Penukonda Politics: ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో పెనుకొండ ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం. కానీ ఇప్పుడు అక్కడ వైసీపీలో సెగలు పుడుతున్నాయి. అది కూడా ప్రజా సమస్యల మీద కాదు.. ఆ పార్టీ నేతలు ఒక ఇంటి విషయంలోఒకరి మీద మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. స్థానికుడైన మాజీ మంత్రి శంకరనారాయణ గూడు చెదరగొట్టేందుకు మరో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యూహాలు రచిస్తున్నారంట.. పెనుగొండ వైసీపీ ఇన్ఛార్జ్గా వచ్చిన ఉషశ్రీ చరణ్ (Ushasree Charan), శంకరనారాయణను నియోజకవర్గం నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారంట.. అధిష్ఠానాన్ని అడ్డు పెట్టుకుని జరుగుతున్న ఈ ‘పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి?
అనంతపురం జిల్లా పెనుకొండ వైసీపీలో అయిదేళ్ల పాటు చక్రం తిప్పిన మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణకు ఇప్పుడు సొంత పార్టీలోనే గడ్డు కాలం నడుస్తోంది. 2024 ఎన్నికలకు ముందే ఆయనను కాదని, కళ్యాణదుర్గం నుంచి అక్కడి మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పనిచేసి ఉషశ్రీ చరణ్ను అక్కడికి మార్చింది వైసీపీ అధిష్ఠానం. గత ఎన్నికల్లో ఉషశ్రీచరణ్ పెనుగొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… జగన్ ఆదేశాల మేరకు శంకరనారాయణ అయిష్టంగానే అనంతపురం ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా ఉషాశ్రీచరణ్ గతంలో గెలిచిన కళ్యాణదుర్గానికి వెళ్లడానికి ఇష్టపడకుండా పెనుకొండపైనే కన్నేశారు. మరోవైపు శంకరనారాయణ సొంత సెగ్మెంటుకు తిరిగి రావడానికి పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య ఆధిపత్యపోరు ఇల్లు ఖాళీ చేయించే స్థాయికి చేరింది… పెనుకొండ పట్టణంలో శంకరనారాయణ ఉంటున్న నివాసం ఆయనకు సెంటిమెంట్ మాత్రమే కాదు, రాజకీయ వ్యూహా కేంద్రం కూడా. ఇప్పుడు ఆ ఇంటినే ఉషశ్రీ టార్గెట్ చేశారు.
నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తనకు సరైన కార్యాలయం లేదని, గతంలో పార్టీ పరంగా నిర్ణయించిన ప్రాంగణాన్ని తిరిగి కేటాయించాలని, లేదా శంకరనారాయణ ప్రస్తుత నివాసాన్ని ఖాళీ చేయాలని ఆమె పట్టుబడుతున్నారు. నేరుగా అడిగితే శంకరనారాయణ ఒప్పుకోరని తెలిసిన ఉషశ్రీ, తాడేపల్లిలోని కీలక నేతల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. పార్టీ ఇన్ఛార్జ్కు పవర్ ఉండాలి. అది ఆఫీస్ నుంచే మొదలవ్వాలని అధిష్ఠానం వద్ద పంచాయితి పెట్టినట్టు సమాచారం. అయితే, శంకరనారాయణ కూడా తక్కువ తినలేదు. తాను లోకల్.. ఉషశ్రీ నాన్-లోకల్ అనే కార్డును బలంగా వాడుతున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఏమేం చేశానో అందరికీ తెలుసని, ఇప్పుడు కేవలం ఒక ఇల్లు లేదా ఆఫీస్ కోసం వేధించడం అంటే, తనని రాజకీయంగా సమాధి చేయడమే అని తన సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నారు. అయితే శంకర్ నారాయణ కు క్యాడర్ సపోర్ట్ బాగా పెరుగుతోంది.
శంకరనారాయణకు ఉన్న పాత క్యాడర్ ఇప్పుడు ఉషశ్రీకి వ్యతిరేకంగా మారుతోంది. ఆమె వైసీపీ పొలిటికల్ గేమ్లో భాగంగా వలస వచ్చారని, రేపు పొద్దున మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతారని, కానీ శంకరనారాయణ లోకల్.. ఇక్కడే ఉంటారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ క్రమంలో అధిష్ఠానం నుంచి ఉషాశ్రీకి సహకరించాలని వచ్చిన ఆదేశాలను సైతం శంకరనారాయణ పట్టించుకోవడం లేదంట., చస్తే చస్తా కానీ.. ఆత్మాభిమానం వదులుకోబోనని గట్టిగా పట్టుబడుతున్నారంట. పైకి ఇద్దరు నేతలు చిరునవ్వుతో మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం పరిస్థితి నిప్పుకణికలా మారిందంటున్నారు. ఉషశ్రీ చరణ్ తనదైన శైలిలో పార్టీ కేడర్ను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, శంకరనారాయణ ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేతల గొడవ చూసి సాధారణ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, సవిత నియోజకవర్గంలో పర్యటిస్తూ తన పట్టు పెంచుకుంటుంటే, వైసీపీ నేతలు మాత్రం “నా ఇల్లు – నా ఆఫీస్” అంటూ కొట్టుకోవడం పార్టీని బలహీనపరుస్తోందనేది వాస్తవం.
అధికారంలో ఉన్నప్పుడు వెలిగిపోయిన మాజీ మంత్రులు ఉషాశ్రీ, శంకరనారాయణలు ప్రతిపక్షంలోకి రాగానే ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడం చర్చనీయాంశంగా మారింది. ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి శంకరనారాయణ పెనుకొండ నుంచి తప్పుకుంటారా? లేక పెనుకొండ రాజకీయాల నుంచి ఉషశ్రీని సాగనంపే వరకు పోరాడతారా? అధిష్ఠానం ఈ ‘ఇంటి’ పంచాయితీని ఎలా సెటిల్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా ప్రస్థుత ఆధిపత్యపోరే కొనసాగితే జరిగితే పెనుకొండలో వైసీపీ కోలుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Kavitha: బంజారాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలి.. కవిత డిమాండ్
Story By Apparao,Big Tv