KCR Absence: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా.. అందరి చూపు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్పైనే ఉంటుంది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా గులాబీ బాస్ మాత్రం ఎప్పటిలాగే అసెంబ్లీ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఇంతకీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా ? ఒకవేళ హాజరైతే ఎంత సమయం సభలో ఉంటారు ? సభను ఉద్దేశించి ఏం మాట్లాడతారు ? అధికారం పక్షం పదేపదే టార్గెట్ చేస్తున్నా కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వడానికి ఎందుకు ఇష్టపడటం లేదు?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి శాసనసభా సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఐతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా.. రారా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎందుకంటే కేసీఆర్ రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి కాక ముందే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన గులాబీ బాస్.. నేరుగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్ళి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం అవగాహన లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఆ తరువాత అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొనలేదు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన సమయంలో.. ఆయనకు నివాళి అర్పించి సంతాపం తెలిపేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ సందర్భంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి సభ కు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధాని గా ఉన్న మన్మోహన్ సింగ్ సంతాప తీర్మాన చర్చ కోసం కేసీఆర్ తప్పకుండా వస్తారని అంతా భావంచినా ఆయన మాత్రం ఫాంహౌస్ను విడిచి బయటకు లేదు.
ఇక గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన కేసీఆర్… కేవలం 5 నిమిషాలు మాత్రమే సభలో ఉండి సంతకం చేసి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసలు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ కి వచ్చారు, ఎందుకు వెంటనే వెళ్లిపోయారు అనేది తనకు తెలియదని, ఆ విషయాన్ని ఆయననే అడగాలని యద్దేవా చేశారు. ఇక ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.
ఈ నెల 16వ తేదీ సోమవారం రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం సందర్బంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని పార్టీ క్యాడర్, రాష్ట్ర ప్రజలు భావించినా ఆయన రాలేదు. దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సభలో ప్రస్తావించారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ కి రావడం లేదని ప్రశ్నించారు. 2023, డిసెంబర్ 1 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సూమారు కోటి రూపాయలకు పైగా జీతభత్యాలు పొందారని వెల్లడించారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై సరైన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పుడే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శలు గూప్పిస్తూ, ఆయన సభకు వచ్చి, చర్చల్లో పాల్గొనాలని చెబుతూనే వస్తున్నారు. అయితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, కాంగ్రెస్ కు సమాధానం చెప్పేందుకు తాము చాలని, తమ నాయకుడు కేసీఆర్ అవసరం లేదని బీఅర్ఎస్ నేతలు ప్రకటిస్తున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ కి వస్తే ఆయనను అవమానించాలన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్లాన్ అని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది.
చర్చల్లో పాల్గొని, సీనియర్గా కేసీఆర్ సముచిత సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ అంటుంటే, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనను టార్గెట్ చేసేందుకు అధికార పార్టీ సిద్దంగా ఉందని గులాబీ పార్టీ వాదిస్తోంది. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరింత రెచ్చిపోయేలా ప్లాన్ చేస్తోందని వారు భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను తక్కువ చేసి మాట్లాడే ఛాన్స్ ఉందని, కేసీఆర్ ను అవమానించేలా వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ స్థాయిలో అటాక్ వచ్చినా.. సభలో కేటీఆర్, హరీష్ రావు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి సభా నాయకుని హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి రెగ్యులర్ గా హాజరయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. సభలో అన్ని రకాల విమర్శలు, ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావులే ముందుండి సమాధానం చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని అధికార పార్టీ వైపు నుంచి పట్టుబడుతున్నా.. అవసరం లేదని చెబుతూ.. తామే స్పందిస్తున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఖచ్చితంగా ఆయనను కాంగ్రెస్ నేతలు అవమానిస్తారని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. దీంతో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష కేసీఆర్ హాజరవుతారా.. లేదా అన్నదే ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. కారణాలు ఏవైనా… ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా సైలెంట్ గా ఉంటుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: రేవంత్ రెడ్డి తోపు లీడర్.. మేమిద్దరం అన్నదమ్ములం, మల్లారెడ్డి పొగడ్తలు