Letter War: బాగా వినండి! కేంద్రమంత్రి అపాయింట్మెంట్ కోసం కాంగ్రెస్ సీఎం.. బీజేపీ లీడర్కు లెటర్ రాస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని.. అదే సీఎంకు లెటర్ రాస్తారు. బహుశా రసవత్తర రాజకీయం అంటే ఇదేనేమో! బ్లేమ్ గేమ్ అంటే ఇలాగే ప్లే చేయాలేమో! ఇది చూశాక చాలా మందికి అనిపిస్తోంది.. తెలంగాణ పాలిటిక్స్ కీలక దశలో ఉన్నాయా అని!
ఇప్పుడు చెప్పబోయేది విషయమే కాదు.. అంతకుమించిన విశేషం కూడా! హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పెండింగ్ మెట్రో ప్రాజెక్ట్ అంశాలపై పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని.. కిషన్ రెడ్డి కోరారు సీఎం రేవంత్. మెట్రో ఫేజ్-2, IRFC ఫైనాన్సింగ్పై చర్చకు.. సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సోమవారం, మంగళవారం తాను ఢిల్లీలోనే ఉంటానని, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీకి సమయం కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. ఇద్దరం కలిసి రైల్వే మంత్రిని కలుద్దామన్నారు. సంబంధిత ఒప్పంద పత్రాలతో సమావేశానికి హాజరవుతానని లేఖలో రాశారు. దీనికంటే ముందే ఈ నెల 16నే.. మెట్రో రైల్ అంశంపై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి తాను సిద్ధమేనని చెప్పారు. రైల్వే మంత్రితో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయించాలన్నారు. ఆ లేఖకు.. కిషన్ రెడ్డి నుంచి స్పందన రాకపోవడంతో.. ఇప్పుడు మరోసారి లేఖ రాశారు.
రేవంత్ రెడ్డి లేఖకు కౌంటర్గా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు. నెరవేరని కాంగ్రెస్ గ్యారంటీలపై నిలదీసేందుకు, ప్రజల గోడు వినిపించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీతో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. కాంగ్రెస్ నాయకత్వం అపాయింట్మెంట్ ఇప్పించడంలో విఫలమైతే.. అది తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ చేసిన ద్రోహమే అవుతుందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో.రాహుల్, సోనియా, ప్రియాంక తెలంగాణలో పర్యటించి, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను నమ్మడం వల్లే జనం కాంగ్రెస్కు ఓటేశారన్నారు రాంచందర్ రావు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా ఆ పథకాల కోసం ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కాంగ్రెస్ నేరవేర్చని హామీలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి, నిలదీసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి.. రాహుల్తో మీటింగ్ ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు.
Also read: Today Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధికి, బీజేపీ 12 ఏళ్లలో చేసిన అభివృద్ధికి చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాంచందర్ రావు.. పీఎం మోడీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే.. 3 ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీల గురించి అడుగుతామన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో మీటింగ్ గురించి మాట్లాడదామన్నారు. బీజేపీ నేతలు.. ముందు వాళ్లిచ్చిన హామీలపై ఫోకస్ పెడితే మంచిదన్నారు. తెలంగాణ పాలిటిక్స్లో నడుస్తున్న ఈ లెటర్ వార్ పొలిటికల్ థ్రిల్లర్ని తలపిస్తోంది. దీని వెనుక ఆసక్తికరమైన రాజకీయ కోణాలున్నాయ్. ముఖ్యంగా.. పొలిటికల్ మైలేజ్ కోసం.. రెండు పార్టీలు ప్లే చేస్తున్న బ్లేమ్ గేమ్ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ.. ప్రజల్లో ఒకరినొకరు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయ్.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుపుకొని వెళతామని, దేనికైనా సిద్ధమేనని సీఎం రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు.. మీరిచ్చిన హామీలపై నిలదీస్తాం.. రాహుల్ని కలిపించండని కౌంటర్ ఇవ్వడం బీజేపీ స్ట్రాటజీ. స్టేట్లో బీఆర్ఎస్ కాస్త సైలెంట్ అయిన ప్రతిసారీ.. నెక్ట్స్ ఆల్టర్నేట్ మేమేనని నిరూపించుకునేందుకు బీజేపీ ట్రై చేస్తుంది. రాష్ట్రంలో తమకు ఇంకొన్నేళ్ల దాకా ఢోకా లేదనే చూపించుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో సఖ్యతగా ఉంటూనే, మరోవైపు లోకల్ బీజేపీ నేతలను రాజకీయంగా ఇరుకున పెట్టే వ్యూహాలను అమలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడంలో వెనక్కి తగ్గడం లేదు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది మరింత ఇంట్రస్టింగ్గా మారింది.
Storey By: Appa rao Big Tv
Also read: Ukraine Drones: దెబ్బకు దెబ్బ.. అన్నంత పని చేసిన ఉక్రెయిన్.. షాక్లో రష్యా దేశం..?