Telangana BJP: నేతల కోల్డ్ వార్తో సతమవుతున్న తెలంగాణ కాషాయ పార్టీలో మరో చిచ్చు రేగిందా…? కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన బీఎల్ సంతోష్..కొత్త చిచ్చు పెట్టారా..? ఆర్గానిక్..అనార్గానిక్ అంటూ చేసిన కామెంట్స్…బీజేపీ నేతల్లో మంటలు రేపాయా..? విభేదాలున్న నేతలను కలపాల్సిన దూతలే..వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేంటన్న చర్చ కమలం పార్టీలో నడుస్తోందట. మరి ఎవరి ఉద్దేశించి బీఎల్ సంతోష్ ఆర్గానిక్..అనార్గానిక్ అంటూ వ్యాఖ్యలు చేశారు..? ఈ కామెంట్స్ రాష్ట్ర బీజేపీకి డ్యామేజ్ చేస్తాయా..?
తెలంగాణలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది బీజేపీ. నేతల మధ్య కోల్డ్వార్తో.. ఉన్న పరువును పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పదవుల రచ్చతో పాటు విభేదాలతో నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసంతృప్తి రాగాలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతూ.. పార్టీకి డ్యామేజీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఢిల్లీ నుంచి దూతగా వచ్చిన బీఎల్ సంతోష్.. నేతల మధ్య సయోధ్య కుదరాల్చింది పోయి.. మరిన్ని మంటలను రగిల్చి వెళ్లిపోయారట. ఆర్గానిక్.. అన్ అర్గానిక్ అంటూ బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.
ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. నేతలను ఆర్గానిక్, అనార్గానిక్ నేతలంటూ విభజించి మాట్లాడటం సంచలనంగా మారింది. ఆర్గానిక్ నేతలను ఎవరేం చేయలేరు, అన్ ఆర్గానిక్ నేతలంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా పన్నాగాలు ఫలించవ్ అంటూ ఘాటుగా విమర్శించారట. ఈ వ్యాఖ్యలతో కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల్లో గుబులు పుట్టిస్తుందట. ఇతర పార్టీలో ఓ వెలుగు వెలిగి…గ్రహచారం బాగాలేక..బీజేపీ చేరిన నేతలు..అధిష్టానం దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్న పరిస్థితి. బీజేపీలో పాతుకుపోయి ఉన్న నేతలతో సయోధ్య కుదరక…అసహనంతో, ఆత్మాభిమానాలు చంపుకుని కొనసాగుతున్న దుస్థితి. అయినా కూడా పాత నేతలను ధీటుగా ఎదుర్కొంంటూ..తమ ఉనికిని చాటు కునే క్రమంలో హస్తిన నుంచి వచ్చిన దూత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు..కొత్త నేతలకు భయంతో పాటు..బాధను, అసంతృప్తిని పుట్టించాయట.
తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఉండదని.. పాత నేతలు.. ఎదగనివ్వరనే విమర్శలు ఇప్పటికే ఆ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. అంతేకాదు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి ..పార్టీ సీనియర్లతో పొసగక.. వెళ్లిన వివెక్, రాజాగోపాల్ రెడ్డి, విజయశాంతి, యొన్నెం శ్రీనివాస్ రెడ్డి, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి కీలక నేతలు బాహాటంగానే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా. ఈ అభిప్రాయాలను నిజమనుకునే విధంగా ..బీఎల్ సంతోష్ చేసిన ఆర్గానిక్.. అన్ ఆర్గానిక్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది పార్టీలో చేరి ఏళ్లు గడుస్తున్న, ఎలాంటి పదవులు, ఎలాంటి ప్రియారిటీ దక్కలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. నేతలే కాదు నేతలను నమ్ముకుని వచ్చిన కింది స్థాయి కార్యకర్తలు..తమ నేతలకే పార్టీలో విలువ లేదు.. ఇంకా తమకేం విలువ ఉంటుందనే మాట్లాడుకుంటున్నారట. పోస్టులు, పదవుల్లో కొత్తగా చేరిన వారికి ఇంత అన్యాయం చేస్తారా అనే ఆవేదన పలువురి నుంచి వ్యక్తమవుతోందట. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడుతున్నా కూడా…ఆర్గానిక్..అన్ ఆర్గానిక్ అంటూ విడదీసి విభేదాలను సృష్టించడం సరైంది కాదంటున్నారట.
బీఎల్ సంతోష్ మాటలతో కొత్త నేతల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయట. బీఎల్ సంతోష్ వార్నింగ్ను బట్టి.. తమకు ఇక్కడ ఫ్యూచర్ ఉండదా..? పాత నేతలు తమను ఎదగనివ్వరా..? పార్టీని, పార్టీ నాయకత్వాన్ని తామేం చేయలేరనే హెచ్చరికలు దేనికి సంకేతం..? తాము ఆర్గానిక్ నేతలుగా మారాలంటే ఇంకెంత కాలం పడుతుంది..? అప్పటి వరకు తమకు ఈ అవమానాలు తప్పవా…? అని అందోళన చెందుతున్నారట. విలువ, కనీస గౌరవం లేకుండా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎందుకు ఉండాలని కొందరు తమను తాము ప్రశ్నించుకుంటున్నారట. అటు అనుచరులు సైతం తమ నేతల దగ్గర ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని టాక్.
అసలే ఎన్నికల్లో వరుస ఓటములతో డీలా పడిపోతున్న కమలం పార్టీలో బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలతో మరింత చిచ్చుపెట్టిందని చెప్పొచ్చు. నేతలను సమన్వయం చేసి…పార్టీ గెలుపుకోసం దిశానిర్దేశం చేయాల్సిన దూతలే…వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీకి మరింత నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్గానిక్, అన్ ఆర్గానిక్ అంటూ కొందరు నేతలను మెచ్చుకుని.. కొత్త నేతలను అవమానించడం పార్టీని డ్యామేజీ చేస్తుందంటున్నారట. బీఎల్ సంతోష్ పెట్టిన ఈ ఆర్గానిక్, అన్ ఆర్గానిక్ మంటలను చల్లార్చెదెవరు.. ఆ నిప్పులపై నీళ్లు పోసేదెవరు..? కాషాయ వనంలో జరుగుతున్న డ్యామేజ్ ను అరికట్టేదెవరు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Story By Kishan, Big Tv