Tamil Nadu: తమిళనాడు స్వయంప్రతిపత్తి దిశగా వేగం పెంచుతోంది. రాష్ట్రాల హక్కులపై బలమైన వాదనలు వినిపిస్తున్న ఆ రాష్ట్రం ఇప్పుడు ఏకంగా తమిళనాడుకు స్వయంప్రతిపత్తి సాధించే దిశగా సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంప్రతిపత్తిపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఒకవైపు కేంద్రం చర్యలతో ఇంకోవైపు తమిళనాడు స్పీడ్ పెంచుతుండడం సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరగబోతోంది?
కేంద్రం-రాష్ట్రం మధ్య నమ్మకమే వారధి
రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి. అంటే ఇండిపెండెంట్ బాడీ. అంటే విభజనకు మరో రూపమిది. ఇది మనదేశంలో సాధ్యమయ్యే విషయమేనా..? రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య స్పష్టమైన నిబంధనలు, అధికారాల విభజన ఉన్నాయి. పరస్పర సహకారం, నమ్మకంతో కథ నడిపించాలి. కానీ అదే మిస్సవుతోందంటోంది తమిళనాడు. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం స్టాలిన్ అసెంబ్లీలో కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడుకు స్వయంప్రతిపత్తి సాధించే దిశగా మొదటి అడుగైతే వేశారు.
తమిళనాడులో స్వయంప్రతిపత్తి కోసం కమిటీ ఏర్పాటు
స్వయంప్రతిపత్తిపై స్టడీ చేసి, ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీలో అశోక్ వర్ధన్ శెట్టి, ఎం.నాగనాథన్ సభ్యులు. శాసనసభలో 110వ నిబంధన కింద ఈ ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమిళనాడుపై పడింది.
కేంద్ర-రాష్ట్ర సంబంధాల బలోపేతం కోసమేనా?
ఈ సందర్భంగా స్టాలిన్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. విభజన దిశగా మాట మాట్లాడకుండా.. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత మెరుగు పరిచేందుకే ఈ కమిటీ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇంటెన్షన్ మాత్రం క్లియర్ కట్ గా కేంద్రానికి అర్థమయ్యేలా బలమైన సిగ్నల్స్ పంపించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న పరిస్థితులు దాపురించాయని, దీనికి సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలను పునఃసమీక్షించాలంటున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అమల్లో ఉన్న విధానాలు, చట్టాలు, సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
రాష్ర్టాల హక్కులను హరిస్తున్నారన్న స్టాలిన్
ఈ కమిటీ 1971లో ఏర్పాటైన జస్టిస్ రాజమన్నార్ కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరిలో మధ్యంతర నివేదికను సమర్పిస్తుందని, రెండేళ్లలో సమగ్రమైన నివేదికను రూపొందిస్తుందని స్టాలిన్ వివరించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తోందని, రాష్ట్రాల జాబితాలోని వైద్య, న్యాయ, ఆర్థిక శాఖలను ఉమ్మడి జాబితాలోకి మార్చే ప్రయత్నాలను వేగవంతం చేసిందని స్టాలిన్ ఆరోపించారు. రిపోర్ట్ వచ్చాక ఏం జరుగుతుందన్నదే ఆసక్తికరంగా మారిన విషయం. ఇదంతా కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న మ్యాటరా.. లేదంటే కమిటీతో కథ మార్చాలనుకుంటున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
రాజ్యాంగం సూచించిన సెన్సిటివ్ బ్యాలెన్స్ క్రాస్ చేస్తోందా?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు సమానంగా పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదు. కానీ కేంద్రం రాష్ట్రాల హక్కులు, అధికారాలను క్రమంగా నీరుగారుస్తూ పెత్తనం సాగిస్తోందని, రాజ్యాంగం సూచించిన సెన్సిటివ్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తోందన్నది సీఎం స్టాలిన్ వాదన. బలహీనమైన రాష్ట్రాలతో బలమైన కేంద్రాన్ని నిర్మించడం సాధ్యమేనా అన్నది ఆయన సంధిస్తున్న ప్రశ్న.
Also Read: అమెరికాకు డ్రాగన్ భారీ షాక్..! ఖనిజాల ఎగుమతికి చైనా బ్రేక్
దేశ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే ఒత్తిడన్న స్టాలిన్
స్వయంప్రతిపత్తి డిమాండ్ అనగానే.. ఇదేదో.. తమిళనాడు సంక్షేమ కోసం, అధికార వికేంద్రీకరణ, నిధుల కోసం ఒత్తిడి తేవడం కాదని, దేశ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒత్తిడి తెస్తున్నామని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై గళం విప్పుతున్న తొలి రాష్ట్రం తమిళనాడు అని అంటూనే.. భిన్నత్వంలో ఏకత్వం ఆధారంగా పనిచేస్తున్న భారత్ లో అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షించడమే కమిటీ ఏర్పాటు ఉద్దేశమని స్ట్రాటజిక్ గా చెబుతున్నారు.
కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేలా ఒత్తిడి పెంచే వ్యూహం
సో ఇక్కడ స్వయంప్రతిపత్తి డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చింది.. తమిళనాడు ఏం చేయాలనుకుంటోంది.. కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేలా ఒత్తిడి పెంచే వ్యూహమేనా.. ఒకవేళ తమిళనాడు అటామనస్ స్టేట్ హోదా సంపాదించుకుంటే.. మిగితా దక్షిణాది రాష్ట్రాల సంగతేంటి.. పన్నులు ఎక్కువ కట్టి తక్కువ రిటర్న్ పొందుతున్న రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తమిళనాడు తిరుగుబాటు ఎక్కడికి దారి తీస్తుంది? అసలు స్వయంప్రతిపత్తి సాధ్యమేనా అన్నది ఇప్పుడు అంతటా జరుగుతున్న చర్చ.