Vizag Tragedy: విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం ఏపీలో తీవ్ర విషాదం నింపింది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుల్లో మరొకరు చనిపోయారు. దాంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ నెల 8న సాయంత్రం సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం మీదపడి కార్మికులపై పడటంతో 8 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా 3 రోజులుగా విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు పైడిరాజు మృతి చెందారు. ప్రమాదం తర్వాత పైడిరాజును హాస్పిటల్కు తరలిస్తుండగా ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయ్. తాను చనిపోవడం ఖాయమనే నిర్ధారణకు వచ్చాడో, మరేదైనా కారణమో తెలియదు గానీ పెద్ద కొడుకుకు కుటుంబ బాధ్యతలను అప్పజెప్పాడు. అమ్మని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని కొడుకుకి చెప్పిన మాటలు అందరినీ కళ్లు చెమర్చేలా చేశాయ్.
స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను, చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం అన్నారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ తీరుపైనా జగన్ నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదని, లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడంతోనే ఇంత ఘోరం జరిగిందని చెప్పారు. ఉద్యోగుల సంఖ్య 28 వేల నుంచి 16 వేలకు తగ్గించడంపై మండిపడ్డారు. మంత్రి లోకేష్ మాటలు చూసి ఆశ్చర్యం వేసిందన్న జగన్.. కూటమి సర్కార్ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఎక్స్గ్రేషియో అందిస్తామని ప్రకటించారు.
Also Read; Sangareddy Murder: కూరగాయల సంచితో కిల్లర్ భర్త బండారం బట్టబయలు.. బొల్లారం హత్యకేసులో సంచలనం!
జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర తమదని చెప్పారు. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి రాజధాని పేరుతో భూములు కొట్టేయాలని జగన్ ప్రయత్నించారని విమర్శించారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు గానీ.. స్టీల్ ప్లాంటే లేకుండా చేయాలని కుట్ర పన్నిన ఆయన.. అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇక, స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు పైడిరాజు కుటుంబాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ పరామర్శించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన పైడిరాజు.. జనసేన క్రియాశీలక కార్యకర్తగా ఉండేవారు. ఆయన చనిపోవడంతో.. వారి కుటుంబ సభ్యులను జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఆస్పత్రిలో పరామర్శించారు. పైడిరాజు మృతి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం తరఫున, పార్టీ తరపున పైడిరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వంశీకృష్ణ.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున కూటమి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతిచెందిన ఒక్కో రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి అన్నిరకాల ప్రయోజనాలు కలుపుకొని కోటీ 72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగికి 45 లక్షల పరిహారం అందనుంది. అయితే, ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మికుడు పైడిరాజు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Mango Tragedy: నారాయణగూడలో దారుణం.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి..!