Vinay Bhaskar: ప్రతిపక్ష నాయకులు అంటే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. మరోవైపు తన అనుచరుల బాగోగులు చూసుకుంటూ వచ్చే ఎన్నికలవరకైనా క్యాడర్ ను కాపాడుకోవాలి. ముఖ్యంగా అధికారపక్షంలో వెలగబెట్టి, ఓటమిపాలై ప్రతిపక్షంలో మాజీలుగా మిగిలిపోయిన లీడర్లు తమ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తారు. నిజంగా అంత చిత్తశుద్ది లేకపోయినా కనీసం నటిస్తుంటారు. కానీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ మాత్రం ఓటమి తర్వాత అసలు కనిపించడమే మానేశారంట…. దాంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే తీరుపై స్థానికులు, సొంత పార్టీ శ్రేణులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఆ సార్ లెక్కలేంటి?
అధికారంలో ఉన్న నేతల కంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులే నిత్యం ప్రజల్లో ఉంటూ యాక్టివ్ గా ఉండటాన్ని చూస్తుంటాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకోవడానికి తాపత్రయపడుతుంటారు. లేదంటే కనీసం తన క్యాడర్ ను పెంచుకుంటూ బలమైన నాయకుని చెలామణి అవ్వాలని చూస్తుంటారు. అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ మాత్రం .. నా రూటే సెపరేటు.. అన్నట్లు వ్యవహరిస్తున్నారంట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై సూచనలు సలహాలు ఇస్తూ, అధికార పార్టీ ఎమ్మెల్యేను పరుగులు పెట్టించాల్సింది పోయి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ, ఇంటికే పరిమితమవుతున్నారంట.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ చీఫ్ విప్ వినయ్భాస్కర్ నియోజకవర్గ ప్రజలకు కొద్దికొద్దిగా దూరం అవుతున్నారని చర్చ జరుగుతోంది. ఓటమి తర్వాత కాంగ్రెస్ హామీలపై అడపాదడపా ప్రశ్నించిన ఆయన గత ఆరు నెలల నుండి పూర్తిగా సైలెంట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండడంతో, క్యాడర్ లో జోష్ పెంచుతూ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేయాల్సిన టైంలో ఇంటికే పరిమితం అవడం ఏంటని వినయ్ భాస్కర్ సొంత అనుచరులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రతిపక్ష పాత్ర చురుగ్గా పోషించినప్పుడే వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు దొరుకుతుందని, లేదంటే శాశ్వతంగా ఇంటికే పరిమితం చేస్తారని గులాబీ పార్టీలోని సీనియర్లు హెచ్చరిస్తున్నా .. ఆయన లైట్ తీసుకుంటున్నారంట
దాస్యం వినయ్ భాస్కర్ ఆషామాషీ నాయకులేం కాదు. 2004 ఎన్నికల్లో హన్మకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2005లో ఉద్యమ స్ఫూర్తితో టిఆర్ఎస్లో చేరి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2005లో వరంగల్ కార్పొరేటర్గా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ సమయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించి, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్ను తన అడ్డాగా మార్చుకున్నారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు.
అంతకాలం ఎమ్మెల్యేగా ఉండి, పదేళ్లు అధికార పక్షంలో కొనసాగినప్పటికీ వినయ్భాస్కర్ ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదన్న విమర్శలున్నాయి. ఆయన హయాంలో ప్రధాన సమస్యల పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోవడంతో, 2023 ఎన్నికల్లో ఓట్లరు దాస్యంకు గట్టిగానే బుద్ది చెప్పారు. అయితే ఆయనపై గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అసంపూర్తి హామీలన్నీ యుద్ధ ప్రతిపాదన పూర్తి చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. దాంతో జనానికి ముఖం చూపించలేక వినయ్భాస్కర్ సైలెంట్ అయ్యారంట. గత పదేళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ముంపు సమస్య, అంతర్గత డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కాళోజి కళాక్షేత్రంలాంటి వాటికి రెండేళ్లలో పరిష్కారం దొరకడంతో ప్రజల్లోకి వెళితే నిలదీస్తారనే ఆందోళనలో వినయ్ భాస్కర్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారట.
ప్రజా సమస్యల సాధన కోసమో, పెండింగ్ పనుల సాకుతో ప్రజల్లోకి వెళ్దామంటే.. అవన్నీ పరిష్కారం అవుతుండటంతో వినయ్భాస్కర్కి అవకాశం లేకుండా పోయిందని ఆయన అనుచరులు మధనపడిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి.. కాలుకు బలపం కట్టుకుని గల్లీలు తిరుగుతుంటే, మాజీ ఎమ్మెల్యేకి ఇక అవకాశం ఎలా వస్తుందని మరికొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారట. వచ్చే మే నెలతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగుస్తోంది. ఆ నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా వినయ్ భాస్కర్ ప్రజల్లోకి రాకుంటే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం అసాధ్యమనే భావన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోందట. అందుకే కార్పొరేటర్ టికెట్ల ఆశిస్తున్న కొందరు గులాబీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులతో టచ్ లోకి వెళ్తున్నారట.
ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ గొంతు వినిపించకపోతే, ఎమ్మెల్యే ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితులు మారుతాయని… ఇప్పటికైనా వినయ్భాస్కర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని సీనియర్లు సలహా ఇస్తున్నారట. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయానికి వినయ్ భాస్కర్ తన సైలెన్స్ ను బ్రేక్ చేస్తారని, ఇప్పటి మౌనం తమ వ్యూహంలో భాగమేనని ఆయన అనుచరులు వెనకేసుకొస్తున్నారట. పదేళ్లలో హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా… ఇప్పుడు అన్నీ నెరవేరుస్తుంటే ఏ మొహం పెట్టుకొని వినయ్ భాస్కర్ ప్రజల మధ్యకు ఎలా వస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఆయన వెంట ఇప్పుడు తన సొంత క్యాడర్ కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదని, నాయకులు ప్రజల మధ్య ఉంటేనే సమస్యల పరిష్కారం అవుతాయని… ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విషయంలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు దూరంగా ఉంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని సలహా ఇస్తున్నారట. మరి ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మౌనం.. వ్యూహమా?…. లేక ప్రజల్లోకి రాలేని దౌర్భాగ్యమా? అన్నది కాలమే తేల్చాలి.
Also Read: దురందర్ దెబ్బ.. పాక్ గడ్డపై ఉగ్రవాదుల అబ్బా.. భారత్ ‘షాడో ఏజెంట్స్’ సృష్టించిన వణుకు ఇదే!
Story by: Apparao, Big Tv