Singanamala: సెంటిమెంట్ కోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ నేతల మధ్య పోరుతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. కానీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తన వ్యూహాన్ని మార్చుకుని దూకుడుగా జనాల్లోకి వెళ్తుండటం, కీలక నాయకుల పర్యటనల్లో పంచాయితీలు లేకపోవడం చూస్తుంటే…అక్కడ టీడీపీలో విభేదాలు సమసిపోయాయా? ఈ విషయంలో అధిష్టానం జోక్యం ఫలించిందా? ఇంతకీ అది ఏ నియోజకవర్గమో ఇప్పుడు చూద్దాం.
నిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా విబేధాలు ఉండే సింగనమల నియోజకవర్గంలో శాంతిమంత్రం ప్రతిధ్వనిస్తోంది. నిన్న, మొన్నటి వరకు MLAకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు కలిసిపోయారా లేదా తుఫాను ముందు వచ్చే ఉన్న ప్రశాంతమా అని చర్చించుకుంటున్నారు. వాస్తవానికి సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీనే పైన అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉండేది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు.. ఆ తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు. టీడీపీ నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బండారు శ్రావణి శ్రీకి మొదట్లో అంతా సానుకూలంగానే సాగింది. 2019 ఓటమి తర్వాత, లోకేష్ సమక్షంలో సీనియర్ నాయకుల హామీతో ఆమె విజయాన్ని సులభతరం చేసుకున్నారు. అయితే, గెలుపు సంబరాలు ముగియకముందే, నియోజకవర్గంలో అసలు సమస్య మొదలైంది.. అదే అంతర్గత వర్గ పోరు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా, అది ఎమ్మెల్యే శ్రావణి వర్సెస్ ఇతర నాయకులు అనే పరిస్థితికి దారితీసింది. ఎమ్మెల్యే వర్గం ఒక వైపు ఉండగా, ADCC బ్యాంక్ ఛైర్మెన్ మంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఆలం నరసనాయుడు వంటి కీలక నేతల వర్గాలు మరోవైపు విడిపోయాయి. వీరు ‘టూ మెన్ కమిటీ’ సభ్యులుగా కొనసాగుతూ, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం ద్వారా పార్టీలో స్పష్టమైన చీలిక కనిపించింది.
గత కొంతకాలంగా ఈ విబేధాలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, తన నియోజకవర్గంలోని గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు విని, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. TDP అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమె గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ పరిశీలనలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇది పార్టీలోని మునుపటి విబేధాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే గత 16 నెలలుగా ఆమె చేసిన మంచి కంటే నెగెటివ్ అంశాలే జనాల్లోకి ఎక్కువగా వెళ్లేవట. వాటిని పాజిటివ్ గా మార్చే అంశాలపై MLA శ్రావణి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎక్కడైతే తన పట్ల వ్యతిరేక భావన ప్రజల్లో ఏర్పడుతుందో అక్కడినుంచే నరుక్కొచ్చే పనిలో పడ్డారు శ్రావణి.
సాధారణంగా జిల్లాలో కీలక నాయకుల పర్యటనల ముందు, సింగనమలలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరేవి. ప్రత్యర్థి వర్గాలు ఏదో ఒక పంచాయితీని పెట్టుకుని, నేరుగా నాయకులకు ఫిర్యాదులు ఇచ్చేవి. కానీ, ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ రెండు రోజుల పాటు పర్యటించినప్పుడు… సింగనమల నుంచి ఎలాంటి అంతర్గత ఫిర్యాదులు, పంచాయతీలు లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమేనట.
ఓవైపు బండారు శ్రావణి దూకుడుగా జనాల్లోకి వెళ్తుండడం మరోవైపు మిగతా నాయకులు సైలెంట్ గా ఉండడం చూస్తుంటే సింగనమలలో విబేధాలు సమసిపోయాయా అన్న అభిప్రాయం కలుగుతోంది. టీడీపీ నాయకులంతా కలిసి లోకేష్ను కలవడం, అంతా బాగున్నట్టుగా ఫోటోలు దిగడం చూస్తుంటే, తాత్కాలికంగానైనా విభేదాలు సమసిపోయాయా అనే అభిప్రాయం కలుగుతోంది. ఇక ఇప్పటినుంచి అయిన సింగనమల టిడిపిలో విబేధాలు వీడి ముందుకువెళ్తారా లేదంటే షరా మామూలే అన్నట్టు వ్యవహరిస్తారా అనేది చూడాలి. అధిష్టానం మద్దతుతో ఎమ్మెల్యే శ్రావణి చేపట్టిన ఈ కొత్త వ్యూహం, అంతర్గత విభేదాలకు శాశ్వతంగా తెరదించి, సింగనమల టీడీపీని ఏకతాటిపైకి నడిపిస్తుందా? లేదంటే మళ్లీ పాత సమస్యలే షరా మామూలుగా కొనసాగుతాయా? అనేది చూడాల్సి ఉంది.
Story by Venkatesh, Big Tv