Vijay Sai Reddy: ఆంధ్రా రాజకీయాల్లో.. విజయసాయి రెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పుడు.. వైసీపీ వర్సెస్ విజయసాయి అన్నట్లుగా మారిపోయాయి పరిస్థితులు. చివరికి జగన్ కూడా ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. వైసీపీ కూడా ఓ సీసీ ఫుటేజీ రిలీజ్ చేసి.. రాజకీయంగా కొంత వేడి పుట్టించే ప్రయత్నం చేసింది. కానీ.. లేటెస్ట్గా విజయసాయి రియాక్ట్ అయిన తీరు చూశాక.. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ముఖ్యంగా.. వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. ఇప్పుడు.. జగన్ గుట్టును బయటపెట్టబోయేది.. విజయసాయిరెడ్డేనా? అనే అనుమానం కలుగుతోంది. విజయసాయి నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? జగన్ కోటరీ తనని కెలికితే.. జగన్కే నష్టమని ఎందుకంటున్నారు?
జగన్ గుట్టు.. విజయసాయి జేబులో ఉందా?
తనని రెచ్చగొడితే జగన్కే నష్టమని ఎందుకంటున్నారు?
విజయసాయి ట్వీట్ వైసీపీలో భయం పుట్టిస్తోందా?
విజయసాయిరెడ్డి, టీడీపీ నేతల మీటింగ్ అంటూ.. తనపై వైసీపీ, జగన్ కోటరీ చేస్తున్న ప్రచారంపై.. విజయసాయి రెడ్డి రియాక్షన్ చూశాక.. కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయ్. లిక్కర్ స్కామ్పై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు విజయసాయి, టీడీపీ నేత రహస్య సమావేశమని.. వైసీపీ ఓ సీసీ ఫుటేజీ రిలీజ్ చేసింది. దీనిపై.. విజయసాయి రియాక్ట్ అయ్యారు. తాను మౌనంగా ఉండటం వైసీపీలోని కోటరీకి నచ్చట్లేదని.. తన రియాక్షన్ వల్ల జగన్కి నష్టం కలగాలని నమ్ముతున్నవారే.. తనని రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ట్వీట్ చేశారు.
కోటరీలోని వారే తనకు వెన్నుపోటు పొడిచారన్న విజయసాయి
రాజకీయ అనుభవం లేని కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండొచ్చేమో గానీ.. జగన్కి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. జగన్ కోటరీలోని వారే తనకు వెన్నుపోటు పొడిచారని.. 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేసిన తనని.. కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారని.. విజయసాయి అన్నారు.
అన్ని తెలిసినా మౌనంగానే ఉన్నానని పరోక్షంంగా సందేశం
ఇక.. ఎవరో కోటరీ చేసిన నేరాలను.. తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడని.. అలా చేయకుండే చెడ్డవాడు, వెన్నుపోటుదారుడు, టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా? అని విజయసాయి ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతో.. జగన్ గుట్టు అంతా తనకి తెలిసినా.. మౌనంగానే ఉంటున్నానని పరోక్షంగా చెప్పేశారు విజయసాయి. తాను నోరు విప్పితే.. నష్టపోయేది జగనేనని కూడా చెప్పారంటే.. జగన్కు సంబంధించిన కీలక విషయాలు, వ్యవహారాలన్నీ తనకు తెలుసనే విషయం చెప్పకనే చెప్పేశారనే చర్చ జరుగుతోంది.
తనను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలన్న విజయసాయి
మరోవైపు.. లిక్కర్ స్కామ్ జరగలేదని జగన్ అంటుంటే.. ఆ స్కాం రహస్యాలు మాట్లాడేందుకు.. తెలుగుదేశం నేతల్ని కలిశానని జగన్ కోటరీ అనడమేంటని రివర్స్ క్వశ్చన్ వేశారు. అసలు.. స్కామే లేనప్పుడు.. తానేం చర్చిస్తానని అడిగారు. లిక్కర్ స్కామ్ గురించి సిట్ విచారణలో.. ఏ1 గురించి చెప్పానే తప్ప.. ఎవ్వరి పేరు ప్రస్తావించలేదని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా.. తనని రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని.. అలా చేస్తే జగన్కే నష్టమనే విషయాన్ని వైసీపీ కోటరీకి అర్థమయ్యేలా చాలా సూటిగా చెప్పారు విజయసాయి.
లిక్కర్, పోర్టు స్కామ్ ల కీలక సమాచారం ఉందా?
అయితే.. ఇప్పుడు విజయసాయి రెడ్డి లేవనెత్తిన అంశాలు.. వైసీపీలో తీవ్ర చర్చకు దారితీశాయ్. జగన్ కోటరీతో పాటు లిక్కర్, పోర్టు స్కామ్లకు సంబంధించి.. ఆయన దగ్గర కీలక సమాచారం ఉందనే విషయం అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో భూదోపిడీ, టీడీఆర్ బాండ్స్, మైనింగ్, ఇసుక, సహజ వనరుల దోపిడీ, లిక్కర్ స్కామ్ చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే.. లిక్కర్ స్కామ్లో ఏపీలో సంచలనంగా మారింది. ఇందులో విజయసాయి కూడా కీలక విషయాలు వెల్లడించారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. వాటిలో.. కొన్ని కేసుల దర్యాప్తు కీలక దశలో ఉంది.
విజయసాయిరెడ్డి ఏం బయటపెడతారోనని వైసీపీలో టెన్షన్
వాటిలో.. విజయసాయిరెడ్డి కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గత ఐదేళ్లలో జగన్ కోటరీ ఎలా వ్యవహరించిందనేది విజయసాయిరెడ్డికి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఆయన అప్రూవర్గా మారితే.. వైసీపీకి ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. అందుకోసమే.. తనని రెచ్చగొడితే జగన్కే నష్టమని నొక్కి మరీ చెప్పారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. ఆయన గనక ఇప్పుడు జగన్పై విమర్శలు చేసినా, ఆరోపణలు సంధించినా.. అది.. వైసీపీకే నష్టమనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. విజయసాయి చెప్పే ప్రతి అంశం కీలకమవుతుంది. అధికారపక్షానికి ఆయుధంగా మారుతుంది. అందువల్ల.. విజయసాయిరెడ్డి ఏం బయటపెడతారోననే టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.
-Story By Anup Vamshi, Big Tv Live