National Politics: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దుమారం రేగింది. కానీ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కాదు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన బుక్ మీద! లద్దాఖ్, డోక్లాం ప్రతిష్టంభన గురించి రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలతో.. సభలో గందరగోళం నెలకొంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే తన పుస్తకంలో రాసిన అంశాలపై.. రాజకీయ రగడ నడుస్తోంది. అసలు.. రాహుల్ ఏమన్నారు? రాజ్నాథ్ ఎందుకు అడ్డుకున్నారు?
పార్లమెంట్ వేదికగా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ డిబేట్కు దారితీసింది. జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2020 నాటి లద్దాఖ్, డోక్లాం ప్రతిష్టంభన గురించి.. రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలతో.. గందరగోళం నెలకొంది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని.. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను.. ది కారవాన్ అనే మ్యాగజైన్ ప్రచురించింది. ఆ వివరాలను.. రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. అయితే.. ఆయన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ చెబుతున్న పుస్తకం.. ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. దాంతో.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లోక్సభలో తీవ్ర దుమారం రేగింది.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే.. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం రాశారు. అందులో.. చైనా చొరబాట్లకు సంబంధించిన అంశాలని రాహుల్ ప్రస్తావించారు. 2020లో తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల దగ్గర.. చైనా సైన్యం, యుద్ధ ట్యాంకులు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించాయని రాహుల్ అన్నారు. ఆ క్లిష్ట సమయంలో ఆర్మీ చీఫ్కు స్పష్టమైన ఆదేశాలు అందలేదని.. చివరికి.. మీకు నచ్చింది చేయండని.. ప్రభుత్వం ఆయనకే బాధ్యత వదిలేసిందని.. నరవణే రాసిన పుస్తకంలో ఉందని రాహుల్ వివరించారు.
రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యల మీదే దుమారం రేగింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. నరవణే రాసిన పుస్తకం.. అధికారికంగా పబ్లిష్ కాలేదు. అది.. ఇంకా రక్షణ శాఖ సమీక్షణలోనే ఉంది. పార్లమెంట్ రూల్స్ ప్రకారం.. అధికారికంగా విడుదల కాని, ప్రామాణికం కాని పుస్తకాల్లోని అంశాలను.. సభలో కోట్ చేయడం కుదరదని వాదించారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలపై.. ఆధారాలు లేని సమాచారాన్ని ప్రస్తావించడం సరికాదన్నారు.
ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకానికి సంబంధించిన డ్రాఫ్ట్ పేజీలని కోట్ చేస్తూ.. ది కారవాన్ అనే మ్యాగజైన్ ఓ ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఆ మ్యాగజైన్ ఆధారంగానే.. రాహుల్ గాంధీ ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించారు. ఆ మ్యాగజైన్ ప్రకారం.. 2020 ఆగస్ట్ 31న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకులు.. రేచిన్ లా పాస్ దగ్గరకు దూసుకొచ్చినప్పుడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి నరవణే వివరించారు. ఆ సమయంలో.. రాజకీయ నాయకత్వం నుంచి తక్షణ ఆదేశాల కోసం ఆర్మీ చీఫ్ నిరీక్షించాల్సి వచ్చిందని.. చివరకు అది సైనిక నిర్ణయంగానే మిగిలిపోయిందని.. ఆ ఆర్టికల్లో ఉంది. సాధారణంగా.. మాజీ సైనికాధికారులు తమ సర్వీస్ అనుభవాల గురించి పుస్తకాలు రాసేటప్పుడు.. కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం.. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా, సర్వీసులో ఉన్నప్పుడు తెలిసిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలను బయటపెట్టకూడదు. అంతేకాదు.. భద్రత, నిఘా సంస్థల్లో పనిచేసిన వారు తమ సంస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రచురించే ముందు సంబంధిత శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సర్వీసులో ఉన్నప్పుడు జరిగిన ఆపరేషన్లు, యుద్ధ తంత్రాల గురించి రాసేటప్పుడు.. అవి శత్రు దేశాలకు ప్రయోజనం చేకూర్చకుండా ఉండేందుకు.. రక్షణ శాఖ సమీక్షకు పంపండమనేది.. ఓ సాధారణ పద్ధతి. ఇప్పుడు జనరల్ నరవణే రాసిన ఫోర్ స్టార్ట్ ఆఫ్ డెస్టినీ.. దాదాపు ఏడాదిన్నరగా రివ్యూలో ఉండటానికి ప్రధాన కారణాలు ఇవేననే చర్చ ఉంది.
చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని.. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. ఆ వివరాలనే.. రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. దానిని.. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ ప్రస్తావించిన అంశాలపై ఇంత అభ్యంతరం దేనికి? ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో.. నరవణే రాసిందేంటి? అసలు.. ఆ బుక్లో ఏముంది? 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరిగింది?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత.. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై మరోసారి చర్చ మొదలైంది. దీనిపై.. రాజకీయ విమర్శలు కూడా జోరుగానే నడుస్తున్నాయ్. భారత సైన్యానికి నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ.. ఇప్పుడు బిగ్ డిబేట్ నడుస్తోంది. ఈ పుస్తకంలో.. 2020లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన, అప్పుడు జరిగిన సంఘటనల గురించి రాసిన అంశాలు.. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్. జనరల్ నరవణే.. తన పుస్తకంలో 2020లో తూర్పు లద్ధాక్లో చైనాతో నెలకొన్న ఘర్షణల గురించి సంచలన విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా.. ఆగస్ట్ 31, 2020 నాడు రాత్రి జరిగిన పరిణామాల చుట్టే ఇప్పుడు డిబేట్ నడుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. భారత సరిహద్దుల్లోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు, భారత సైన్యం దీటుగా స్పందించిందని ఆయన తన పుస్తకంలో తెలిపారు. ఆ సమయంలో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందంటే.. యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపించాయని ఆయన ప్రస్తావించినట్లు.. కారవాన్ మ్యాగజైన్ ఆర్టికల్లో ఉంది.
క్షేత్రస్థాయిలో పరిస్థితి విషమిస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తాను జరిపిన సంభాషణను.. నరవణే తన పుస్తకంలో వివరించారు. ఆగస్ట్ 31న రాత్రి 8 గంటల సమయంలో చైనీస్ యుద్ధ ట్యాంకులు.. భారత సరిహద్దుల వైపు వస్తున్నట్లు మన ఆర్మీ గమనించింది. ఈ సమాచారం.. జనరల్ నరవణేకు అందింది. చైనా యుద్ధ ట్యాంకులు ముందుకు రాకుండా భారత సైన్యం ఒక రౌండ్ కాల్పులు జరిపిందని, అయినప్పటికీ.. పీఎల్ఏ ట్యాంకులు ముందుకే వచ్చాయని ఆర్టికల్లో రాశారు. ఆ సమయంలో జనరల్ నరవణే.. రాజకీయ నాయకత్వానికి, మిలటరీ పెద్దలకు ఫోన్లు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్, సీడీఎస్ బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు ఫోన్ చేసినట్లు.. తన పుస్తకంలో రాశారు. ఆ పరిస్థితుల్లో.. తానేం చేయాలి? నాకు మీరిచ్చే ఆదేశాలేంటి? అని అడిగానని.. ఇంకా ప్రచురితం కాని తన పుస్తకంలో రాశారు. సమయం గడిచేకొద్దీ చైనీస్ యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దులకు సమీపంగా కదులుతున్నాయ్. అదే రాత్రి 9 గంటల 25 నిమిషాలకు.. తనకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని.. మరోసారి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నరవణే ఫోన్ చేశారట.
ఆ సమయంలోనే.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ నుంచి ఓ మెసేజ్ వచ్చిందట. రెండు వైపులా ఎవరికి వారు ఎక్కడికక్కడ ఆగిపోవాలని, తర్వాతి రోజు ఉదయం తొమ్మిదిన్నరకు.. ఇరు దేశాల ఆర్మీకి సంబంధించిన ప్రతినిధులు కలవాలనే ప్రతిపాదన తెచ్చారు. ఈ విషయం చెప్పేందుకు.. రాత్రి 10 గంటలకు నరవణే మరోసారి.. రాజ్నాథ్కు, అజిత్ ధోవల్కు కాల్ చేశారట. అయితే.. చైనా ఆర్మీ తన మాట నిలబెట్టుకోకుండా.. మళ్లీ భారత్ వైపే కదిలింది. ఆ సమయంలో.. తన పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉందని పుస్తకంలో రాశారట నరవణే. స్పష్టమైన ఆదేశాలు లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేయలేమని.. నార్తర్న్ ఫ్రంట్కి తెలిపారట. సరిహద్దుల్లో చైనా సైన్యం సమీపిస్తున్న వేళ.. రాజ్నాథ్ సింగ్ రాత్రి పదిన్నర గంటలకు నరవణేకు కాల్ చేశారట. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితి గురించి.. తాను ప్రధాని నరేంద్రమోడీకి వివరించానని, ఆయన మీకు నచ్చిన నిర్ణయం తీసుకోమని చెప్పారని తెలిపారట. శత్రుసేనలు దేశంలోకి చొరబడేందుకు ముందుకు కదులుతున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేకపోయిందనే దానిమీదే ఇప్పుడు దమారం నడుస్తోంది.
చైనా సైన్యం మన భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించిందని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. కానీ.. భారత భూభాగం ఒక్క అంగుళం కూడా పోలేదని.. కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. అధికారికంగా పబ్లిష్ కాని.. మాజీ సైన్యాధిపతి పుస్తకాన్ని సాక్ష్యంగా చూపుతూ.. ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమీ చేయలేకపోయిందని నిరూపించే ప్రయత్నం రాహుల్ చేశారు. దాంతో.. సభలోనే కేంద్రమంత్రులు వెంటనే అభ్యంతరం తెలిపారు. సరిహద్దు వ్యవహారాలు అత్యంత రహస్యంగా ఉంచాల్సినవని, నరవణే రాసిన పుస్తకాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడటం వల్ల సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కేంద్రం వాదిస్తోంది. నరవణే రాసిన పుస్తకానికి రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదు. అప్పుడే.. దానిలోని అంశాలు లీక్ అవడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జనరవల్ నరవణే పుస్తకం.. చైనా దుశ్చర్యలను ఎండగట్టేందుకు రాసినప్పటికీ.. అది అనుకోని విధంగా రాజకీయం వైపు టర్న్ అయింది. కేంద్రం దీనిని గోప్యత ఉల్లంఘనగా చూస్తుంటే.. విపక్షాలు మాత్రం వాస్తవాలుగా అభివర్ణిస్తున్నాయ్. ప్రస్తుతం.. భారత్-చైనా సరిహద్దుల్లో ప్రశాంతత కనిపిస్తున్నా.. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ్.
Story by: Anup, Big Tv