కేటీఆర్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు అని. దీని అర్థం.. ఆయన కొన్ని విషయాల్లో క్షమించి వదిలేసినా తాను మాత్రం వదలేదే లేదంటు వార్నింగులు ఇస్తున్నారు. వచ్చేది మేమే అంటున్నారు.. ఇక మిమ్మల్ని వదిలేది లేదని… పోలీస్ ఆఫీసర్లను, ఐఏఎస్ అధికారులను బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారు.
ఇప్పడు ఈ టాపిక్ ఎందుకంటే.. ఇవాళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేటీఆర్ మరోసారి తన మార్కు దూకుడు డైరెక్షన్ను అమలు చేశారు. సమావేశాల సందర్భంగా కేసీఆర్ క్లారిటీగా సభ్యులకు దిశానిర్దేశం చేసి ఉన్నారు. ఏయే అంశాలపై చర్చ జరగాలి..? ఏ విషయాలను సభలో లేవనెత్తాలి? ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ గళం మన నుంచి వినిపించాలి.. అనేది ఆయన ముఖ్యమైన చర్చల గురించి నిర్ధేశం చేశారు.
కానీ కేటీఆర్ దీనికి తన మార్కు డైరెక్షన్ కూడా జోడించారు. నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడం, ఉద్రిక్తత వాతావరణం, తోపులాటలో కేటీఆర్కు గాయాలు.. హరీశ్ రావు తన టీ షర్టు విప్పి బనీనుపై నిరసన.. ఇవన్నీ బీఆరెస్కు మైలేజీని ఇచ్చేవే.
కానీ టీ షర్టులు ధరించి లోనికి వెళ్లేందుకు అనుమతి ఉంది. మరి ఎందుకు బీఆరెస్ సభ్యులను అడ్డుకున్నారు…? ఆ టీ షర్టులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న కారణంగా వీరిని లోపలికి అనుమతించలేదు. ఆ నినాదాలు లేకపోతే లోనికి వచ్చేవారే. ఈ విషయం కేటీఆర్ కు కూడా తెలుసు. మరి ఎందుకు ప్రత్యేకంగా నినాదాలు రాయడం.. ? నల్ల టీ షర్టులతో లోనికి రావడం మూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్టే అవుతుంది.
అలా వెళ్తే సరిపోయేది. కానీ నినాదాలుంటే ఎలాగూ పోలీసులు అడ్డుకుంటారు. హంగామా చేయొచ్చనే కేటీఆర్ పొలిటికల్ స్ట్రాటజీగా దీన్ని చూడాలి. అనుకున్నట్టే అలాగే జరిగింది. గతంలో.. 2024లో జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కూడా ఇలాగే టీ షర్టులు, నినాదాలతో వచ్చారు. లగచర్ల భూములు లాక్కుంటున్నారని, అదానీ, రేవంత్ ఒక్కటే అనే విధంగా ప్లకార్లు ప్రదర్శిస్తూ రావడాన్ని అడ్డుకున్నారు. అరెస్టు చేశారు.
ఆ తరువాత కేవలం నల్ల టీ షర్టులతోనే హాజరైన సభ్యులను మాత్రం లోనికి అనుమతించారు. ఇవాళ కేటీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా.. పోలీసులతో అడ్డుకునేలా చేయడం ద్వారా…ప్రజల దృష్టి తమ పార్టీ పోరాటాల వైపు పడాలనేదే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఆ ఎత్తుగడలో కేటీఆర్ సక్సెసయ్యారు. తన చేతికి తగిలిన గాయన్ని చూపడం.. పోలీసులు అతి చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయానుకోవడం, తమ పాలనలో పోలీసులకు సముచిత ప్రాధాన్యత దొరికిందని గుర్తు చేయడం.. ఇవన్నీ కేటీఆర్ దూకుడు వ్యూహంలో భాగంగానే చూడాలి.
అయితే, ఈ తొలిరోజు సన్నివేశం కేసీఆర్ స్క్రిప్ట్లో ఉన్నది కాదంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.