RajyaSabha Elections: మధ్యప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు చాలా వేడెక్కాయ్. జూన్ 18న జరగబోయే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున హైకమాండ్ కు దగ్గరి లీడర్ అయిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేయగా.., నెంబర్ లేకపోయినా బీజేపీ తమ మూడో అభ్యర్థిగా మహేష్ కేవట్ ను బరిలోకి దించడంతో మధ్యప్రదేశ్ రాజకీయంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. అసలు మధ్యప్రదేశ్ లో నెంబర్ గేమ్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 230 కాగా, ప్రస్తుతం ఓట్ల సంఖ్య 228 గా ఉంది. ఇందులో బీజేపీ బలం 164 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ బలం 64 మంది ఎమ్మెల్యేలు. రాజ్యసభ రూల్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి విజయం సాధించడానికి కనీసం 58 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. రెండు సీట్లను ఈజీగా గెలవడానికి బీజేపీకి 116 ఓట్లు కావాలి. అయితే తమకున్న 164 ఓట్లలో 116తో ఈ రెండు స్థానాలు కమలం పార్టీకి దక్కుతాయి. అయితే బీజేపీ వద్ద ఇంకా 48 అదనపు ఓట్లు మిగులుతాయి. అంటే మూడో సీటు గెలవడానికి బీజేపీకి కేవలం మరో 10 ఓట్లు మాత్రమే తక్కువవుతున్నాయి. ఏదైనా మ్యాజిక్ పని చేయకపోతుందా అని బీజేపీ అనుకుంటోంది.
కాంగ్రెస్కు పేపర్ మీద 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. గెలవడానికి 58 ఓట్లు చాలు కాబట్టి, టెక్నికల్ గా చూస్తే మీనాక్షి నటరాజన్ గెలుపు కోసం 6 ఓట్లు అదనంగా ఉన్నాయి. బయటి నుంచి చూస్తే గెలుపు కూడా ఈజీనే. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్లు కనిపిస్తున్నా, పార్టీ లోపల ఉన్న కొన్ని సమీకరణాలు మీనాక్షి నటరాజన్కు టెన్షన్ పెట్టిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరని, ఆమెకు హైకమాండ్ కోటాలో సీటు ఇచ్చారని కొందరు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉంది.
Also Read: గుండ్ల పోచంపల్లిలో బయటపడ్డ నయా భూ దందా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్..!
దీన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ క్రాస్ ఓటింగ్కు తెరలేపే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీవైపు ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారంటున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 62కి పడిపోయింది. కాంగ్రెస్ సేఫ్టీ మార్జిన్ చాలా తక్కువగా అంటే 4 సీట్లే ఎక్కువగా ఉంది. మరోవైపు బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ, అలాగే సీఎం మోహన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయ్. హైకమాండ్ ఆదేశిస్తే మూడో సీటు కూడా తమకే వస్తుందని వారు చేసిన ప్రకటనలు రాజ్యసభ పోరును మరింత ఉత్కంఠగా మార్చేశాయ్.
ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ కు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని, ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా చూసుకోగలిగితే మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఎన్నిక కావడం ఖాయం. ఇందుకోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ, ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసి క్యాంప్ లకు తరలించేందుకు కూడా రెడీ అవుతున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో జరిగినట్లుగా బీజేపీ ఆఖరి నిమిషంలో క్రాస్ ఓటింగ్ లేదా ఇతర వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం మీనాక్షి నటరాజన్ కు చెక్ పడే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటుందన్న విషయంపైనే మీనాక్షి రాజ్యసభ గెలుపు ఆధారపడి ఉంటుందంటున్నారు.
Also read: రోజుకు కేవలం 5 రూపాయలే.. Airtel కస్టమర్లకు పండగే.. ఏడాది మొత్తం అన్లిమిటెడ్ కాల్స్!