Veligonda Project: ఐదేళ్లో.. పదేళ్లో కాదు.. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత వెలిగొండ ప్రాజెక్టు దగ్గర రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఫేజ్-1 ప్రారంభం కానుంది. ఈ చారిత్రక క్షణాన్ని కళ్లారా చూసేందుకు చుట్టుపక్కల మండలాల రైతులు, యువత, మహిళలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల తర్వాత.. మళ్లీ తానే ప్రారంభిస్తుండటం అదృష్టమని ఆయన చెప్పారు.
శ్రీశైలం నుంచి 18.8 కిలోమీటర్ల జంట సొరంగాల ద్వారా కృష్ణా నీటిని నల్లమల సాగర్కు తరలిస్తారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం 10 వేల కోట్లకు పైనే. తొలి దశలో లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని అంచనా. రెండో దశలో 3 లక్షల 28 వేల ఎకరాలకు నీళ్లు చేరతాయి. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ పీడిత, కరువు ప్రాంతాలకు ఇది ప్రాణాధారం. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, కరవు మండలాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ తెలిపారు. పంటల వైవిధ్యం, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫ్లోరైడ్ సమస్య ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ ట్యాప్ కనెక్షన్ల ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు.
Also read: టీమిండియా మహిళా క్రికెటర్ల బ్యాట్లు చెక్ చేయాలి !
మరోవైపు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. ఇప్పటికే.. 6 వేలకు పైగా నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయలు అందించారు. మిగతా 132 కోట్ల పరిహారాన్ని త్వరలోనే చెల్లించనున్నారు. శంకుస్థాపన చేసిన చేయే.. ప్రారంభోత్సవం చేసే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కృష్ణా నీళ్లు కరువు నేలకు చేరాక.. ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయంటున్నారు.
Also read: NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!