Madhav vs Prakash: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి సంబంధంలేని మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి ద్వయంపై గుర్రుగా ఉన్నరంట అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి. బాబాయ్, అబ్బాయ్ల వరుసయ్యే ఇద్దరు కేతిరెడ్డిలు రాప్తాడులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను ప్రమోట్ చేయడానికి చూస్తున్నారని తోపుదుర్తి బ్రదర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. తోపుదుర్తి సోదరులు ఇప్పటికే వరుస కేసులతో సతమతమవుతూ.. నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. దాన్ని ఆసరా చేసుకుని రాప్తాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారంట హిందూపురం వైసీపీ మాజీ ఎంపీ.. ఆయనకు ఆ బాబాయ్, అబ్బాయ్లు సపోర్ట్ చేస్తుండటం తోపుదుర్తి టీమ్కి మింగుడుపడటం లేదంట. అసలు రాప్తాడు వైసీపీలో ఏం జరుగుతోంది?
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వరుస కష్టాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఏ ముహూర్తాన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ఎపిసోడ్ మొదలైందో ఆ రోజు నుంచి ప్రకాష్రెడ్డి బ్రదర్స్పై వరుస కేసులు నమోదవుతున్నాయి.. మొదట రామగిరి ఎంపీపీ ఎన్నికల గొడవ కేసు , తన పార్టీ ఎంపీటీసీలను కాపాడుకునే క్రమయంలో పోలీసులపైకి తిరగబడటం, టీడీపీ నాయకులు, పోలీసుల మీదికి దూసుకెళ్లడంతో వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు.
టీడీపీ నాయకులు, పోలీసుల మీదికి దూసుకెళ్లడంతో కేసులు
ఆ క్రమంలో పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు కురుబ లింగమయ్య హత్య జరగడంతో ఆయన్ని పరామర్శించేందుకు వచ్చారు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్. అప్పుడు హెలికాప్టర్ దగ్గరికి జనం దూసుకొచ్చారు. దాంతో విండ్షీల్డ్ దెబ్బతింది. ఆ తర్వాత జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. తమ పార్టీ అధ్యక్షుడికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రకాష్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. దాంతో.. ఆ ఎపిసోడ్ మీద ఏపీ సర్కారు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
నెల రోజులకు పైగా అజ్ఞాతంలో గడుపుతున్న తోపుదుర్తి
అసలు హెలికాప్టర్ దగ్గరికి జనం అంతలా దూసుకురావడానికి కారణం ఎవరని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ప్రకాశ్ రెడ్డి పై మరో కేసు నమోదు చేశారు సీకే పల్లి పోలీసులు. ఆ తర్వాత సదరు కేసులు అన్నటిలో బెయిల్ వచ్చినప్పటికీ.. రామగిరి మండలంలోని దళిత మైనర్ బాలికపై టిడిపి నేతలు అత్యాచారం చేశారు అంటూ.. ఆ అమ్మాయిని పరామర్శించేందుకు వెళ్లి అక్కడ మరో కేసు పెట్టించుకుని సుమారు నెల రోజులకు పైగా తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అజ్ఞాతంలో గడుపుతున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైసిపి నాయకులు నుంచి ఆయనకు సహకారం కరువైందంట.
తోపుదుర్తికి, గోరంట్ల మాధవ్ల మధ్య విభేదాలు
గత ఎన్నికల నాటి నుంచి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డికి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే వరుస కేసుల్లో ప్రకాష్ రెడ్డి రాప్తాడుకు దూరంగా ఉండటంతో రాప్తాడులో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి కొంతకాలంగా గోరంట్ల మాధవ్ ప్రయత్నించారంట. అయితే తర్వాత తోపుదుర్తి ఫిర్యాదు మేరకు అధిష్టానం మొట్టికాయలు వేయడంతో మాధవ్ కాస్త మెత్తబడ్డట్టు కనిపించిన మాధవ్, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొంతమంది కీలక వైసిపి నాయకుల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారంట..
మాధవ్కు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దరెడ్డిల సపోర్ట్
అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు బాబాయ్ అబ్బాయిలైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు గోరంట్ల మాధవ్ ను ప్రతి విషయంలో వెనుక ఉండి నడిపిస్తున్నారని ఫీల్ అవుతున్నారట ప్రకాష్ రెడ్డి. అంతేకాదు ఇటీవల పెద్దారెడ్డిని పరామర్శించేందుకు గోరంట్ల మాధవ్ ఆయన ఇంటికి రావడం.. అక్కడ పెద్దారెడ్డి, మాధవ్ ఇద్దరు రాసుకుపూసుకు తిరగడం తోపుదుర్తి బ్రదర్స్కు అసలు నచ్చడంలేదంట. దాంతో తోపు బ్రదర్స్ లో ఒకరు పెద్దారెడ్డి ఫోన్ చేసి ఈ విషయంపై చర్చించారట.. మాధవ్ని వెనకేసుకొని రావద్దని పెద్దారెడ్డికి చెప్పారట.
ధర్మవరం సీటు మాధవ్కు ఇప్పించ్చే ప్రయత్నం చేసిన ప్రకాష్రెడ్డి
అయితే గోరంట్ల మాధవ్ను ఎంకరేజ్ చేయడానికి బాబాయి అబ్బాయిలకు కూడా ఒక కారణం ఉందని గుసగుసలాడుకుంటున్నారు. గతంలో ధర్మవరం సీటుని గోరంట్ల మాధవ్ కు ఇప్పించ్చే ప్రయత్నం చేశారట ప్రకాశ్ రెడ్డి. దీంతో ఇదే మాధవ్ ని అడ్డుపెట్టుకొని బాబాయ్ – అబ్బాయ్ లు రాజకీయం చేస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆ క్రమంలో వరుస కేసులు పెట్టించుకుని బలమైన పరిటాల కుటుంబంపై పోరాడుతున్నామన్న సానుభూతి కూడా లేకుండా మాధవ్ని ఎంకరేజ్ చేస్తుండటంతో బాబాయి అబ్బాయిలపై గుర్రుగా ఉన్నారట తోపుదుర్తి సోదరులు.
Also Read: తెలంగాణ బీజేపీ ప్రక్షాళన దిశగా అడుగులు
రామగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయిస్తున్న తోపుదుర్తి
రాప్తాడుకు దూరంగా ఉంటున్నా అక్కడి రాజకీయాలను మాత్రం హాట్ హాట్ గా నడిపిస్తున్నారు ప్రకాష్ రెడ్డి.. ముఖ్యంగా రామగిరి ఎంపీపీ ఎన్నికను వరుసగా 3 సార్లు వాయిదా వేయించడంలో సఫలీకృతమయ్యారు.. వైసీపీ మండల కమిటీ ఎన్నికలను కూడా ఎక్కడో ఉంటూనే నడిపించారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా గోరంట్ల మాధవ్ను ఎంకరేజ్ చేయడం బాగా లేదని వైసీపీ నేతలతో అంటున్నారంట ఆయన. ప్రకాష్ రెడ్డికి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి రాప్తాడుకు తిరిగి వచ్చేంతవరకు ఈ విభేదాలకు ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. మరి తోపుదుర్తి బ్రదర్స్ అన్ కండీషనల్గా రాప్తాడులో ఎప్పటికి తిరగగలుగుతారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv