TG CM Progress Report: భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, పేదవాళ్లకు అన్యాయం జరగదని, ఎవరి ఆస్తులను గుంజుకోవడం లేదన్నారు. మనందరి భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రాజెక్టు అని మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ను గొప్ప అభివృద్ది చెందిన నగరంగా నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమన్నారు. అందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ ఇన్వైట్స్ సదస్సులో సీఎం పాల్గొన్నారు.
మూసీ నది పూర్వోత్తరాలు, ప్రస్తుత స్థితిగతులు, నగర ప్రజల భవితవ్యం, నది పునరుజ్జీవం ఆవశ్యకత, అవసరం, ప్రపంచ వ్యాప్తంగా రివర్ఫ్రంట్ల ప్రాముఖ్యత, మూసీ రివర్ఫ్రంట్లోని ప్రధాన అంశాలపై.. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ.. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత మూసీ ప్రాజెక్టు వెంట 10 వేల పేద కుటుంబాలున్నాయని, వాళ్లందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను సిద్ధం చేశామని తెలిపారు. కొందరికి సమీప ప్రాంతాల్లోనే ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంకొన్నేళ్లలో హైదరాబాద్ జనాభా రెండున్నర కోట్లకు చేరుతుందని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
తెలంగాణలో కోటీ 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుందని స్పష్టం చేశారు. పేదలకు సరైన విద్య, వైద్యాన్ని అందించినప్పుడు.. దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించగలిగినట్టేనని చెప్పారు. అందుకోసమే.. జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామన్నారు. గడిచిన రెండేళ్లలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ కింద 1800 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు పెట్టామన్నారు.
వరంగల్, అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్లో టిమ్స్, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో దాదాపు 10 వేల కోట్ల ఖర్చుతో.. 10 వేల పడకల ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లు సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఏడాదిలో నెల రోజుల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా.. యాంత్రికంగా సాగుతున్న విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. స్కిల్స్ మెరుగుపర్చుకోకపోతే ప్రపంచంతో పోటీ పడలేమన్నారు. అందుకే విద్యా విధానంలో సంస్కరణలు తెచ్చి, కొత్త పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యని అందించాలనే కాన్సెప్ట్తో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం తీసుకొస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ లేకుండా.. 12వ తరగతి వరకు పాఠశాల విద్య కిందకే తీసుకొస్తున్నామన్నారు.
హైదరాబాద్లో అతిపెద్ద నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుంది. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ను ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. నెట్ఫ్లిక్స్కు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాకారం అందిస్తామని, భారత్ ఫ్యూచర్ సిటీలోనూ అవసరమైన స్థలం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఫార్చూన్ 500 కంపెనీలు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలను నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ని సైతం ఇక్కడికే మార్చుకోవాలని కోరారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని.. కంపెనీల పెట్టుబడులకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుందని చెప్పారు. నెట్ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ గేట్వేలుగా పనిచేస్తాయన్నారు. ప్రపంచ వీక్షకులకు తెలంగాణను విశ్వవ్యాప్తం చేయడంలో.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Story by: Anup, Big Tv