Majji Srinivasa Rao Vs Kimidi Nagarjuna AP Political News: ఆ ఇద్దరు యువనేతలు తమ పొలిటికల్ కెరీర్పై ఎన్నో కలల కన్నారు. ఫ్యామిలీ పరంగా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో ఈ సారి ఆశించిన సీటు నుంచి పోటీ ఖాయమనుకున్నారు. పైపెచ్చు ఇద్దరూ ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులే అవ్వడంతో తమకు టికెట్ ఖాయమని భావించారు.. ఏళ్ల తరబడి తమ సెగ్మెంట్లలో గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇద్దరి సీట్లు గల్లంతయ్యాయి. ఇంతకీ ఎవరా అన్లక్కీ పార్టీ ప్రెసిడెంట్స్ అంటారా?
అనుకున్నదొక్కటి , అయిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట .. ఈ సిట్యుయేషనల్ సాంగ్.. సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. విజయనగరం జిల్లా వైసీపీ, టీడీపీ అధ్యక్షులకి.. వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునలకు కుటుంబపరంగా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇద్దరూ ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయాలని ఆశించారు. ఎమ్మెల్యేగా గెలిచి తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రి పదవి దక్కించుకోవచ్చని కలలు కన్నారు.
ఒక వేళ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోతే ఎంపీ సీటు గ్యారంటీ అనుకున్నారు. అయితే ఆ యంగ్ లీడర్స్ ఇద్దరికీ ఆ అవకాశం దక్కలేదు.. రెండు పార్టీల పెద్దలు వారికి హ్యాండ్ ఇచ్చారు. సొంత బంధువులే వారికి టికెట్ దక్కకుండా చేశారు. మజ్జి శ్రీనుకి ఆయన మేనమామ, మంత్రి బొత్స సత్యనారాయణ టికెట్ దక్కకుండా పావులు కదిపి సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కిమిడి నాగార్జున ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జ్గా నాలుగున్నరేళ్ల నుంచి పనిచేసుకుంటుంటే.. ఆయన పెదనాన్న కిమిడి కళా వెంకటరావు చివరి నిముషంలో ఆ టికెట్ ఎగరేసుకుపోయారు.
Also Read: అర్థరాత్రి టీడీపీ ఆఫీసుకు నిప్పు, బాబు టూర్ తర్వాత
నిజానికి ఇద్దరికి ఇద్దరూ ఆయా పార్టీల కోసం కష్టపడి పని చేస్తూ వచ్చారు. చిన్న శ్రీను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా పదవులకు సమన్యాయం చేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రెస్మీటలు పెట్టి చంద్రబాబు, అశోక్ గజపతిలపై విమర్శలు గుప్పించేవారు. రాజులకు వెయ్యి ఓట్లు లేకపోయినా పదవులను మాత్రం బాగానే అనుభవించారని జిల్లాను మాత్రం వెనకబడిన జిల్లాగానే ఉంచారని తీవ్ర విమర్శలు గుప్పించేవారు.
ఇక సొంత పార్టీలోనూ తనదైన మార్క్ చూపించారు.. తలలుపండిన సంబంగి చిన అప్పలనాయుడు, రాజన్న దొరలాంటి సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా తన కనుసన్నల్లోనే పని చేసేలా కోటరీ నిర్మించుకున్నారు. మేనమామ బొత్సని తప్ప మిగలిన వారందరిని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగారు. ఆ తాను చెప్పినవాళ్ళకే వైసీపీ టికెట్లు దక్కుతాయన్నట్లు ప్రవర్తించారు. అయితే ఆయనకానీ అది శృతి మించిందో, మితిమీరిందో మరి. చీపురుపల్లిలో మామ స్థానంపై కన్నేయడంతో కథ అడ్డం తిరిగింది. మొదటి జాబితాలో ఎంపి టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ బొత్సా అది దక్కకుండా చేయగలిగారు
ఇక ఫారిన్ లో జాబ్ చేసుకుంటూ కోట్లు సంపాదించుకునే కిమిటి నాగార్జున తల్లి కిమిడి మృణాళిని మంత్రి అయిన తరువాత రాజకీయాలపై ఆసక్తితో చీపురుపల్లిలో ఎంట్రీ ఇచ్చారు. 2019 లో చీపురుపల్లి నుంచి బొత్సపై ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. పోయిన దగ్గరే వెతుక్కోవడానికి అయిదేళ్లుగా ప్రజల్లోనే ఉన్నారు. ఎక్కడ రాజీ పడకుండా బొత్సతో ఢీ అంటే ఢీ అన్నారు.. జిల్లాలో అశోక గజపతి ఆశీస్సులు కూడా సంపాదించారు. జిల్లా అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలా కష్టపడ్డారు.
Also Read: లైట్స్.. కెమెరా..యాక్షన్..
అయితే పొత్తుల ఈక్వేషన్లు, పెదనాన్న కళావెంకట్రావు సీనియార్టీ ఆయనకు టికెట్ దక్కకండా చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల సీటు జనసేనకు కేటాయించిన చంద్రబాబు. అక్కడ టికెట్ ఆశించిన కళావెంకట్రావుకి చీపురుపల్లి టికెట్ కేటాయించారు. విజయనగరం ఎంపీ టికెట్ అయినా దక్కుతుందని అనుకుంటే.. చివరకి నాగార్జునకు అదికూడా కాకుండా పోయింది. దాంతో నాగార్జున భావోద్వేగానికి గురై. తాపే చేసిన తప్పేంటి అంటూ కార్యకర్తల ఎదుటే కన్నీటిపర్యంతమయ్యారు.
సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంతో చిన్న శ్రీను కొద్ది రోజులుగా కేడర్కి దూరమయ్యారు. నాగార్జున మాత్రం బాహాటంగానే అదిష్టనం నిర్ణయాన్ని విమర్శించారు. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. తన భవిష్యత్తు నాశనమైందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానాలు ఏమని బుజ్జగించాయో..? ఏ హామీలు ఇచ్చాయో..? కాని ప్రస్తుతానికి మాత్రం ఆ ఇద్దరు సైలెంట్ అయ్యారు. చూడాలి వారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో..?