Sircilla: గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ పార్టీల గుర్తులు లేనప్పటికీ వారి మద్దతుదారులే రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆసక్తి నెలకొంది. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ ను ఎదుర్కొని అలాంటి ఫలితాలు వస్తాయా;.. కేటీఆర్ వ్యూహం ఏంటి?
సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2023 వరకు ప్రతి ఎన్నికల్లో కూడా తన సత్తాను చాటింది. ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతుదారులే 90 శాతానికి పైగా విజయం సాధించారు. అదేవిధంగా మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన హవాను చాటింది. ఇప్పుడు జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వస్తాయా.. అనే చర్చ సాగుతోంది.
రెండు సార్లు అధికారం చెలాయించి, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో ఎంత ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ఇక్కడ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో గత ఎన్నికల ఫలితాలు వస్తాయా.. రావా.. అనే అంశం పైన చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ కేటీఆర్ ను దెబ్బతీసేందుకు తమ మద్దతుదారులను అధికంగా గెలిపించేందుకు వ్యూహాలను రూపొందిస్తుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్రెడ్డి ఈ క్రమంలో ఈ సెగ్మెంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సిరిసిల్ల సెగ్మెంట్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తే జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది
ఇప్పటికే కేటీఆర్ రెండుసార్లు సిరిసిల్లలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అంతేకాకుండా మండలాల వారీగా నేతలను పిలిపించుకొని వారితో మాట్లాడారు. గత ఎన్నికల ఫలితాలే మళ్లీ ప్రతిబింబించాలని నేతలను, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. రెండు, మూడు విడతలలో సిరిసిల్ల సెగ్మెంట్లలో పలు గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాలలో బలమైన బీఆర్ఎస్ నేతలను సర్పంచ్లుగా బరిలోకి దింపుతున్నారు. అదేవిధంగా మేజర్ గ్రామపంచాయతీలో మరింత సత్తా చాటేందుకు ప్లాన్ రూపొందిస్తున్నారు.
ముఖ్యంగా మండల కేంద్రాల్లో పై చేయి సాధించేందుకు ముందుండాలని బిఆర్ఎస్ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కేటీఆర్ వీలున్న సమయంలో పార్టీ శ్రేణలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నారు. గెలాబీ పార్టీ అధికారం పోయిన తర్వాత ఇవి మొట్టమొదటి స్థానిక సంస్థల ఎన్నికలు. గత ఎన్నికలు లాగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా.. అధికార పార్టీ పైచేయి సాధిస్తుందా? అన్నిది పార్టీలోనే చర్చకు దారి తీస్తోంది. గులాబీ శ్రేణులు ఈ ఎన్నికలు కేటీఆర్ కు అత్యంత కీలకం … ఈ క్రమంలోనే ఏ చిన్నపాటి పొరపాటు చేయవద్దంటూ నేతలను కోరుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు, ప్రతిపక్ష పార్టీ బిజెపి కూడా గట్టి దృష్టి పెట్టింది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొని బీఆర్ఎస్ మద్దతు దారులు ఎంతవరకు సత్తా చాటుతాటంరటూ చర్చ సాగుతుంది.
ఇప్పటికే గ్రామాల వారిగా బీఆర్ఎస్ నేతలు వివరాలను సేకరించారు. రిజర్వేషన్ల వారీగా మద్దతు దారులను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీలో మాత్రం పార్టీ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. దీంతో మేజర్ గ్రామపంచాయతీలో గతంలో లాగానే సత్తా చాటాలని దృష్టి పెడుతున్నారు. అయితే కేటీఆర్ ఎంత చేసిన ఏం చేసిన తమదే విజయం అంటూ కాంగ్రెస్ ధీమాగా ఉంది. తను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే 6గ్యారంటీల అమలు లేని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేస్తోంది. మొత్తానికి కేటీఆర్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి చూడాలి ఏ పార్టీ మద్దతుదారులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తారో.
Story by Apparao, Big Tv