Bheem Reddy: ఏసీబీ రిమాండ్ రిపోర్టులో డీఎస్పీ భీమ్రెడ్డికి సంబంధించిన షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. ఫ్యామిలీ సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోతో… మణికొండలోని ఓ విలువైన ఆస్తి కొనుగోలు కోసం భీమ్రెడ్డి డీల్ కుదుర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం దాదాపు 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా కూడా ఇచ్చారట. ఈ లావాదేవీల వివరాలన్నీ భీమ్రెడ్డి తన పర్సనల్ డైరీలో రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ డైరీనే ఏసీబీకి కీలక ఆధారంగా మారింది.
ముక్కున వేలేసుకున్న అధికారులు
అంతేకాదు… ఆస్తుల విషయంలో భీమ్రెడ్డి ఎంత పక్కా ప్లానింగ్తో వ్యవహరించాడో చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. బినామీల పేర్లపై ఆస్తులు కొనే ముందే, అవసరమైతే వాటిని వెనక్కి తీసుకునేలా ‘క్యాన్సిలేషన్ డీడ్లపై’ ముందే సంతకాలు చేయించుకున్నాడు. ఇలాంటివి దాదాపు 30కి పైగా డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో దొరకడం సంచలనం రేపుతోంది.
కమర్షియల్ ప్రాజెక్టుల వెనుక భీమ్రెడ్డి హస్తం..?
ఇక మణికొండ మర్రిచెట్టు జంక్షన్ దగ్గర కడుతున్న భారీ కమర్షియల్ ప్రాజెక్టుల వెనుక కూడా భీమ్రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ నిషేధిత జాబితాలో పెట్టిన భూముల్లో… ఎలాంటి పర్మిషన్లు లేకుండానే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన రెండు పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించినట్లు తెలుస్తోంది. భీమ్రెడ్డి అండ చూసుకునే సదరు బిల్డర్.. ప్రీ లాంచ్ పేరుతో జనం నుంచి ఏకంగా 800 కోట్ల రూపాయలు వసూలు చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఆ బిల్డింగ్స్లోనే భీమ్రెడ్డి పేరుతో 500 చదరపు అడుగుల స్థలం ఉన్నట్లు ఏసీబీ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.
కేసును సీరియస్గా తీసుకున్న ఏసీబీ అధికారులు
మొత్తానికి ఈ కేసు… కేవలం ఒక డీఎస్పీ అక్రమాస్తుల దగ్గరే ఆగిపోలేదు. సినీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ మాఫియా, బినామీ లావాదేవీల వరకు దీని నెట్వర్క్ విస్తరించినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఏసీబీ అధికారులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయో? ఈ అవినీతి సామ్రాజ్యం ఇంకెంత పెద్దదో చూడాలి.