డయాబెటిస్తో పోరాడాలంటే ఎంతో శక్తి కావాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం. శరీరాన్ని కుదేలు చేయడంలో డయాబెటిస్ ముందుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా ఆకలిని తగ్గించుకొని డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. చాలామందికి ఏమి తినాలో కూడా అర్థం కాదు. మీరు ఉదయం లేచిన వెంటనే ఖాళీ పొట్టతో ఉంటారు. అలా పరగడుపున ఎలాంటి ఆహారాన్ని తింటారో అదే రోజంతా మీపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు ఖాళీ పొట్టతో ఎలాంటి ఆహారాన్ని తినాలో తెలుసుకోండి.
చియా సీడ్స్
చియా గింజలు ఇప్పుడు సూపర్ ఫుడ్ గా మారాయి. వీటిలో ఫైబర్, ఒమాగా త్రీ కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల రక్తంలోకి చక్కెర శోషణ నెమ్మదిస్తుంది. మధుమేహం ఉన్నవారికి చియా సీడ్స్ వాటర్ తాగడం మంచి ఎంపిక. ఒక టేబుల్ స్పూన్ ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం లేచిన వెంటనే తినండి తాగండి.
పెరుగు
ఇంట్లో ఉండే సాదా పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పులియబట్టి చేసినది. కాబట్టి దీనిలోప్రొబయోటిక్స్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ పొట్ట ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. రక్తంలో చక్కెర పెరగకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఆ సాదా పెరుగులో దాల్చిన చెక్క పొడిని చిటికెడు వేసుకుని పరగడుపున తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
జామకాయ లేదా గ్రీన్ యాపిల్
మధుమేహం ఉన్నవారికి కొన్ని రకాల పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఆకుపచ్చగా ఉండే యాపిల్, జామకాయలు తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర నియంత్రణ, ఇన్ఫ్లమేషన్ తగ్గడం వంటివి జరుగుతాయి. ఉదయం పడుకుని లేచాక బ్రేక్ ఫాస్ట్ సమయంలో మొదట ఆకుపచ్చ యాపిల్ ను లేదా జామకాయను తినండి. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి తొక్కతో పాటు తినడమే మంచిది.
మెంతులు
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి మెంతులకు ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మెంతులు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అలాగే చక్కెర వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఒకటి స్పూన్ మెంతి గింజలను, ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం అయ్యాక మెంతి గింజలను వడకట్టి అన్నింటినీ తాగేయండి. ఉపవాసం ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ఈ మెంతి నీరు ఎంతో సహాయపడుతుంది.
నానబెట్టిన బాదంపప్పు
బాదం పప్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం వంటివి ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రిపూట ఒక ఆరు బాదం పప్పులు నీటిలో నానబెట్టి ఉదయం లేచాక పొట్టు తీసి తినండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. అలాగే ఆకలి వేయకుండా కూడా నిరోధిస్తాయి.