AP DSC Sports: శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ కేటగిరికి చెందిన ఓ అభ్యర్ధి 73 మార్కులతో, జిల్లా స్థాయిలో 168వ ర్యాంక్ సాధించారు. ఎస్సీ కేటగిరీలో ఆయన జిల్లా టాపర్. అయినా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎలాంటి కాల్ రాలేదు. దీంతో ఆ అభ్యర్ధి విచారణ చేశారు. అయితే జిల్లాలోని సంబంధిత పోస్ట్ స్పోర్ట్స్ కోటాకు రిజర్వ్ చేశారని, ఓ మహిళా అభ్యర్ధికి ఉద్యోగం కేటాయించారని తెలిసింది.
నిజానికి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన నాగరత్నం అనే మహిళా అభ్యర్ధి అర్హతపై తీవ్ర ఆరోపణలున్నాయి. అప్పటికే ఆమె KGBVలో పీఈటీ టీచర్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా ఎలాంటి అధికారిక సెలవు తీసుకోకుండా డిస్టెన్స్లో ఒక డిగ్రీ పూర్తిచేసి, పరీక్షలకు హజరయ్యారని ఆరోపణ ఉంది. అదే సమయంలో ఆమె BPED కూడా పూర్తి చేశారు. BPED అనేది రెగ్యులర్ కోర్స్. డిస్టెన్స్లో పూర్తి చేసే అవకాశమే లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ, అధికారిక సెలవు లేకుండా రెండు డిగ్రీలు ఆమె ఎలా పూర్తి చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణ జరిపి, నాగరత్నం అర్హురాలు కాదని నిర్ధారించి తొలగించారు.
Also read: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!
నాగరత్నం అర్హురాలు కాదని నిర్ధారించినా, ఖాళీ అయిన పోస్టును తదుపరి అర్హత ఉన్న వ్యక్తికి కేటాయించలేదు. నిబంధనల ప్రకారం ఎంపిక జాబితా ఒకసారి విడుదలైన తర్వాత, అందులో ఎంపికైన అభ్యర్ధి పోస్ట్ ఖాళీ అయితే ఆ ఖాళీని అలాగే ఉంచుతారు. అయితే మెరిట్ లిస్ట్ ముందుగా విడుదల చేసి ఉంటే, నిజమైన అర్హత కలిగిన అభ్యర్ధులు నాగరత్నం అర్హతను ప్రశ్నించే అవకాశం ఉండేది. అదే జరిగి ఉంటే ముందే ఆమె అర్హురాలు కాదని తేల్చి, మరో అభ్యర్ధి ఉద్యోగం పొందే అవకాశం ఉండేది. అధికారులు చేసిన తప్పుతో ఎవరికీ ఉద్యోగం రాకుండా పోయింది.
మరోవైపు డీఎస్సీ పరీక్షకు సంబంధించి.. ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగత మెసేజ్లు పంపకూడదని జిల్లా విజిలెన్స్ అధికారి ముందే ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన సమయంలో ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా మెసేజ్లు పంపినట్లు ఆరోపణ ఉంది. దీంతో మొత్తం సెలక్షన్ ప్రాసెస్లోనే పారదర్శకత పాటించలేదన్న అనుమానాలు వస్తున్నాయి.