భారతీయ రైల్వే గత దశాబ్ద కాలంగా ఊహించని అభివృద్ధి చెందింది. సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్ల నుంచి మొదలుకొని, అత్యాధునిక బుల్లెట్ రైలు దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 160కి పైగా వందేభారత్ రైళ్లు ఎక్స్ ప్రెస్ రైళ్లు సర్వీసులు అందిస్తుండగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్ లోని అహ్మదాబాద్ నడుమ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం జరుగుతుంది. సుమారు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు.. ఇప్పటికే జపాన్ లో రెడీ అయ్యింది. సింకన్ సెన్ టెక్నాలజీతో రెడీ అయిన ఈ అత్యాధునిక రైలును త్వరలోనే ఇండియాకు తీసుకురానున్నారు. తాజాగా ఈ రైలు ప్రారంభానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ రైలు కారిడార్.. ఆగష్టు, 2027లో ట్రయల్ రన్ ప్రారంభం కానున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని సూరత్- వాపి మధ్య నడుస్తుందన్నారు. ప్రారంభ మార్గం 100 కి.మీ ఉంటుందన్నారు. సబర్మతి (అహ్మదాబాద్)- ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ 2029 నాటికి పూర్తయిన తర్వాత క్రమంగా 508 కి.మీ పూర్తి మార్గానికి ఈ రైలు సేవలను విస్తరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. “హైస్పీడ్ రైల్ కారిడార్ పూర్తయిన తర్వాత బుల్లెట్ రైలు అహ్మదాబాద్- ముంబై మధ్య దూరాన్ని కేవలం 1 గంట 58 నిమిషాల్లోనే కవర్ చేస్తుంది. ఇండియన్ రైల్వేలో ఇదో కీలకమైన మైలు రాయి కాబోతోంది. ఆగస్టు 2027లో ట్రయల్ రన్ మొదలవుతుంది. ఆ తర్వాత సూరత్- వాపి మధ్య 100 కి.మీ పరిధిలో తొలుత సర్వీసులను అందిస్తుంది.
508 కి.మీ కారిడార్ పూర్తయిన తర్వాత, ఆ మార్గంలో ఈ రైళ్లు గంటకు 320 కి.మీ. వేగంతో నడుస్తాయి. నాలుగు స్టాప్లతో 1 గంట 58 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేయనున్నాయి.”ఈ బుల్లెట్ రైలు ముంబై- అహ్మదాబాద్ మధ్య దూరాన్ని నాలుగు స్టాప్లతో 1 గంట 58 నిమిషాల్లో చేరుకుంటుంది. ఇది 12 స్టేషన్లలో ఆగితే, మొత్తం ప్రయాణ సమయం 2 గంటల 17 నిమిషాలు అవుతుంది” అని వైష్ణవ్ అన్నారు. డిసెంబర్ 2029 నాటికి మొత్తం బుల్లెట్ రైలు నెట్ వర్క్ సిద్ధంగా ఉంటుందన్నారు. అయితే, ట్రయల్ రన్ నిర్వహించే బుల్లెట్ రైలును జపాన్ తయారు చేస్తుందా? దేవీయంగా తయారవుతుందా? అనే ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పలేదు.
అటు సూరత్ లో ఇటీవల బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆయన సంతృప్తి చెందారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ సంక్లిష్టంగా, అనేక డిజైన్ సవాళ్లను కలిగి ఉందన్నారు వైష్ణవ్. అయినప్పటికీ, భారతీయ రైల్వే సమర్థవంతంగా ఆ సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
Read Also: బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?