Ram Gopal Varma: రామ్గోపాల్వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్కి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టుల పెడుతూ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటూ నెగిటివ్ పబ్లిసిటీని కూడా ఎంజాయ్ చేస్తుంటాడు. వైసీపీ సింపతైజర్గా సోషల్ మీడియాలో ఆయన చేసిన హడావుడి, తీసిన సినిమాలతో ఇప్పుడు ఆర్జీవీ కేసుల చట్రంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆ ఎఫెక్ట్తో బాలకృష్ణపై తెగ సెటైర్లు వేసిన అతని వాయిస్తో పాటు ఫేట్ కూడా సడన్గా మారిపోయింది. బాలయ్య నటించిన డాకూ మహారాజ్ టీజర్పై పొగడ్తల వర్షం కురిపించిన ఆర్జీవీ కూటమి పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే చేసిన అతి ఊరికినే పోతుందా అన్నట్లు అతను పోలీసుల విచారణకు హాజరవ్వక తప్పడం లేదిప్పుడు.
కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు, సినిమాలపై.. ఇప్పుడు వేట మొదలైంది. వైసీపీ హయాంలో.. చంద్రబాబు, లోకేశ్, పవన్ని నెగటివ్గా చూపిస్తూ.. కాంట్రవర్శీ సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ .. సోషల్ మీడియాలో కూడా వైసీపీ నాయకుడిలా చెలరేగిపోయారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయి ఏపీలో అతనిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయ్. జగన్ పాలనలో రెచ్చిపోయిన ఆర్జీవీకి.. ఇప్పుడు పోలీసులు, కోర్టులతో కష్టాలు ఎలా ఉంటాయో తెలిసి వస్తుంది.
వాస్తవ దూరమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే ఆర్జీవీ.. రాజకీయం నేపథ్యంలో పలు సినిమాలను కూడా తెరకెక్కించారు. వైసీపీ హయాంలో జగన్ మెప్పు కోసం వైసీపీ లీడర్ల సొమ్ముతో ప్రతిపక్ష నేతలపై అడ్డూ అదుపు లేకుండా.. అడ్డదిడ్డంగా సినిమాలు తీసేశారు. నచ్చితే చూడండి లేకపోతే లేదు. అంటూ రెచ్చిపోయారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అతను ఎవర్నీ వదిలిపెట్టకుండా అవమానకరమైన పోస్టులు పెట్టి కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్గా మారారు.
కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు, ట్వీట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో.. ఎక్కువగా వైసీపీ సానుభూతిపరుల మీదే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైనా కేసులు నమోదవడం హాట్ టాపిక్గా మారింది. అప్పటి వరకు కేసులకు భయపడేది లేదని తెగ ప్రగల్భాలు పలికారు రామ్గోపాల్ వర్మ.
వైసీపీ అధికారంలో ఉండగా.. రాంగోపాల్ వర్మ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పాత్రలతో.. తన కిష్టమొచ్చినట్లుగా సినిమాలు తీస్తూ వెళ్లారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణపై కూడా సోషల్ మీడియాలో తెగ సెటైర్లు విసిరారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అప్పుడు ఆర్జీవీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అన్నాడు
ఆ తర్వాత ఏదో సందర్భంలో బాలకృష్ణతో రోజా దిగిన సెల్ఫీని ట్వీట్ చేసి బాలయ్యపై తెగ సెటైర్లు విసిరాడు. రోజా అందంగా ఉందంటూ పొగిడిన వర్మ.. బాలకృష్ణను దిష్టిబొమ్మ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం. సెల్ఫీలో రోజా అతనికి హీరోలా కన్పించిందంట. ఆమె కుడి పక్కన విగ్ లేకుండా ఉన్న బాలకృష్ణ ఎవరో తనకు తెలయదన్నట్లు కామెంట్లు పెట్టాడు. ఆ ట్వీట్లో ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఈ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా..?’ అంటూ మరో ట్వీట్ చేసిన ఆర్జీవీపై బాలయ్య అభిమానులు అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు
అలా వైసీపీ హయాంలో మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమే అన్న ధీమాతో .. రామ్గోపాల్ వర్మ అంతా నా ఇష్టమన్నట్లు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పు తెలిసి వస్తున్నాయంట.. తనపై కేసులు పెడితే అవన్నీ తప్పుడు కేసులంటూ నానా హడావుడి చేశాడు..పోలీసులు నోటీసులతో వెళ్తే దాగుడుమూతలు ఆడాడు. తర్వాత పోలీసు డిపార్టుమెంటునే టార్గెట్ చేశాడు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి న్యాయస్థానాల్ని ఆశ్రయించాడు.
Also Read: విజయ సాయిరెడ్డి గుడ్ బై.. ఎప్పుడు తప్పుకుంటారా.. అని ఎదురు చూశారా..?
గత ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమాను రాంగోపాల్వర్మ విడుదల చేశారు. ఆ చిత్రం ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్లో పోస్టులు పెట్టారు. వాటిపై టీడీపీ మద్దిపాడు మండల కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు చేయడంతో గత ఏడాది నవంబరు 10న ఆర్జీవీపై ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. అలాగే ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టడంపై గుంటూరు, తుళ్లూరుల్లో కేసులు నమోదయ్యాయి.
వర్మపై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనా.. ఎక్కడా ఆయనకు నోటీసులు అందలేదు. తొలిసారి ఒంగోలు రూరల్ స్టేషన్ పోలీసులు హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఆయన కార్యాలయానికి వెళ్లి నవంబరు 13న మొదటిసారి నోటీసులు అందించారు. ఆ రోజు కుదరదని, మరో తేదీన వస్తానని చెప్పి ముఖం చాటేశాడు. ఆ తర్వాత తాను బిజీ షెడ్యూల్లో ఉన్నానని మరో తేదీ ఇవ్వాలని కోరారు. అదే నెలలో రెండోసారి నోటీసు పంపినా విచారణకు డుమ్మా కొట్టాడు
దాంతో ఒంగోలు రూరల్ పోలీసులు వర్మను అరెస్టు చేయడానికి హైదరాబాద్ వెళ్లారు. అయితే తాను బిజీ షెడ్యుల్లో ఉన్నానని, సినిమా చిత్రీకరణను మధ్యలో వదిలేస్తే నిర్మాతలు నష్టపోతారంటూ తన లాయర్ ద్వారా పోలీసులకు లెటర్ పంపాడు. ఆ క్రమంలో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో అతను పోలీసు విచారణకు తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ క్రమలో వారం గడువు ఇవ్వాలని, ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పిన ఆ కాంట్రవర్సీ డైరెక్టర్.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో జిల్లా పోలీసులు మరోసారి హైదరాబాద్లోని ఆతని కార్యాలయానికి వెళ్లి అక్కడ లేకపోవడంతో గాలింపు చేపట్టారు. అది జరుగుతుండగానే తాను కోయంబత్తూరులో ఉన్నానని వర్మ ఎక్స్లో పోస్టు పెట్టాడు. తర్వాత హఠాత్తుగా మీడియాకు వీడియో రిలీజ్ చేసి పోలీసు చర్యను ప్రశ్నిస్తూ వారిపై ధ్వజమెత్తాడు
ఆ క్రమంలో డిసెంబరులో హైకోర్టు తీర్పు వచ్చింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, వ్యక్తిగతంగా హాజరై సంబంధిత పత్రాలు సమర్పించి బెయిల్ పొందాలని వర్మకు సూచించింది. దాంతో ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ ఒంగోలు ఎస్పీ ఏఆర్.దామోదర్ అతనికి తాజాగా నోటీసులు పంపించారు. వాటిపై ఆర్జీవీ స్పందిస్తూ తాను ఫిబ్రవరి 4, 5న రాలేనని, 2 నుంచి 7 మధ్య మిగిలిన ఏ రోజైనా వస్తాననని అభ్యర్ధించాడంట. చివరికి వచ్చే నెల 7న ఒంగోలుకు రావాలని ఎస్పీ ఆదేశించడంతో.. రాంగోపాల్ వర్మ చేయగలిగేదేమీ లేక ఒంగోలు వస్తానన్నాడంట.
అసలు రాష్ట్ర వ్యాప్తంగా తనపై కేసులు నమోదు అవుతున్నప్పటి నుంచే ఆర్జీవీని అరెస్ట్ భయం పట్టుకుందంటున్నారు. అందుకే నవంబరు నుంచే ఆయన కూటమి ముఖ్యుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్లు కనిపించారు. వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో తన పోస్టులతో బాలయ్యపై వెటకారాలు ఆడిన ఆర్జీవీ … నవంబరులో బాలయ్య నటించిన డాకూ మహరాజ్ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే ప్రశంసల వర్షం కురిపించాడు. డాకూ మహరాజ్ మళ్లీ సంక్రాంతి వరకు ఆడుతుందని.. హాలీవుడ్ రేంజ్లో బాలకృష్ణ నటించిన ఆ మూవీ 365 రోజులు పక్కాగా ఆడేస్తుందని ట్వీట్ చేసి కాకా పట్టే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు కూడా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కూటమి పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా ఏదో జిమ్మిక్ చేస్తాడని సోషల్ మీడియాలో సెటైర్లు మోత మోగి పోతున్నాయి