత ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
Also Read: సినిమా చూపిస్తా.. జగన్ కొత్త ప్లాన్!
ఈటలకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు పెండింగ్ లో పెడతారా?
అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కే ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్ అయిందని ఒకవైపు టాక్ వినిపిస్తుంటే… మరోవైపు ఆయనకు అధ్యక్ష పదవి దక్కకుండా పాత నేతలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటలకు కమిషన్ ఇచ్చిన నోటీసులు ఇవ్వడంతో అధిష్టాన పెద్దలు అధ్యక్ష ఎన్నికపై సందిగ్ధంలో పడ్డారంటున్నారు. అధ్యక్ష ఎన్నికపై కొత్త, పాత నేతల పంచాయితీలతో ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కాలేశ్వరం ఎపిసోడ్లో ఈటల రాజేందర్ కు క్లీన్ చిట్ వచ్చేంతవరకు అధిష్టానం అధ్యక్ష ఎన్నిక మరికొంత కాలం హోల్డ్లో పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గులాబీపార్టీలో కేసీఆర్కు కుడి భుజంగా పనిచేసిన ఈటల
తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలో కేసీఆర్కు కుడి భుజంగా పనిచేసిన ఈటల రాజేందర్ కాలేశ్వరం బ్యారేజీలపై కమిషన్ ముందు ఏం సమాధానం చెబుతారు?…ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది? హాట్ టాపిక్గా మారింది. ఈటల కారు దిగి కాషాయ పార్టీని నమ్ముకుని పొలిటికల్ కెరీర్లో ముందుకు వెళ్తున్నారు. అదీకాక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్పైనే పోటీ చేశారు. కేసీఆర్పై ఒంటికాలితో లెగుస్తున్న ఈటల కమిషన్ విచారణలో గులాబీబాసపై బాంబులు పేలుస్తారా? ఈటలకు బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది? ..అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేస్తారా?…లేక ప్రకటిస్తారా? అన్న అంశాలు మిలియన్ డాలర్ల ప్రశ్నుగా తయారయ్యాయిప్పుడు.