US-Iran: పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలలేదు. ఇరు దేశాలు ఒక అంగీకారానికి రాలేదు. హైడ్రామా, హైటెన్షన్ వాతావరణంలో 21 గంటల పాటు జరిగిన చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాలు ప్రకటించాయి. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టైంది.
ఫస్ట్ ఈ చర్చల్లో ఏం జరిగింది.. ఎవరి వర్షన్ ఏంటో చూద్దాం. ముందుగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెప్పింది చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. తాము 21 గంటల పాటు చర్చలు జరిపాం.. కానీ ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయాం.. డీల్ కుదిరేందుకు వీలుగా అనేక కండిషన్స్ పెట్టాం.. కానీ ఇరాన్ వాటిని అంగీకరించలేదు.. డీల్ కుదుర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాం.. కానీ ఎలాంటి పురోగతి సాధించలేకపోయాం.. ఇది అమెరికా కంటే ఎక్కువ ఇరాన్కే నష్టం.. ఇది అమెరికా వెర్షన్. నిజానికి ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి.. డెవలప్ చేయడానికి ప్రయత్నించకుండా ఉండాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ ఇరాన్ దీనికి అంగీకరించలేదని చెబుతోంది అమెరికా.
ఇక ఇరాన్ విషయానికి వస్తే కుండబద్ధలు కొట్టినట్టు చెబుతోంది. అసలు అమెరికా చేసినవన్నీ అర్థం లేని డిమాండ్లు అని చెబుతోంది ఇరాన్. ఈ డీల్ కుదరకపోవడానికి అమెరికానే కారణమని తేల్చి చెప్పింది ఇరాన్. యుద్ధంతో సాధించలేని వాటిని ఈ డీల్లో కండిషన్స్గా పెట్టి తమ ముందు ఉంచారని చెబుతోంది ఇరాన్. ఈ డీల్ కుదుర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశామని.. కానీ అమెరికా తీరుతో విసిగిపోయానంటోంది ఇరాన్. అంతేకాదు.. ఉట్టి చేతులతో జేడీ వాన్స్ తిరిగి వెళ్లిపోయారంటూ సెటైర్లు కూడా వేసింది. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినా రెండు విషయాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని.. అదే ఈ డీల్ కుదరకపోవడానికి కారణమని తెలిపింది ఇరాన్.
సో.. ఎవ్వరూ తగ్గడం లేదు. ఎవ్వరూ వెనకడుగు వేయడం లేదు. ఫలితం.. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయక తప్పని పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం క్రిస్టల్ క్లియర్. ఈ చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయడం.. దానికి ఇరాన్ ససేమీరా అనడం.
నిజానికి ఈ యుద్ధం ప్రారంభమవడానికి కారణం ప్రజలను ఇరాన్ ప్రభుత్వం అణచివేయడమో.. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పవడమో కానే కాదు. ఇది అమెరికా పైపైకి చేస్తున్న ప్రచారం మాత్రమే. ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే. ఇది ఓపెన్ సీక్రెట్. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసింది కూడా అందుకే. తాము ఇరాన్ అణ్వాయుధాలు చేయకుండా అడ్డుకున్నామని అమెరికా ప్రకటిస్తున్నా.. అది పూర్తిగా నిజం కాదు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధాల తయారీ సామర్థ్యం ఉందని తెలుస్తోంది. అందుకే ఈ డీల్లో దానిని ప్రధాన అంశంగా పెట్టుకుంది అమెరికా. కానీ తమ అవసరాల కోసం న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటే తప్పేంటనేది ఇరాన్ వెర్షన్. ఇలా ఎవరి వాదనలు వారివే.. ఎవరి డిమాండ్లు వారివే.
మొత్తానికైతే చర్చలు విఫలమయ్యాయి. ఖాళీ చేతులతో అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రతినిధులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మరి నెక్ట్స్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. నిజానికి ఈ రెండు దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకే చెప్పాయి. ఇప్పుడది బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి ఈ చర్చలు విఫలం కావాలి అనే తీరుగానే అమెరికా, ఇరాన్ ప్రవర్తించాయని చెప్పాలి. అమెరికా తరపున ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పాకిస్థాన్కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఫ్లైట్ ఎక్కేముందే ఇరాన్ను బెదిరించారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్ చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు ఆయన. మరోవైపు చర్చల్లో పాల్గొనేందుకు 71 మంది ఇరాన్ బృందం అమెరికాకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను నమ్మే పరిస్థితుల్లో తాము లేమన్నారు. ఇలా రెండు వర్గాలు అనుమానంతోనే పాకిస్థాన్లో అడుగులు పెట్టాయి. ఆ అనుమానాలే బలపడి చర్చలే విఫలం అయ్యాయి.
అంతేకాదు ఓ వైపు చర్చలు జరగడానికి ముందు.. జరుగుతున్న సమయంలో కూడా ఇరు దేశాలు ప్రవర్తించిన తీరును కూడా చూడాలి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే ఆర్మీని అలర్ట్ చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా సైన్యం 50వేలు దాటింది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్ లో విధ్వంసం సృష్టిస్తామని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2వేల మంది పారా ట్రూపర్లను ఇప్పటికే రంగంలోకి దింపిది. అట్లాంటిక్ మీదుగా USS జార్జ్ బుష్ క్యారియర్ గ్రూప్, పసిఫిక్ నుండి USS బాక్సర్ యాంఫిబియస్ గ్రూప్ గల్ఫ్ వైపు ప్రయాణం ప్రారంభించాయి. అమెరికా యుద్ధ విమానాలు, అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పటికే తమ స్థావరాలకు చేరుకున్నాయి.
అంతేకాదు అమెరికా యుద్ధ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న సమయంలోనే జరిగాయి. సో.. చర్చలు విఫలమైతే ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానిని అమెరికా ముందుగానే రెడీ చేసుకుందని అర్థమవుతోంది. మొత్తానికి అమెరికా బెదిరింపు ధోరణిలోనే ముందుకు వెళుతున్నట్టు అర్థమవుతోంది. అటు ఇరాన్ కూడా ఇలాంటి ప్రకటనలే చేసింది. చర్చల పేరుతో మోసం చేస్తే దారుణ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని ప్రకటించింది ఇరాన్. ఇరు దేశాల తీరు చూస్తుంటే ఇప్పుడు మరోసారి యుద్ధ భయాలు పెరిగాయి. అంతా సద్ధుమణిగింది.. ఇకపై ఎలాంటి సమస్య ఉండదనుకున్న ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా కలవరం రేపింది ఇరు దేశాలు చేసిన ప్రకటన. మరి ఈ నిర్ణయం ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుందనే టెన్షన్ మొదలైంది.
చర్చలు విఫలమైన తర్వాత కాదు.. చర్చలు ప్రారంభానికి ముందు నుంచే గల్ఫ్లో పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే అమెరికన్ ఆర్మీ మోహరింపులు పెంచుతుండగా.. హర్మూజ్ జలసంధిలో మరోసారి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి చమురు సంక్షోభం రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి హర్మూజ్ జలసంధిని పాక్షికంగా తెరుచుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఇదే సమయంలో అమెరికా ఓ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. హర్మూజ్లో ఇరాన్ ఏర్పాటు చేసిన సీ మైన్స్ను తొలగించే పనిలో అమెరికన్ నేవీ బిజీగా ఉందని సెంటర్ కామ్ ప్రకటన చేసింది. ఒకవేళ అమెరికా సీమైన్స్ను తొలగించినా.. ఇరాన్ దాడులు చేయదనే గ్యారెంటీ లేదు. దీంతో ఏ చమురు రవాణా ట్యాంకర్ అయినా ధైర్యంగా ఇప్పుడు హర్మూజ్ను దాటే సాహసం అయితే చేసే పరిస్థితి లేదు.
అంతేకాదు చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం రద్దు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ దాడుల వల్ల ఎవరికి ఎంత మేర నష్టం అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. కానీ ఈ రెండు దేశాల దాడుల వల్ల ప్రపంచ దేశాలకు ఎక్కువ నష్టం వాటిల్లడం ఖాయంగా ఉంది. ఎందుకంటే ఇరాన్లో నెక్ట్స్ టార్గెట్ అయ్యేది పవర్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలే. ఇదే జరిగితే ఇరాన్ టార్గెట్ చేసేది గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలనే. అదే జరిగితే అమెరికాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ భారత్ సహా అనేక ఆసియా దేశాలకు జరిగే చమురు సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉంది. హర్మూజ్ను మూసివేస్తేనే విలవిలలాడిన దేశాలు.. ఇప్పుడు ఏకంగా చమురు క్షేత్రాలు ధ్వంసమైతే మాత్రం.. పెను ప్రభావం తప్పదనే చెప్పాలి. ఇది మొదట చమురు సంక్షోభానికి ఆ తర్వాత ఆర్థిక సంక్షోభానికి దారి తీయక తప్పదు.
అంతేకాదు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు ఇప్పుడు పూర్తిగా ఇరాన్ టార్గెట్ రేంజ్లోకి వస్తాయి. అంతేకాదు లెబనాన్, సిరియాలకు ఈ యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. అంతేకాదు ఇరాన్ అణ్వాయుధాల తయారీని మరింత వేగవంతం చేయవచ్చు. ఇప్పటి వరకు ప్రజా కార్యక్రమాల కోసమే అణు తయారీపై ఫోకస్ చేశామని చెబుతున్న ఇరాన్.. ఇకపై నిజంగానే అణుబాంబును తయారు చేసే అవకాశం లేకపోలేదు.
కానీ ఇరాన్ తీరును చూస్తుంటే ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. చర్చలు, ఒప్పందాల విషయంలో ఇరాన్ ఎలాంటి తొందరపాటును చూపించడం లేదు. దీనికి కారణం ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉండటం అని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయినా.. అది పోరాడిన తీరుతో అమెరికా చర్చల పేరుతో కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఇరాన్లో మరింత పెరిగింది. తాము ఎంత నష్టాన్నైనా ఎదుర్కోంటాం.. కానీ మీకు మాత్రం లొంగిపోం అనే మొండితనం ఇరాన్లో స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం ప్రపంచ దేశాలకు చమురు, నాచురల్ గ్యాస్ మాత్రమే కాదు.. ఫర్టిలైజర్స్ సప్లై జరిగేది ఈ జలసంధి నుంచే. ఇది ఇరాన్ గుప్పిట్లో ఉండటం.
నిజానికి ఇరాన్ ధైర్యం హర్మూజ్ జలసంధి. ఈ జలసంధిని మేం స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు ప్రకటించారు. భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నారు.. యుద్ధ నౌకలను పంపిస్తున్నారు. అయినా అది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఇరాన్ చీప్ డ్రోన్స్, సీమైన్స్, అక్కడి భౌగోలిక పరిస్థితులు. ఇరాన్ వైపు ఉన్న భూభాగంలో మిసైల్స్ను మోహరించింది ఇరాన్. ఇప్పుడు డ్రోన్ బోట్స్ను కూడా బరిలోకి దింపింది. ఒకవేళ ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలనుకున్నా.. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. అందుకే నాటో దేశాలను అడుక్కునే పరిస్థితికి వచ్చాడు ట్రంప్. అయినా డోంట్ కేర్ అంటున్నాయి దేశాలు. దీంతో తన ఆర్మీని, దాడులను బూచీగా చూపి ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలని చూశారు. బట్ తగ్గేదేలే అంటోంది ఇరాన్.
ఇరాన్ ఇప్పటి వరకు 19 నౌకలపై దాడులు చేసింది. ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకల ఎస్కార్ట్తో ఆయిల్ ట్యాంకర్లు కదిలినా.. ఎప్పుడు ఎటు వైపు నుంచి దాడులు జరుగుతాయనేది అర్థం కాని పరిస్థితి. అందుకే ఎక్కడి ట్యాంకర్లు.. అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. హర్మూజ్ తమ గుప్పిట్లో ఉన్నంత కాలం.. అమెరికా పప్పులు ఉడకవని ఇరాన్కు తెలుసు. అందుకే చాలా కాన్ఫిడెంట్గా దేనికైనా రెడీ అంటోంది.
ఎప్పుడైతే ఇరాన్ అధినాయకత్వం అంతా మరణించిన తర్వాత కూడా ఇరాన్ అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించిందో అప్పుడే అమెరికా వ్యూహం దెబ్బకొట్టింది. ఖర్చు తడిసి మోపడైంది. సొంత దేశంలో విమర్శలు మొదలయ్యాయి. బిలియన్ డాలర్ల నిధులు ఆవిరవుతున్నాయి. ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు యుద్ధం చేసినా.. మళ్లీ ఇరాన్తో చర్చలు జరపక తప్పని పరిస్థితి. ఈలోపు అమెరికా పరువు పోతుంది.. ఇరాన్ మరింత నష్టపోతుంది. కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం సంక్షోభం రాక తప్పని పరిస్థితి.
Also Read: మీ గొంతు రికార్డింగ్లో ఎందుకు వరస్ట్గా వినిపిస్తుంది? షాకింగ్ రీజన్!
Story by: Anup, Big Tv