రవాణాశాఖ పరిధిలో నడుతుపుతున్న అద్దె(హైర్) వాహనాలకు ప్రతి నెలా బిల్లులు రాకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీలకు వెళ్లే క్రమంలో అద్దెవాహనదారులు డీజిల్, పెట్రోల్ ఖర్చులు ఇస్తేనే వస్తామని మెళికలు పెడుతుండటంతో అధికారులు విధిలేని పరిస్థితుల్లో చెల్లించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా అద్దెవాహనాలకు బిల్లులు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపుతున్నా నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 5వేలకు పైగా అద్దెవాహనాలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే రవాణా శాఖలోనూ సుమారు 50 నుంచి 100వరకు అద్దె (హైర్) వాహనాలు కొనసాగుతున్నాయి. అయితే శాఖ పరిధిలో ఉన్న తిప్పుతున్న వాహనాలకు గత 5నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. దీంతో శాఖలో అధికారిక పనులు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం అద్దె వాహనాలు సేవలందిస్తున్నాయి. బిల్లులు పెండింగ్ లో ఉండటంతో వాహన యజమానులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ బిల్లులు రాకపోయినా, శాఖాపరమైన విధులకు, తనిఖీలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయి అధికారులు కొందరు సొంత వేతనాల నుంచే డీజిల్ , నిర్వహణ ఖర్చులు భరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో అద్దె వాహనానికి నెలకు సగటున రూ. 33,000 నుంచి ప్రారంభమై అద్దె చెల్లించాల్సి ఉంటుంది. విడిభాగాలు, బీమా, ఈఎంఐలు, డ్రైవర్ల జీతాలు పెరిగినప్పటికీ నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు పలువురు తెలిపారు.
Also Read: భోగాపురంలో ఎయిర్పోర్ట్.. ఇలాగైతే వైజాగ్ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావా?
రవాణా శాఖలో తనిఖీలు, అధికారిక పర్యటనలు నిత్యం చేయాల్సి ఉంటుంది. వాహనాల ఫిట్నెస్ పరీక్షలు, ఇతర తనిఖీలు క్రమం తప్పకుండా జరగాలి. వాహనాలు నిలిచిపోతే అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రభావం పడుతుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగే అవకాశం లేకపోలేదు. రవాణాశాఖలో పనిచేస్తున్న అధికారులకు ఇచ్చిన టార్గెట్ ను సైతం చేరుకోలేరని,ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు, తనిఖీల ద్వారా జరిమానాల వసూళ్లు వంటి అంశాలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం కూడా ఉందని ఉద్యోగులే అభిప్రాయపడుతున్నారు.
రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వ వాహనాలు ఇవ్వాలని ఇప్పటికే శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఏజిల్లాకు, హెడ్ కార్టర్ ఆఫీసుకు ఎన్ని వాహనాలు అవసరమే లిస్టును పంపారు. అయితే నెలలు గడుస్తుంది. కానీ అడుగు ముందుకు పడటం లేదు. దీంతో అధికారులకు అద్దె వాహనాలే దిక్కు అవుతున్నాయి. మరోవైపు డీజిల్, పెట్రోల్ వాహనాలు కాకుండా ఈవీ వాహనాలు ఇవ్వాలని ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి విన్నవించినట్లు సమాచారం. అయితే అసలు వాహనాలు ఇస్తారా? ఇవ్వరా? అనేది ఇప్పుడు శాఖలోనే ఆసక్తి కర చర్చ జరుగుతుంది. కేవలం అధికారుల ప్రపోజల్స్ కాగితాలకే పరిమితం అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
అద్దెవాహనాల బిల్లులు 5నెలలు పెండింగ్ లో ఉంటే 2 నెలలే వస్తున్నట్లు వాహన యజమానులు పేర్కొంటున్నారు. మళ్లీ రెండునెలల తర్వాత అంటే 5నెలలు అయిన తర్వాతనే బిల్లులు వస్తున్నాయి. దీంతో వాహనాలను నడపాలంటే భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు సైతం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే, ప్రభుత్వ శాఖల రోజువారీ విధులకు, రవాణా తనిఖీలకు మరింత విఘాతం కలిగే అవకాశం లేకపోలేదు.
Also Read: ఈకలు పీకడం.. వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్