Vijayasai Reddy: మళ్లీ జగన్ కోటరీని వైసీపీ నుంచి బయటకొచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా టార్గెట్ చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత .. చుట్టూ ఉన్నవాళ్ల మాటలు జగన్ వినడం వల్లే తాను పార్టీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా తాజాగా అమ్ముడుపోయి కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండని హితవు పలుకుతూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు హాట్ టాపిక్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళుతున్నారు. నాలుగురు రాజ్యసభ ఎంపీలు, కొందరు ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి, పార్టీని వీడారు. ముఖ్యంగా సీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా తన ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయ ఉండాలని.. ప్రలోభాలకు లొంగకూడదన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ఈక్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కాకినాడ పోర్టు అక్రమాల కేసు విచారణలో భాగంగా విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడిన విజయసాయి జగన్లో మార్పు వచ్చిందన్నారు. చుట్టూ ఉన్నవాళ్ల మాటలు జగన్ వినడం వల్లే తాను పార్టీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగి పోయిందన్నారు.
వైసీపీలో ఎదురవుతున్న అవమానాలు భరించలేకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పానన్నారు. జగన్కు భవిష్యత్ ఉండాలంటే కోటరీ నుంచి బయటపడాలని విజయసాయిరెడ్డి సూచించారు. జగన్కు ఎవరినైనా పరిచయం చేయాలనుకుంటే, ముందుగా కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అరోపించారు. ఆ క్రమంలో రాజకీయాలకు విరామం ఇచ్చి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. కాకినాడ ఫోర్ట్ వ్యవహారంలో కేవీ రావు తనపై దురుద్దేశ్యంతోనే కంప్లైంట్ ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారన్నారు.
అప్పట్లో వైసీపీని, జగన్ కోటరీని టార్గెట్ చేస్తూ విజయసాయి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ డిబేట్గా మారాయి. తాజాగా సాయిరెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండని హితవు పలికారు. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించాలని పేర్కొన్నారు. వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. దానికి కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవటమే కదా అని ట్వీట్ చేశారు. గతంలోనూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ కోటరీ ఉందని.. విజయసాయిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి చేసిన సదరు ట్వీట్ వైసీపీలో కలకలం రేపుతోంది.
అది కూడా దేశ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని ఇష్యూతో ఇంటర్ లింక్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోందంట. భవిష్యత్తులో చోటు చేసుకోబోయే పరిణామాలు సాయిరెడ్డి ఈ ట్వీట్ ద్వారా వెల్లడించినట్లు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారంట. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంకు సంబంధించి అన్ని విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి ఏదో బలమైన కారణంతోనే ఈ ట్వీట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Story by: Apparao, Big Tv