ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీ కానీ అంతో ఎంతో బలంగా ఉన్న స్థానాల్లో కళ్యాణదుర్గం ఒకటి.. వైసీపీ బలంగా ఉంది అనేకంటే టీడీపీ కి ఇన్ని రోజులు సరైన నాయకుడు లేకపోవడంతో అక్కడ వైసీపీ బలపడిందని చెప్పవచ్చు.. 2004 , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కానీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ గెలుపొందడానికి ప్రధాన కారణం టీడిపి కి సరైన నాయకుడు లేకపోవడమే అన్న అభిప్రాయం ఉంది.
ఇక 2024 లో వైసీపీ నుంచి ఉష శ్రీ చరణే అభ్యర్థి అనుకున్నారు. కానీ ఆమెపై అవినీతి , భూకబ్జా ఆరోపణలు ఎక్కవగా రావడం, సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టించడం ఆమె అభ్యర్థిత్వం పై స్థానిక వైసిపి శ్రేణులు ఎదురుతిరగడంతో ఉష శ్రీ చరణ్ని కళ్యాణదుర్గం నుంచి సత్యసాయి జిల్లా పెనుగొండ కు మార్చారు. కళ్యాణ్ దుర్గం వైసీపీ నుంచి అప్పటి అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను అభ్యర్థిగా నిలబెట్టారు. అంతవరకు బాగానే ఉన్నా టిడిపి అభ్యర్థి అయిన సురేంద్రబాబులు ఢీ కొనడం రంగయ్య వల్ల ఏమాత్రం కాలేదు.
సురేంద్ర బాబు ఆర్థిక , అంగ బలం ముందు రంగయ్య తేలిపోయారు. ఎమ్మెల్యే స్థానానికి సురేంద్ర బాబు కొత్త అయిన రాజకీయానికి ఏ మాత్రం కొత్త కాదని నిరూపించారు. తన రాజకీయ ప్రత్యర్ధి రంగయ్య కంటే ప్రచారం ఎంతో లేట్ గా స్టార్ట్ చేసిన లేటెస్ట్ గా దూసుకుపోయాడు. టిడిపికి సరైన నాయకుడు లేడు అనుకున్న కళ్యాణదుర్గం లో అన్ని తానే టీడిపి నీ నడిపించాడు. అసలు కళ్యాణ్ దుర్గం లో టిడిపికి ఎప్పుడు రానంత మెజార్టీ తీసుకొచ్చి జిల్లాలోని అత్యధిక వోట్ షేర్ తో గెలుపొందారు. అక్కడి నుంచి నియోజకవర్గంలో వైసిపి కి అసలైన కష్టాలు మొదలయ్యాయి.
Also Read: ఆళ్ల నానితో పాటు టీడీపీలోకి ఇద్దరు వైసీపీ కీలక నేతలు
కళ్యాణదుర్గంలో టిడిపి గెలిచిన తర్వాత వైసిపి క్యాడర్ అండ్ లీడర్స్ పూర్తిగా నీరసపడిపోయారు. ఎన్నికల తర్వాత కళ్యాణదుర్గం వైసీపీ మూడు వర్గాలుగా చీలిపోయింది. తలారి రంగయ్య వర్గం, ఉష శ్రీ చరణ్ వర్గం, ఇక అప్పుడే కొత్తగా పార్టీలో చేరిన ఉమామహేశ్వరనాయుడు వర్గం.. ఇలా మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు సాగుతోంది వారి తీరు.. ఓటమికి తోడు ఈ గ్రూపుల గోలతో అందరూ పార్టీని పట్టించుకోవడం మానేసారు.
అసలు కళ్యాణదుర్గం లో వైసిపి కి లీడర్ ఎవరో తెలియని పరిస్థితి.. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావస్తున్నా కనీసం ఒక్క వైసిపి నాయకుడు కూడ బయటికి రావడంలేదట. కనీసం ఒక్క ఆందోళన కార్యక్రమం కూడ నిర్వహించకుండా ఏదో ఉన్నమంటే ఉన్నాం అనుకుంటూ మమ అనిపించేస్తున్నారట. ఇటీవల కళ్యాణదుర్గం వైసిపి ఇన్చార్జి నీ మారుస్తున్నారు అని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. అసలు ఎందుకీ ప్రచారం సాగుతోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిగతా చోట్ల లేని ప్రచారం అక్కడ ఒక్కచటే ఎందుకు జరుగుతుందనేది చర్చల్లో నలుగుతుంది.
కళ్యాణదుర్గంలో మొదట వైసీపీ అభ్యర్థిగా రంగయ్యను అనుకున్నప్పుడు ఆయన ఒక్కడే పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఉషా శ్రీ చరణ్ పెనుగండకు షిఫ్ట్ అవ్వడంతో ఆమె వర్గం కూడా రంగయ్య వెంటే నడవాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటివరకు కళ్యాణదుర్గం టిడిపి ఇన్చార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ని వైసీపీలోకి చేర్చుకొని రంగయ్య తన కాళ్ల కిందకు తానే నీళ్ళు తెచ్చుకున్నారు. తన గెలుపుకు ఉపయోగపడతాడు అని పార్టీలోకి చేర్చుకున్న ఉమామహేశ్వర నాయుడు చివరికి వైసీపీలో రంగయ్యకి ఎర్త్ పెట్టేలా కనిపిస్తున్నాడని ప్రచారం సాగుతుంది. నిజానికి కళ్యాణదుర్గంలో రంగయ్య కంటే అంతో ఇంతో ఉమామహేశ్వర్ నాయుడుకి బలగం ఎక్కువగా ఉంది. కాకపోతే ఆయన టీడిపి నుంచి రావడంతో ఉమా కు ఇన్చార్జి పోస్ట్ వద్దని ఇతర నాయకులు అడ్డుపడుతున్నారంట.
అనంత వైసిపినీ అన్ని తానై చూసుకొనే పెద్దిరెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందో వారికే ఈ నియోజకవర్గం ఇన్చార్జి పోస్టు వస్తుంది అని ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం అలా ఉంటే కళ్యాణదుర్గం వైసీపీ ఇన్చార్జ్ పదవి తనకేనని ఇటీవల మీడియా సమావేశం పెట్టి మరి చెప్పారు తలారి రంగయ్య.. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తో కలిసి ప్రెస్ మీట్ లలో పాల్గొంటున్నారు. అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి రంగయ్య ప్రెస్మీట్లలో పాల్గొనడం కూడా కొత్త చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే అనంత వెంకట్రాంరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి స్వయాన వియ్యంకుడు కావడంతో రంగయ్య అటు వైపు నుంచి నరుకొచ్చే పనిలో పడ్డారంటున్నారు.
మరోవైపు ఉమామహేశ్వరనాయుడు నియోజకవర్గంలో తనే వైసీపీ ఇన్చార్జ్నన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి కళ్యాణ్ దుర్గం లో బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కొనడానికి దారులు వెతుక్కోవాల్సిన వైసిపి వర్గ విభేదాలతో రోడ్డున పడుతుండటం కేడర్కు మింగుడుపడటం లేదంట. చూడాలి మరి వైసీపీ పెద్దలు అక్కడ పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?