TDP vs YCP: జనరల్ ఎలక్షన్స్ ముందు నుంచే ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతూ వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు , సీనియర్ నేతలు వైసీపీకి గుడ్బై చెప్పి కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఆ క్రమంలో కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీకి అక్కడ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైర్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. తన ఛైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్కు పంపారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో డాక్టర్ సుధీర్ తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని.. ఆయన వెంట కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ తెలిపారు.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్క కుప్పంలోనే టీడీపీ విజయం సాధించింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధికార బలాన్ని ఉపయోగించుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సెగ్మెంట్లో ఆధిపత్యం సాధించింది. కుప్పం మున్సిపాల్టీని కూడా కైవసం చేసుకున్న వైసీపీ మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుని కూడా ఓడిస్తామని ప్రగల్భాలు పలికింది. తీరు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయి 151 స్థానాలతో అధికారం చలాయించిన వైసీపీ 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది.
Also Read: ఇవేం పనులు చెవిరెడ్డి పరువు తీస్తున్నావు.. వైసీపీ సీరియస్
ఆ క్రమంలో వైసీపీ నుంచి పెరుగుతున్న వలసలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారిపోతూ వస్తున్నాయి . ఇప్పుడు కుప్పంలో కూడా జగన్కు షాక్ తగిలింది. ఇతర పార్టీల నుంచి వచ్చేవారు తెలుగు దేశం పార్టీలో చేరాలంటే కచ్చితంగా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు కండిషన్ పెట్టారు. ఈ క్రమంలోనే కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకి రాజీనామా చేసిన తర్వాతే తెలుగు దేశం పార్టీలో చేరారు.
రెండు, మూడు నెలల క్రితమే సుధీర్ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. చివరికి సుధీర్ తన అనుచరులతో కలిసి వచ్చి అధికార పార్టీలో చేరారు. అయితే సుధీర్ తన పదవులకు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది.
కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి.. 19 చోట్ల వైసీపీ, ఆరుచోట్ల టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించగా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆయనతో పాటూ 11మంది కౌన్సిలర్లు తెలుగు దేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.. కానీ వైసీపీ నుంచి చేరికలకు టీడీపీ అధిష్టానం నో చెప్పింది.
ఆ తర్వాత రెండు నెలల క్రితం సుధీర్ చేరికలకు సిద్ధంకాగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా డాక్టర్ సుధీర్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన తర్వాత పసుపు కండువా కప్పుకున్నారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ ఓటమి తర్వాత నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా రాజీనామా చేయడంతో కుప్పంలో వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది