Patancheru: ఆ ఎమ్మెల్యే కారు సవారీ చేస్తున్నారా? హస్తం నీడలో ఉన్నారా? అన్న సందేహాలు రెండు పార్టీల నేతల్లో వ్యక్తమవుతున్నాయట. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఎటూ నిర్ణయించుకోలేక మధనపడుతున్నారా? కొంత కాలం క్రితం కాంగ్రెస్లో చేరుతున్నట్లు కలర్ ఇచ్చిన ఆయన తనదైన లెక్కలతో యూటర్ తీసుకుని కారు షికారే చేస్తానన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారన్నది తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషనల్గా మారిందట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకుంటున్న నిర్ణమాలతో పటాన్చెరు ఎమ్మెల్యే .. వాట్ టు డూ… అని దిక్కులు చూస్తున్నారంట.
ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే గా గెలిచిన పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్రెడ్డికి గెలిచిన సంతృప్తి లేకుండా పోయిందట.. పార్టీ పిరాయింపు కేసులో చిక్కుకున్న ఎమ్మెల్యేకు స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో కొంత ఉపశమనం కలిగినా… ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో తెలియక తికమకపడుతున్నరట.. అటు అధికార కాంగ్రెస్ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ ఎమ్మెల్యే నో అర్థం కాక దూరంగా ఉంటున్నారంట.. దాంతో రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి తయారై, మహిపాల్రెడ్డికి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందట…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతం తెలియని వారుండరు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మూడు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, నియోజకవర్గం లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని వెలుగొందుతున్నారు. 2024 లో మూడో సారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి కి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. తన పరపతి కోసమో…ఈడి దాడుల నుంచి తప్పించుకోవడం కోసమో గాని 2024 జూలై లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పటాన్ చెరు నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ను కలిసి పార్టీలో చేరానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పుకుంటే… ఆయన చేరికను కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జీ కాట శ్రీనివాస్గౌడ్ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఒకానొక దశలో గాంధీ భవన్ ఎదుట ధర్నా సైతం చేపట్టారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ ఒక్క రోజూ నియోజకవర్గంలో అధికారికంగా చేపట్టిన మంత్రుల కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అటు బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాల్లోనూ కనబడలేదు. ఇంతలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు కేసు పెట్టింది.
పటాన్చెరు నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వీడడంతో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కన్వీనర్ గా ఆదర్శ్ రెడ్డిని నియమించారు. ఆయన పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొని కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా నష్టపోయినా కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగారు గూడెం కాంగ్రెస్లో చేరడంతో కాట శ్రీనివాస్కు షాక్ తగిలిందంట. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో అటు కాంగ్రెస్ నేతల్లో, ఇటు బీఆర్ఎస్ నేతల్లో అనిశ్చితి నెలకొంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అని క్లీన్ చీట్ ఇవ్వడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం ఈ విషయంపై మౌనంగా ఉండడం, మీడియాతో మాట్లాడి తాను ఏ పార్టీలో ఉన్నానో చెప్పే సాహసం చేయకపోవడంతో నియోజకవర్గం లో ఏ నోటా విన్నా ఎమ్మెల్యే ఇంతకీ ఎవరి మనిషో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పెద్దలు గూడెంను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తారా…ఆహ్వానిస్తే కన్వీనర్ ఆదర్శ్ రెడ్డి పరిస్థితి అంతేనా?.. కాంగ్రెస్ నేతలు దగ్గరకు తీస్తే నియోజకవర్గంలో కాట శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏంటనేది రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు తలలు పట్టుకుంటున్నారు.
మునుపెన్నడూ లేని విధంగా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీరును పలువురు ప్రశ్నిస్తూ ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఎమ్మెల్యే మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి అంటున్నారు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు. ఓట్లు వేసి గెలిపించాము మమ్మల్ని తికమక పెట్టకుండా అభివృద్దిపై దృష్టి సారిస్తారా? మీ బాగోగులు మీరు చూసుకుంటారా?.. ఏదో ఒకటి తేల్చండి అంటున్నారు ఓట్లు వేసిన ప్రజలు.
Story By Ramireddy, Big Tv