AP Ugadi Politics: తెలుగు సంవత్సరాది నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో సాగిన ఆ ప్రచారం, నేడు పొలిటికల్ సర్కిల్లోకి , ప్రభుత్వ వర్గాల్లోకి కూడా చేరిందా? ఇప్పుడు ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఆ రెండు విషయాల మీదే చర్చ ఎందుకు పెడుతున్నారు? ఇంతకీ ఉగాది నాడు ఏపీ లో ఏం జరగబోతుంది? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం… ప్రచారంగానే మిగిలిపోతుందా? లేక నిజం కాబోతోందా?
ఉగాది పండక్కి ఆంధ్రప్రదేశ్లో రెండు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని.. గత వారం పది రోజులుగా సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ప్రచారం సాగుతోంది. అందులో ఒకటి చంద్రబాబు ఉప ప్రధాని కాబోతున్నారు, డిప్యూటీ సీఎం పవన్ రాజ్యసభకు వెళ్లబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్ పట్టాభిషేకం జరగబోతుందని, ఎవరికి ఇష్టవచ్చినట్లు పోస్టులు పెడుతూ ఊదరగొడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మార్పులు చేర్పులకి ఉగాదికి ముహూర్తం పెట్టారని మరో ప్రచారం జరుగుతోంది.. వాస్తవానికి చంద్రబాబు ఉప ప్రధాని అనే అంశం మొదట సోషల్ మీడియాలో ప్రారంభమైంది. ఎవరు చేశారు ఎందుకు చేశారో తెలీదు కానీ దీని పై ప్రచారం మాత్రం తారాస్థాయికి చేర్చారు.
వారి వారి రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్కరు ఒక్కోరకంగా సోషల్. మీడియా వేదికగా దీని. మీద మాట్లాడుతూ వచ్చారు.. మెయిన్ స్ట్రెమ్ మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ సాగడంతో, నిజంగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నారా అనే చర్చ బలంగా సాగింది. అయితే దీనిపైన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుండి అధికారికంగా ఎవరు ఖండించలేదు.. అంతేకాదు సోషల్ మీడియాలో జరిగే ప్రతిదానికి వివరణ ఇచ్చుకుంటూ పోతే పుణ్యకాలం ముగిస్తుందంటూ .. కొంతమంది నేతలు ఈ అంశంపై ఆఫ్ ద రికార్డుగా పెదవి విరుస్తున్నారు.
ఆ బేస్ లేని ప్రచారంపై వైసీపీ నేతలు మాత్రం గట్టిగానే రియాక్డ్ అవుతున్నారు. మాజీ సీఎం జగన్ దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ… సీఎంగానే చంద్రబాబుని రాష్ట్ర భరించలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఇక ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారో అంటూ తన స్టైల్లో సెటైర్లు వేశారు.
వైసీపీ నేత తోట త్రిమూర్తులు దీనిపై చిట్ చాట్ లో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన త్రిమూర్తులు.. సీఎం చంద్రబాబు ఉపప్రధాని, లోకేష్ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోందన్నారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటే కాపులు ఒప్పుకునే ఛాన్సే లేదని కులం కార్డు ప్రయోగించడానికి ప్రయత్నించారు.
మరోవైపు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అయ్యే అవకాశం ఉందని పేర్ని జోస్యం చెప్పారు. ఇదే అంశాన్ని చంద్రబాబు, పవన్ చర్చించుకున్నారంట. తన కుమారుడితో కలిసి పని చేయాలని.. చంద్రబాబు పవన్ను కోరారని, పేర్ని నాని దగ్గరుండి వారి సంభాషణ విన్నట్లు చెప్పుకొచ్చారు. . కొడుకుని బందరు ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయిన ఆ మాజీ మంత్రికి, కేంద్ర నిఘా వర్గాలద్వారా ఈ విషయాలు తెలిశాయంట.
లోకేష్ సీఎం పట్టాభిషేకానికి కూడా ఉగాదినాడు ముహూర్తం ఖరారు అయిందంటూ మరో ప్రచారం గత వారం రోజులుగా సోషల్ మీడియా సాగుతోంది. అంతేకాదు లోకేష్ సీఎం అవ్వడానికే చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకికి వెళ్లే ఆలోచన చేశారని, సోషల్ మీడియా వేదికగా వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి లోకేష్ సీఎం అనే అంశం పై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారసుడిగా… లోకేష్ కి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆ మధ్య కొంతమంది టీడీపీ నేతలు బహిరంగంగానే పేర్కొన్నారు. అంతేకాదు లోకేష్ కి ముందుగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ ను ఆమధ్య తీసుకొచ్చారు కొంతమంది టీడీపీ నేతలు..
తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు రావడంలో లోకేష్ పాత్ర అత్యంత కీలకమని టీడీపీ నేతలు మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే కొద్ది రోజుల తర్వాత లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చ ఆగిపోయింది.. అయితే అనూహ్యంగా గత వారం పది రోజులుగా, ఉగాదినాడు సీఎంగా లోకేష్ ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం ఊపందుకుంది..ఆ క్రమంలో అది నిజమేనన్నట్లు, పేర్ని నాని ఏకంగా తన వద్ద కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందని, ఉగాదికి లోకేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించారు… పేర్ని నాని వ్యాఖ్యలు కూటమి లో చిచ్చు పెట్టడానికే అని టీడీపీ నేతలు దాన్ని తిప్పి కొట్టారు.. లోకేష్ సీఎం అని ప్రచారం చేయడం ద్వారా.. జనసేన నాయకులను కార్యకర్తలను రెచ్చి గొట్టి రాజకీయ లబ్ధిపొందడానికి వైసీసీ కుట్రలు చేస్తుందని అంటున్నారు కూటమి నాయకులు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయని, దానికి ఉగాది పర్వదినమే ముహూర్తమని జరుగుతున్న ప్రచారంపై ఆసక్తి కర చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి క్యాబినెట్ విస్తరణ అంశం గత కొద్దిరోజులుగా సాగుతూనే ఉంది… కోటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికి … కొత్తవారికి చోటు కల్పిస్తారని చర్చ సాగింది… జనసేన నుండి ఎమ్మెల్సీ నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది.. వాటితోపాటు మంత్రి పదవి పొందిన ఆరేడు నెలల్లోనే వ్యతిరేకతను కూడబెట్టుకున్న వాసంశెట్టి సుభాష్ను కూడా తొలగిస్తారని ప్రచారం ఆ మధ్య సాగింది.. అది జరిగి దాదాపు ఏడాది గడిచిపోయినా.. క్యాబినెట్ లో మార్పులు చేర్పులు జరగలేదు..
అయితే గత వారం, పది రోజుల నుంచి .. క్యాబినెట్ విస్తరణకు ఉగాదినాడు ముహూర్తం ఖరారు అయిందని సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. అంతేకాదు క్యాబినెట్లోకి ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు బయటికి వెళ్ళబోతున్నారని అనే లిస్టు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెల్లూరు నుండి ప్రశాంతి రెడ్డి, విశాఖ నుండి పల్లా శ్రీనివాస్, అనకాపల్లి నుండి కొనతాల రామకృష్ణ, వెస్ట్ గోదావరి నుండి మద్దిపాటి వెంకటరాజు, ఇచ్చాపురం నుండి బెందాళం అశోక్ లు కేబెనెట్ లోకి వస్తారని ప్రచారం సాగిస్తున్నారు. జనసేన నుండి కొణతాల లేదా నాగబాబు పేర్లు ఉండే అవకాశం ఉందనే టాక్ నడుస్తుంది. అంతేకాదు పల్లా శ్రీనివాసరావు స్థానంలో బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర కు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్ కూడా వినపడుతోంది.
అయితే సాధారణంగా క్యాబినెట్ విస్తరణకు .. రెండు సంవత్సరాలు లేదా రెండున్నర సంవత్సరాలు కాలం ప్రామాణికంగా తీసుకుంటారు…. ఆ లెక్కన చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి …మార్చ్ నాటికి 20నెలలే.. అంటే కనీసం రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు… దీంతో ఇంత త్వరగా క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదంటున్నారు. ఒకవేళ క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరిగితే… అది ఈ ఏడాది దసరాకు మాత్రమే ఉంటాయంటున్నారు. దసరా నాటికి ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాల పదవీకాలం గడుస్తుంది కాబట్టి… అప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే టాక్ కూటమి లో సాగుతుందట. ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉగాది స్పెషల్ డే గా మారిపోయింది..
Also Read: వెల్కమ్ నెట్ఫ్లిక్స్.. హైదరాబాద్లో అతిపెద్ద ఐలైన్ స్టూడియో షురూ!
Story by: Apparao, Big Tv