Shadow Leaders: స్వేచ్ఛ బ్యూరో: మినిస్టర్ల అధికారిక కార్యాలయాలు,రాష్ట్ర సచివాలయంలో వింత వాతావరణం నెలకొన్నది. ప్రజాపాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తున్నప్పటికీ, మంత్రుల పేషీలలో (ఆఫీసుల్లో) మంత్రుల కంటే కూడా ‘షాడో’ నాయకుల హవానే ఎక్కువగా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక నిర్ణయాలు, సమీక్షా సమావేశాలు, చివరికి అత్యంత రహస్యంగా సాగాల్సిన ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియలోనూ కొందరు పార్టీ ముఖ్య నేతలు మకాం వేసి, జోక్యం చేసుకుంటున్నారనే వార్తలు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వాస్తవానికి మంత్రులకు కేటాయించిన శాఖల నిర్వహణలో మంత్రుల నిర్ణయమే తుది నిర్ణయం కావాలి. కానీ, సచివాలయంలోని పలువురి మంత్రుల చాంబర్లలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు టాక్.
ముఖ్యంగా మంత్రి సీతక్క పేషీలో ఓ మహిళా నేత నిత్యం మకాం వేస్తున్నట్లు సమాచారం. శాఖాపరమైన సమీక్షా సమావేశాలు, అధికారులతో జరిగే అంతర్గత మీటింగ్లలోనూ సదరు నేత ప్రత్యక్షమవుతున్నారనే చర్చ జరుగుతోంది. చివరికి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ల సమయంలోనూ ఆమె కూర్చునేందుకు ప్రయత్నిస్తుండటం చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వంటి మరికొందరి మంత్రుల పేషీల్లోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఉదయం నుంచే ఈ పేషీల్లో తిష్ట వేస్తున్నారు. తమ పనులు చేయించుకోవడమే కాకుండా, సచివాలయానికి వచ్చే ఇతర అధికారులను, కాంట్రాక్టర్లను శాసించే స్థాయిలో చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Also Read: ఇలా అయితే టార్గేట్ కంప్లీట్ చేయడం కష్టమే.. ప్రభుత్వానికి అధికారులు అల్టిమేటం!
సాధారణంగా ప్రభుత్వ ఫైళ్ల పరిశీలన, ఆమోదం అనేది సీక్రెసీతో కూడుకున్న వ్యవహారం. మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, సదరు ‘షాడో’ నేతలు ఫైల్స్ క్లియర్ చేసే సమయంలోనూ మంత్రుల పక్కనే కూర్చొని చొరవ చూపుతుండటం, ఏ ఫైల్ ముందుకెళ్లాలి, ఏది ఆగాలో దిశానిర్దేశం చేస్తుండటం కలకలం రేపుతోంది.అధికారులతో మంత్రులు కీలకమైన విషయాలు మాట్లాడేటప్పుడు కూడా ఈ నేతలు పక్కనే ఉంటుండటంతో స్వేచ్ఛగా చర్చించలేని పరిస్థితి నెలకొంది. నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అనధికారిక నేతల జోక్యం మంత్రులకు మింగుడు పడటం లేదు.పార్టీలో కీలక నేతలు కావడంతో పాటు అధిష్టానానికి దగ్గరి వారనే ముద్ర ఉండటంతో “ఇక్కడి నుంచి వెళ్లిపోండి” అని నేరుగా మంత్రులు చెప్పలేకపోతున్నారు. మరోవైపు పాలనా వ్యవహారాల్లో వీరు పెత్తనం చెలాయిస్తుండటంతో మంత్రుల స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది.తమ అసంతృప్తిని బయటకు చెప్పుకోలేక, అలాగని వారిని నివారించలేక మంత్రులు అంతర్మథనంలో మునిగిపోతున్నారు.అధికారులు ఇచ్చిన నివేదికల కంటే కూడా ఈ షాడో నేతలు చెప్పే అంశాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంపై మంత్రుల వద్ద పనిచేసే సిబ్బంది సైతం గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇలాంటి షాడో నాయకుల జోక్యం వల్ల ప్రభుత్వ ఇమేజ్కే మచ్చ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులకు, మంత్రులకు మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని ఈ నేతలు దెబ్బతీస్తున్నారనే ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని మంత్రుల పేషీలపై ఈ ‘షాడో’ల నీడ పడకుండా చర్యలు తీసుకోవాలని సచివాలయ వర్గాలు కోరుతున్నాయి.
Also Read: ఎల్లంపేట్ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!