Kavitha: ‘మేం ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే కాంగ్రెస్ ఆ సీటును లాక్కున్నది.. ఈ వెగటు రాజకీయాలు చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha)అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ కు కూడా కచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. హైదరాబాద్ లోని జాగృతి రాష్ట్ర కార్యాలయంలో సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించారు. బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, సంఘ సంస్కర్త కూడా అని అన్నారు. బంజారా జాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్ పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలని డిమాండ్ చేశారు. బంజారాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఆధ్మాత్మిక గురువులు పరలోకం గురించే చెబుతారని, కానీ సేవాలాల్ ఇహలోకం కూడా ఎలా ఉండాలో చెప్పేవారన్నారు.
ఆనాడు బ్రిటీష్ వాళ్లు ట్రైబల్స్ ను క్రిమినల్ ట్రైబ్స్ అని ఉంటే ఖడ్గం ఎత్తి పోరాటం చేశారని పేర్కొన్నారు. సేవాలాల్ దేశ వ్యాప్తంగా బంజారా జాతి మేలు కోసం కృషి చేశారన్నారు. గోర్ భోళి భాషను కచ్చితంగా 8 వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక ఫండ్ ను కేటాయించాలని ప్రభుత్వాలను కోరారు. అన్ని పార్టీలు బంజారా శాఖను పెట్టుకుంటాయనితెలిపారు. మన తండాల్లో మన రాజ్యం అని తెలంగాణ వచ్చాక చేసుకున్నామన్నారు. యువత తండాల్లో వెలుగులు నింపేలా నాయకత్వం చేపట్టాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వారు పోటీ చేయాలని పిలుపు నిచ్చారు. లీడర్ షిప్ కావాలనుకునే యువత గ్రామాల్లో ఉండాలని, తండాలను గ్రామపంచాయితీలుగా చేసుకున్నప్పటికీ సరైన వసతులు మాత్రం లేవు అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ముఖ్యమంత్రి ప్రతి తండాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తండాల్లో రేషన్ షాప్ లు, గ్రామపంచాయితీ, అంగన్ వాడీలు నిర్మించాలన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాలకు 5 సీట్లు అంటున్నారని, అందులో అసలు లాజిక్ లేదన్నారు.
బంజారాలకు జీవో 33 ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చారా? శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. స్వాభిమానం అంటే మన సాంస్కృతిక ప్రతీకలు రాజధానిలో ఉండాలన్నారు. అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సేవాలాల్ స్మారకం పెడతామంటున్నారని, హైదరాబాద్ లో కూడా విగ్రహం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బంజారాలు లేని మంత్రివర్గం ఉండేది కాదని, కానీ ఈ ప్రభుత్వంలో దారుణంగా లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. వెంటనే వారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 12 లక్షలు అన్నారు.
కానీ ఎవరికీ రాలేదన్నారు. కాంట్రాక్ట్ లలో ఎస్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జాగతో పాటు 6 లక్షలు ఇస్తామన్నారు..కానీ ఉన్న ఇళ్లనే గుంజుకునే పరిస్థితికి తెచ్చారని ఆరోపించారు. అసైన్డ్ భూముల విషయంలో కూడా అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏ ప్రాజెక్ట్ వచ్చిన సరే అసైన్డ్ భూములను ముందుగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. అసైన్డ్ భూముల విషయంలో సీఎం ఒక స్టాండ్ తీసుకోవాలని, పోడు పట్టాల పంపిణీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ పేరుతో, ఆదివాసీల పేరుతో, ఎరుకల తెగ పేరుతో ఏర్పాటు చేస్తామన్న మూడు కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ లో ఐటీడీఏ లు పెట్టాలన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం, అడిగే వాళ్లు ఉండకూడదా? కాంగ్రెస్ నాయకులరా మీకన్నా కూడా ప్రతిపక్షం వారినే సీఎం ముందు కలుస్తున్నాడు?మిమ్మల్ని పట్టించుకోవటం లేదు.. ఒక్కసారి ఆలోచన చేయండి అని సూచించారు.
మీకు నిధులు రాకపోతే ఓటర్లకు మీరిచ్చిన హామీల సంగతేంటి? ఇట్ల ప్రతిపక్షాలు ఉండకుండా చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, ఏ పార్టీలో గెలిచిన సరే బీఆర్ఎస్ లోకి చేర్చుకొని వెగటు పుట్టేలా చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తోంది. వారికి కూడా ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. ప్రతిపక్షాలను, అడిగే వారిని ఉండనివ్వాలని కోరారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ ను మొక్కుబడిగా ఒక్కసారి మాత్రమే పెట్టారని వారికి పనికి వచ్చే పనులు ఏమీ చేయటం లేదని నిలదీశారు. సేవాలాల్ ఇచ్చిన సందేశం ప్రకారం మనం సమాజంలో ముందుకు పోవాలని, కచ్చితంగా మీ ఆశీస్సులతో జాగృతి ముందుకు వెళ్తుందన్న నమ్మకం ఉందన్నారు.
Also Read: Maha Shivaratri 2026: శంఖుపై శివతాండవం.. నంద్యాల చిత్రకారుడి అద్భుత కళాఖండం!