Ramachandra Rao: స్థానిక పోరులో గెలవడానికి వ్యూహాలు వేయాల్సిన రాష్ట్ర నాయకత్వానికి.. సొంత పార్టీ నేతల నుంచే సహకారం కరువైందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయనకు.. సొంత పార్టీ నేతల ఇగోలు, అసంతృప్తులు తీవ్ర తలనొప్పిగా మారాయట. కేంద్ర నాయకత్వం, ముఖ్య నేతలు ఎంత చెప్పినా.. పాత పద్ధతే కొనసాగుతుండడం ఆ పార్టీ లక్ష్యాలకు గండి కొడుతోందనే చర్చ నడుస్తోంది. అందుకే ఆ పార్టీలో ఎవరికి వారెనా..? ఎవ్వరు ఎవరి మాట వినడం లేదా..? గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ఎవరి ఎజెండాలు వారివేనా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. గ్రామ స్థాయిలో ఎవరు బలపడితే, అది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుందన్న నేపథ్యంలో.. అన్ని పార్టీలు ఈ స్థానిక పోరుపై తీవ్రంగా ఫోకస్ చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ‘ప్రజా పాలన విజయోత్సవాల’ పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతి నియోజకవర్గాన్ని టార్గెట్గా చేసుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇక, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని.. అధికారంలోకి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పదేపదే చెప్పుకుంటున్న బీజేపీలో మాత్రం నేతల అడుగులు హైకమాండ్ లక్ష్యానికి భిన్నంగా పడుతున్నాయనే టాక్ నడుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బలపడాలని రాష్ట్ర నాయకత్వం చూస్తున్నా.. నేతలు, క్యాడర్ నుంచి సరైన సహకారం లభించడం లేదట.
జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా తల పట్టుకుంటున్నారట. దూకుడుగా ముందుకు వెళ్లాలనే జోష్ ఉన్నప్పటికీ.. ఆయనకు సొంత పార్టీ నేతల అసంతృప్తులు, ఇగోలు ఊహించని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. బీఎల్ సంతోష్ చెప్పినట్టు ‘ఆర్గానిక్ నేత’ అయిన రామచందర్ రావుది.. ఎవరితో పంచాయతీలు పెట్టుకునే మనస్తత్వం కాదు. అయినా కూడా.. ఆయనకు అధ్యక్ష పదవి దక్కడం చాలా మంది నేతలకు మింగుడు పడటం లేదనే టాక్ ఉంది. అందుకే.. కొంతమంది ముఖ్య నేతలు పార్టీని, పార్టీ శ్రేణులను బైపాస్ చేస్తూ వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
‘బైపాస్ లేదు.. షార్ట్ కట్ లేదు.. సమన్వయంతో ముందుకు వెళ్తామన్న’ మాటలు గాలిలో కలిసిపోయాయనే చర్చ పార్టీలో నడుస్తోంది. రాష్ట్ర నాయకత్వం సర్పంచ్ ఎన్నికలపై కార్యాచరణ రూపొందించి, అన్ని జిల్లాలకు ఇంచార్జీలను నియమించినప్పటికీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎవరు సహకరించడం లేదట. స్థానిక సంస్థల కసరత్తుల కంటే.. నేతల నుంచి వచ్చే తలనొప్పులే రాష్ట్ర నాయకత్వానికి అంత ఇంత కాదట. జిల్లాలకు ఇంచార్జులను ప్రకటించినా.. వారు క్షేత్రస్థాయికి వెళ్లకుండా స్టేట్కే పరిమితం అవుతున్నారు. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే.. తాము కూడా చేతులెత్తేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్టుగా టాక్ నడుస్తోంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ముందు గ్రౌండ్ లెవల్లో జరిగే లోకల్ ఫైట్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని పార్టీ అంచనా వేస్తోంది. గతంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 10 లక్షల నజరానా ఇస్తామని బండి సంజయ్ ప్రకటించినా.. ఆ ప్రభావం కనిపించలేదు. చాలా చోట్ల పోటీకి అభ్యర్థులు కరువయ్యారనే చర్చ సైతం పార్టీలో తీవ్రంగా జరుగుతోంది. మొత్తానికి.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర నాయకత్వానికి, నేతలకు మధ్య ఉన్న క్రైసిస్ మరోసారి బయటపడటం.. పార్టీ అనుకున్న లక్ష్యాలకు గండి కొడుతుందన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. కొత్త బాధ్యతలు చేపట్టిన రామచందర్ రావు.. ఈ అంతర్గత క్రైసిస్ను, నేతల మధ్య గ్యాప్ను ఎంతవరకు సమన్వయం చేస్తారు..? ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో.. బీజేపీ నాయకత్వం అనుకున్న సర్పంచులను గెలిపించుకోగలుగుతుందా? లేక నేతల సహకారం లేక చేతులెత్తేయాల్సి వస్తుందా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందట.
ఏదిఏమైనా ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. సర్పంచ్ ఎన్నికల్లోనూ కమలం పార్టీ చేతులెత్తేసినట్టేనా అనే సమాధానాలే వస్తున్నాయి. లోకల్ ఎన్నికలపై ఆ పార్టీ అధ్యక్షుడు కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా.. నేతలెలెవ్వరు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుందట. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఒక బెంచ్మార్క్ కానున్నాయి. మరి అధ్యక్షుడు రామచందర్ రావు నేతలందరినీ ఒకేతాటిపైకి తెచ్చి.. ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
Story by Venkatesh, Big Tv