BJP Protest: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అటు సభలో, ఇటు అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 22ఏ భూముల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఇతర ఎన్నికల హామీల అమలును డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. తొలుత గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించి నిరసనకు దిగారు. భూభారతిలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు. 22ఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు తోపులాట జరిగింది. చివరకు ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ప్లకార్డులను పోలీసులు లాగేసుకున్నారు. పోలీసులు తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు 22ఏ భూముల అంశాన్ని లేవనెత్తారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ సభ వెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సీట్లు వదిలి అసెంబ్లీలో స్పీకర్ ఎదుట కింద కూర్చుని నినాదాలు చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో భూములు, ఆస్తులను చేర్చిన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ధరణి, భూభారతి అంశాలపైనా సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మొత్తం 25 అంశాలపై చర్చించాలని బీజేపీ నేతలు పట్టుపట్టారు. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా.. 22ఏ భూముల అంశం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సమస్యలపై బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మద్దతు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 15 నిమిషాల వాయిదా అనంతరం ప్రభుత్వం 22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయితే బీజేపీ సభ్యులు న్యాయ విచారణ డిమాండ్పై పట్టుబట్టడంతో సభలో గందరగోళం కొనసాగింది.
Also read: భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా
ఇదిలా ఉండగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. కాగా ఈ ముట్టడికి బీజేవైఎం నేతలు, నాయకులు, కార్యకర్తలు విడుతల వారీగా తరలివచ్చారు. దీంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు బీజేపీ నేతలు దూసుకువచ్చారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఆపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక నేతకు చేయి విరగ్గా.. మరో మహిళా నేత కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. బీజేపీ నేత ఒకరు పోలీసుల వాహనం ఎక్కాలని ప్రయత్నించడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ నిరసనలతో అసెంబ్లీ పరిసరాలు అట్టుడికాయి. ఈ పరిణామాలతో ఒకవైపు అసెంబ్లీ లోపల 22ఏ భూములపై బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన, మరోవైపు అసెంబ్లీ బయట ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ నిరసనతో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభా గౌడ్ కాలు విరగడంతో ఆమెను నాంపల్లి కేర్ హాస్పిటల్ కు తరలించారు. కాగా ఆమెను బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ పరామర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు, నాయకులు, కార్యకర్తల అరెస్టుపై కేంద్ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పాలమూరు ఎంపీ డీకే అరుణ, బీజేపీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఛోటా హిట్లర్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తూ, నిరంకుశ, నిర్బంధ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు అగాధంలో పడిందని, ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేయాలని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గపు చర్య అని తీవ్రంగా ఖండించారు.
Also read: కేసీఆర్పై బండి సంజయ్ సెటైర్లు.. ఎర్రవల్లి ఫామ్హౌస్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టండి!