KV Ramana Reddy: ఆ జిల్లాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే సడన్గా దూకుడు తగ్గించేశారు. తాను సైలెంట్ అవ్వడమే కాదు నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్, లీడర్లను కూడా సైలెన్స్ ప్లీజ్ అంటున్నారట. వివాదాల్లో తలదూర్చొద్దని, పంచాయతీలు తన వద్దకు తేవొద్దని, అసలు సెగ్మెంట్లో ఎలాంటి హడావుడి చేయవద్దని చెప్పేశారంట. సదరు ఎమ్మెల్యే గెలిచింది ఆషామాషీ అభ్యర్ధులపై కాదు. ఆ విజయం కోసం ఆయన ఎవరూ ఇవ్వని హామీలు గుప్పించారు. ఇప్పుడు వాటి ఊసే మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుండటం ఆయన అనుచరులకు కూడా మింగుడుపడటం లేదంట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ?
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. ఇద్దరు ఉద్దండులను ఓడించి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డిలపై కాటిపల్లి అనూహ్య విజయం సాధించారు. గెలిచిన కొద్ది రోజుల పాటు దూకుడుగా ఉన్న సదరు ఎమ్మెల్యే.. కొద్ది రోజులుగా ష్.. గప్ చిప్ అంటూ మౌనం పాటిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్య నేతలు, కార్యకర్తలకు సైతం వివాదాల్లో తలదూర్చొద్దని చెబుతున్నారట. కొద్ది రోజుల వరకు ఏ పంచాయతీలు తన వద్దకు తీసుకు రావొద్దని చెప్పేశారట.
ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన కాటిపల్లి వెంకటరమనారెడ్డి ప్రచారంలో ఘనమైన హామీలు గుప్పించారు . 150 కోట్ల రూపాయల సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని సొంత మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు. అయితే గెలిచి ఏడాది కావస్తున్నా ఆ హామీల ఊసే ఎత్తడం లేదంట. హామీల విషయమై ఓ వైపు ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నా.. ఆయన మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ఎమ్మెల్యే సైలెంట్ అవ్వడంతో ఆయన అనుచరులు కూడా ఎన్నికల హామీలపై ఏం మాట్లాడలేక పోతున్నారంట. ప్రజలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారంట.
Also Read: కేటీఆర్ జర సైడైపో! సారు.. కారు.. వస్తున్నారట!
కాటిపల్లి వెంకటరమణారెడ్డి మౌనం వెనుక వ్యూహాం ఉందటున్నారు ఆయన అనుచరులు.. గ్రామాల వివాదాల్లో వేలు పెడితే.. త్వరలో జరిగే స్దానిక సంస్ధల ఎన్నికల్లో మైనస్ అవుతుందని, అందుకే ఎవరూ వివాదాల జోలికి వెళ్లవద్దని చెప్తున్నారంట. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల పై ఆయన కన్నేశారంటున్నారు. దిగ్గజాలను ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎమ్మెల్యే రమణారెడ్డి.. నియోజకవర్గంలో మరింత పట్టు పెంచుకోవడానికి మౌనంగా పావులు కదుపతున్నారంటున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ.. స్థానిక సంస్థల టికెట్ల ఆశావాహుల్ని గ్రౌండ వర్క్ చేసుకోవాలని సూచించారట.
ఎవరు ఏం అనుకున్నా.. తన పని తాను చేసుకుపోయే కాటిపల్లి.. త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే స్కెచ్ లు వేస్తున్నారంట. మెజార్టీ సీట్లు గెలిస్తే పార్టీలో మరింత పట్టు పెరుగుతుందని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతమున్న పోటీ రాజకీయ వాతావరణంలో దూసుకుపోవాలని, ప్రత్యర్ధుల తప్పులను ఎత్తిచూపితూ దూకుడు ప్రదర్శిస్తే కాని ప్రజల దృష్టి ఆకర్షించలేమని.. అలాంటిది మౌనమునిలా వ్యవహరిస్తే గెలిచేది ఎలా అని పార్టీ కేడర్ అయోమయంలో పడిందంట.
కాషాయ పార్టీ ఎమ్మెల్యే మౌనం అర్దం కాని ప్రజలు.. ఎందుకు గెలిపించామా? అని తలలు పట్టుకుంటున్నారట. మాజీ సీఎం కేసీఆర్ నో.. తాజా సీఎం రేవంత్ రెడ్డి నో గెలిపించుకుంటే కథ వేరేలా ఉండేదని.. ఇద్దరిలో ఎవరు గెలిచినా ప్రతిపక్ష నేత నియోజకవర్గంగానో, లేదా ముఖ్యమంత్రి నియోజవర్గంగానో ఉండేదని గొణుక్కుంటున్నారు కాటిపల్లిని గెలిపించిన కామారెడ్డి ఓటర్లు.. అయితే ఇక్కడ మరో వాదన కూడా గెలిపిస్తుంది. గట్టిగా మాట్లాడితే ప్రత్యర్ధులు, ప్రజలు తాను సొంతగా ప్రకటించిన 150 కోట్ల రూపాయల మ్యానిఫెస్టో గురించి ప్రశ్నిస్తారన్న భయంతోనే ఆయన సైలెంట్ అయ్యారన్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి చూడాలి రానున్న నాలుగేళ్లలో ఎమ్మెల్యే వ్యవహారతీరు ఎలా ఉంటుందో?