Nellore Illegal Mining: అప్పుడు టీడీపీ చెప్పిందే.. ఇప్పుడు వైసీపీ చెబుతోంది. అప్పుడు వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లు విపక్షంలో ఉన్నారు. ఒకే అంశంపై.. రెండు పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు లోకల్ రాజకీయాల్లో కాక రేపుతున్నాయ్. నెల్లూరు రాజకీయమంతా ఇప్పుడు మైనింగ్ చుట్టే తిరుగుతోంది. ప్రభుత్వాలు మారినా.. ప్రతిపక్ష పార్టీలు మైనింగ్ అంశం మీదే పోరాటం చేస్తున్నాయ్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెరమీదకు రావడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ఎపిసోడ్ ముగిశాక.. పెద్దగా కనిపించకుండా పోయిన అనిల్.. ఒక్కసారిగా మీడియా ముందుకు ఎందుకొచ్చారు? ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? అనిల్ విమర్శలు, ఆరోపణలకు.. వేమిరెడ్డి నుంచి రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
మైనింగ్ చుట్టూ తిరుగుతున్న నెల్లూరు పాలిటిక్స్
మైనింగ్.. మైనింగ్.. మైనింగ్.. నెల్లూరు పాలిటిక్స్ మొత్తం.. ఈ మైనింగ్ చుట్టే తిరుగుతున్నాయ్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రచ్చ మాత్రం ఈ మైనింగ్ చుట్టే. నెల్లూరు జిల్లాలో సైదాపురం, గూడూరు, పొదలకూరు మండలాల్లో అనేక మైనింగ్ క్వారీలున్నాయ్. వీటిలో.. కోట్ల విలువైన క్వార్జ్, పల్స్ ఫర్ లాంటి విలువైన ఖనిజాలున్నాయ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ఈ విలువైన ఖనిజాలు అక్రమంగా తరలుతున్నాయని ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయ్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ పోరాటాలు మాత్రం కామన్గా జరుగుతున్నాయ్. కేవలం.. పోరాటం చేసేవాళ్లు మాత్రమే మారుతున్నారనే చర్చ జిల్లాలో జరుగుతోంది. దాంతో.. నెల్లూరు రాజకీయమంతా ఎక్కువగా ఈ అక్రమ మైనింగ్ చుట్టే తిరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయ్.
మంత్రులు, మాజీ మంత్రులు దందా చేస్తున్నారనే ఆరోపణలు
గతంలో.. మంత్రులు, మాజీ మంత్రులు వెనకుండి.. ఈ అక్రమ మైనింగ్ దందా నడిపిస్తున్నారంటూ.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పోరాటం చేశారు. ఇప్పుడు.. కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ నాయకులు కూడా అదే పోరాటాన్ని భుజాన వేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా మాత్రమే.. కొన్ని మైనింగ్ కంపెనీలు సరుకును తరలిస్తున్నాయని.. మిగిలిన మైన్లు తెరవకుండా.. అధికార తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని చెబుతున్నారు. దీని వల్ల.. వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు ఈ మాట చెబుతున్నా.. అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదన్న చర్చ సాగుతోంది.
Also Read: ఉగ్రవాదులను పాక్ ఎందుకు పోషిస్తుందంటే..? అసలు కథ ఇది అన్నమాట!
మైనింగ్ దందాపై అనిల్ మాట్లాడటంతో హాట్ డిబేట్
ఎప్పుడైతే కూటమి సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయిపోయారు. జనాల్లోనే కాదు న్యూస్లోనూ ఆయన కనిపించడం తగ్గిపోయింది. కానీ.. ఉన్నట్టుండి ఆయన మళ్లీ మీడియా ముందుకొచ్చారు. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసులతో పాటు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ దందాపైనే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడటం హాట్ డిబేట్కు దారితీసింది. అనిల్.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టార్గెట్ వ్యాఖ్యలు చేయడం మీదే.. జిల్లా రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వేమిరెడ్డికి చెందిన కంపెనీలు మాత్రమే.. సైదాపురం మండలంలో మైన్లు తెరచి.. మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముసుగుతీసి.. మైనింగ్లో అక్రమాలకు పాల్పడలేదని నేరుగా చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు అనిల్. ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్.. ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఎంపీని టార్గెట్ చేయడం.. నెల్లూరు పాలిటిక్స్ని షేక్ చేసిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అక్రమ మైనింగ్పై సమాధానం చెప్పాలని అనిల్ డిమాండ్
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అవసరమైతే.. సామాన్య ప్రజల తరఫున పోరాటం కూడా చేస్తామన్నారు. మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసు పెట్టారని.. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించడం.. రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.
పెనాల్టీలను ప్రభుత్వం వసూలు చేయాలని డిమాండ్
గతంలో ప్రభుత్వం విధించిన పెనాల్టీలను కూడా.. ప్రస్తుత ప్రభుత్వం వసూలు చేయాలని డిమాండ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఇక్కడే మరో మెలిక పెట్టారు. పెనాల్టీల రూపంలో వసూలు చేసిన డబ్బుని.. అమరావతి నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో.. ఏ మైన్ యజమాని కోర్టులను ఆశ్రయించలేదన్నారు. ప్రస్తుత సర్కార్ విధానాలతో మైన్ ఓనర్లు కోర్టులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా ఓకే. అసలు.. అనిల్ కుమార్ యాదవ్ హఠాత్తుగా మీడియా ముందుకు ఎందుకొచ్చారు? ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారనే చర్చే.. జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అనిల్ చేసిన విమర్శలు, ఆరోపణలకు.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఆయన వర్గీయులు అనిల్కు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? అనే ఆసక్తితో.. జిల్లా రాజకీయ నేతలంతా ఎదురుచూస్తున్నారు.
మైనింగ్ అంశం మీదే నెల్లూరు జిల్లా అటెన్షన్
కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టే మైనింగ్ దందా కావడంతో.. అందరి అటెన్షన్ ఇప్పుడు ఈ అంశం మీదే ఉంది. గత ప్రభుత్వంలోనూ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చి.. ఇప్పుడు కూడా అక్రమాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలతో.. ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం.. సామాన్య జనాల్లోనూ ఆసక్తి రేపుతోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ మైనింగ్ పాలిటిక్స్.. మొత్తం ఆంధ్రా పాలిటిక్స్నే ఆకర్షిస్తున్నాయ్. ఇంకొందరు బడా లీడర్లు కూడా మైనింగ్ దందా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. స్తబ్దుగా ఉన్న మైనింగ్ అంశం.. అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీతో.. ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి.. అధికార పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది.. జిల్లా రాజకీయాల్లో ఇంట్రస్టింగ్గా మారింది.