Lokesh Meetings: మంత్రి నారాలోకేశ్ డిన్నర్ మీటింగ్స్ రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఉండవల్లిలోని తన నివాసంలో జిల్లాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులతో లోకేష్ జరుపుతున్న విందు సమావేశాలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. మంత్రి లోకేశ్ ఆ సందర్భంగా ప్రతి రోజూ కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారంట. అలాగే ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఇచ్చిన వినతులకు సంబంధించి ప్రోగర్స్ రిపోర్టులు, అలాగే వారిపై వస్తున్న నెగిటివ్ నివేదికలు వారికి అందిస్తుండటం సదరు నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోందంట. అసలు ఈ డిన్నర్ మీటింగ్స్ వెనుక స్కెచ్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడో అంశం హాట్ టాపిక్గా మారింది. తిరుమల లడ్డూ వ్యవహారం, బడ్జెట్, అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం కంటే ఇప్పుడా అంశం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చలకు తెరలేపుతోంది.చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. లోకేశ్ ప్యూచర్ ప్లాన్.. పవన్ కల్యాణ్ పొలికటల్ ప్లాన్. ..వైసీపీతో రాజకీయ యుద్ధం కంటే.. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, వారి ఫ్యామిలీలతో లోకేష్ ఇంట్రాక్షన్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోందట. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల సమయమే ఈ ఎపిసోడ్కు వేదిక కావడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టి.. వివిధ రంగాలకు, పథకాలకు, అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారు. ఐతే ఇదంతా కాసేపు పక్కనబెడితే.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతి రోజు జిల్లాల వారీగా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, వారివారి కుటుంబసభ్యులతో మంత్రి లోకేశ్ ఏర్పాటు చేస్తున్న డిన్నర్ మీటింగ్లు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీల ఎంపీ, ఆ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ స్పెషల్ డిన్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలతో సరదాగా గడుపుతూ.. మహిళలకు చీరలు, పసుపు కుంకుమ పెట్టి పంపిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. దీని వెనుక అసలు స్ట్రాటజీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందట.
ప్రస్తుతం కూటమికి 161 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కూటమిలో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయా ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబునాయుడు పిలిచి మాట్లాడి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఇప్పటికే 80 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు పలుసార్లు మాట్లాడి సున్నితంగా హెచ్చరించారు. అంత అలర్ట్ చేస్తున్నా ఇంకా 35 మంది ఎమ్మెల్యే పనితీరు మెరుగుపడలేదని సీఎంకు నివేదికలు అందాయంట. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేల బలముంది. వీరిలో చంద్రబాబు, లోకేశ్తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు మినహా…కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడో ఒక చోట వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే చర్చ నడుస్తోంది.
135 మందిలో దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేల వ్యవహారం బాలేదని సీఎంకు అందిన రిపోర్టుల్లో తేలింది. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వంటివారు అధిష్టానానికి తలనొప్పిగా తయారయ్యారు. అటు జనసేనలో పవన్ కల్యాణ్ తప్ప మిగిలిన 20 మందిపైనా వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు పార్టీలో శ్రీధర్ కు స్థానం ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశమైంది.
అలాగే బీజేపీలో సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో నడించింది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు హెచ్చరించినా సదరు ఎమ్మెల్యేల్లో మార్పు రాకపోవడంతో చంద్రబాబు వారిపైనే దృష్టిపెట్టారంట. నేరుగా రంగంలోకి దిగితే సీన్ వేరేలా ఉంటుంది గనుక.. ఆ బాధ్యతలను లోకేశ్ కు అప్పగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. ఈ నేపథ్యంలో నారా లోకేశ్.. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారంటున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్తో మొదలైన డిన్నర్ మీటింగ్స్.. వరుసగా జరుగుతూ వస్తున్నాయి. లోకేష్ స్యయంగా ఎమ్మెల్యేలతో మాట్లాతూ.. వారి పనితీరు, వ్యవహారాల గురించిన రిపోర్టులను సైతం వారి చేతుల్లో పెట్టి తీరు మార్చుకోమని సున్నితంగా చెప్తున్నారంట.
ఇదిలా ఉంటే లోకేశ్ డిన్నర్ మీటింగ్స్ వెనుక మరో యాంగిల్ ఉందట. అదేంటంటే..లోకేశ్ను టీడీపీ లీడర్లు, కేడర్ ఫ్యూచర్ లీడర్గా చూస్తున్నారు. ఇప్పటికే లోకేశ్ కు ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్లు టీడీపీ నేతల నుంచి వినిపించాయి. మరోవైపు కొందరు టీడీపీ నేతలు లోకేశ్ ప్రమోషన్ గురించి బాబుగారితోనే చర్చించనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలోని అన్ని వర్గాలను, కూటమిలోని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి లోకేశ్ ను భవిష్యత్ నాయకుడిగా ప్రోజెక్ట్ చేసే ప్రయత్నమే ఈ డిన్నర్ మీటింగులన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పార్టీని పూర్తిగా లోకేశ్ అండ్ టీమ్ కంట్రోల్ చేస్తోంది. పార్టీలోని కీలక పదవులకు నాయకుల ఎంపిక, నిర్ణయాలు, పార్టీ సమావేశాలన్నీ లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
లోకేష్ డిన్నర్ మీటింగ్లో కూటమి పార్టీ నాయకులను ఇన్వాల్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్లు కూటమి కలిసి ఉండాలని ఇటు లోకేష్తో పాటు పవన్ కల్యాణ్ కూడా పదేపదే చెపుతున్నారు. దీంతో పార్టీ నేతల మధ్య సమన్వయం మంచిగా ఉండేందుకు డిన్నర్ మీటింగ్ దోహద చేస్తుందని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు,నేతలతో సమావేశాలు పెట్టుకొని వారి మన్ననలు పొందాలని లోకేష్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఇలాంటి సమావేశాల ద్వారా భవిష్యత్తులో లోకేశ్ నాయకత్వానికి ఎలాంటి ఇబ్బందులు రావనేది చంద్రబాబు ఆలోచనగా ఉందంటున్నారు. మరి లోకేష్ డిన్నర్ మీటింగ్స్ ద్వారా ఎలాంటి సత్ఫలితాలు రాబోతున్నాయనేది వేచి చూడాల్సి ఉంది.
Story by : Apparao, Big Tv