కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. రైతుల ప్రాతిపదికగా, వ్యవసాయ సాగు భూముల ఆధారంగా ఈ పథకం అమలు కాలేదు. పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉంటే చాలు… వారికి రైతుబంధు ఇస్తామన్నాడు. పాసు పుస్తకముంటే రైతే కదా అనేది కేసీఆర్ ఇచ్చిన కొత్త నిర్వచనం. ఆ పాసుబుక్కుల్లో ఉన్న భూముల్లో రాళ్లు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలు ఏమున్నా పర్వాలేదు. వేసేయండి రైతుబంధు.. అన్నాడు.
అందరికీ అర్థం కాలేదప్పుడు. ఎన్ని ఎకరాలున్నా అన్నింటికీ రైతు బంధు వర్తిస్తుందన్నాడు. మనకైతే వస్తున్నాయిగా.. ఎవరికి ఎన్ని వేసుకుంటే మనకెందుకు? అనుకున్నారు కొంత మంది. అదేంటీ నాకు ఇంత తక్కువ భూమి ఉంది.. వాడికి వందల ఎకరాలున్నాయి… ఇద్దరినీ ఒకే గాటన కట్టి రైతుబంధు ఎట్లా వేస్తాడు? అని తమను తామే ప్రశ్నించుకున్నారు ఇంకొందరు.
ఉన్నోడికే అన్నీ ఇస్తున్నారు. వేలకు వేలు పంపుతున్నారు. మాకు భూమి లేదు.. ఇల్లూ లేదు.. మా గతేం గాను.. ఈయనేం సీఎం.. ఇదేం సర్కార్..? అని దుమ్మెత్తి పోశారు అందరు. కానీ కేసీఆర్ ఎవరి మాటా వినలేదు. తను వేసుకున్న లెక్కలు వేరు. తన అంచనాలు వేరు. ఆ సంక్షేమం అంతిమంగా చేర్చే ప్రతిఫలమూ వేరే. అది అప్పుడు వెంటనే అందరికీ అర్థం కాలేదు.
సరేలే, రైతులకైతే ఏదో ఆసరా అవుతుందనుకుని సరిపెట్టుకున్నట్టే సరిపెట్టుకున్నా.. దక్కినోడు, దక్కనోడు ఇద్దరూ లోలోన కుతకుతా ఉడికిపోయారు.ఇక్కడ కేసీఆర్ వ్యూహమేమిటంటే… కొందరికి ఇచ్చి, మరి కొందరికి ఇయ్యకపోతే.. మాకెందుకు రాలేదు..? అనే కొత్త ప్రశ్న లేవనెత్తడం ఎందుకు? అనేది ఓ కోణం. దీనికి ఓ స్లాబ్ విధానం పెట్టి పది ఎకరాలకే పరిమితం చేయాలన్నా.. ఆ పై ఉన్న ఎకరాల ఆసాములు .. ఓట్లేయరు. కోపంతో తిట్టిపోస్తారు. వీటన్నింటి కన్నా ఉత్తమం.. పాసుబుక్కున్న ప్రతీ ఒక్కరికీ రైతుబంధు వేసేస్తే.. ఎవరు తిట్టుకుంటారు. భూములు లేని కొద్ది మంది. నిరుపేదలు. వారి సంఖ్య ఎంత? ఓట్లెన్ని..? ఈ రైతు బంధు ఓట్లతో లెక్కిస్తే.. ఆ ఓట్ల శాతం ఎంత..? అంతిమంగా ఈ పథకం పార్టీకి ఏ విధంగా మేలు చేయనుంది..? ఇదిగో ఈ లెక్కలే కేసీఆర్ వేసింది.
పక్కాగా ఓటు బ్యాంకు లెక్కలన్నమాట. పేరుకు పేరు.. ఓట్లకు ఓట్లు. దేశం మొత్తం గొప్పగా చెప్పుకోవచ్చు.. నేను రైతులకు ఇలాంటి స్కీమ్ ఒకటి ప్రవేశపెడుతున్నా.. మీకు చాతనవుతదా? అని గడుసుగా వారిని గిల్లే ప్రయత్నమన్నమాట. ఇక నాకు తిరుగులేదు. ఇది నా మైండ్లోంచి వచ్చిన తిరుగులేని ఓటు బ్యాంకు అస్త్రం… దీన్ని తప్పించుకుని వచ్చి నన్ను ఓడించే మొనగాడు ఎవడు? అనే రేంజ్లో ఆయన ధీమాతో ఉన్నాడు.
ఎవడేం అనుకుంటే నాకెందుకు? ఓట్లు పడుతున్నాయా లేదా? అని అనుకున్నాడు. ఎవరైనా తనను ఢీకొట్టాలంటే.. అంతకు మించి.. ఇవ్వాలి, వారికి చేతనవుతుందా? అని భవిష్యత్ను కూడా ఊహించుకుని.. ఎవరికీ సాధ్యం కాదనుకున్నాడు. కానీ తాడిని తన్నే వాడికి వాడి తలను తన్నేవాడు ఒకడుంటాడు అన్నట్టు రేవంత్రెడ్డి వచ్చాడు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రైతుబంధును ప్రక్షాళన చేస్తాం.. సవరిస్తాం.. అర్హులకే ఇస్తాం.. అని ఏవేవో మాట్లాడినా.. తన పార్టీ మ్యానిఫెస్టోలో అవేవీ పేర్కొనలేదు. కానీ ఆమాంతంగా ఓ రెండు వేలు పెంచి ఇస్తామనే ఆశల పల్లకీలో ఊరేగించాడు. తానేం తక్కువ తినలేదు అన్నట్టుగా. ఓటు బ్యాంకు ఇటు మళ్లింది. రేవంత్ సర్కార్ కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం సాధ్యం కాలేదు. కనీసం ఓ స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఐదెకరాలో, పదెకరాలకో దీన్ని పరిమితం చేస్తాడేమోనని అనుకుంటే.. అదీ చేయలేదు.
సేమ్ కేసీఆర్ అడుగు జాడల్లోనే నడిచాడు. కాకపోతే సాగు చేసుకుంటే చాలు.. ఎన్ని ఎకరాలకైనా వేస్తానంటున్నాడు. అంటే వందల ఎకరాలున్న మల్లారెడ్డి లాంటి లీడర్కు కూడా వేస్తాడన్నమాట. ఆయనా రైతేగా. సేమ్ కేసీఆర్ పాలసీనే. అంటే పాలకులు మారినా.. అవే విధానాలు. ఓట్లు కొల్లగొట్టే పథకాలు. పేదరికం మరింత పేదరికంలో ..ఉన్నోడు మరింత సిరిమంతంలోకి.. ఇద్దరూ ఇద్దరే అన్నట్టు పాలన నడిచింది.
ఫీజు రియంబర్స్మెంట్కు, అభివృద్ధి పనులు చేపించే కాంట్రాక్టర్లకు, ఇతర హామీల అమలుకు నో బడ్జెట్. రైతుకు భరోసా పేరుతో అప్పులు తెచ్చి విచ్చలవిడిగా డబ్బులు పంచే విషయంలో ఈ భరోసా ఉన్నోడికీ దక్కుతున్నది. కడుపు నిండినోడికీ దక్కుతున్నది. అదే పేదోడి కడుపుమంట.