Sangareddy Murder: ఎన్ని స్కెచ్లేసినా నో యూజ్ తప్పు చేసినోడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఈ కథలోనూ అదే జరిగింది. మే 30వ తేదీన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మీనాదేవి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యను వదిలించుకోవడానికి భర్తే సుపారీ ఇచ్చి చంపించినట్లు దర్యాప్తులో తేలింది. బీహార్కు చెందిన అనిల్కుమార్, మీనాదేవి దంపతులు ఐడీఏ బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు.
అనిల్ ఐరన్ కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ వాహనాలు అద్దెకు ఇస్తుంటాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. మే 30 సాయంత్రం అనిల్ తన భార్యతో కలిసి మార్కెట్కు వెళ్లాడు. తిరిగొస్తుండగా నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆగిపోయిందని, తాను రిపేర్ చేస్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి మీనాదేవిని పొదల్లోకి లాక్కెళ్లారని అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను అడ్డుకోబోతే తనపై దాడి చేసి, తన కళ్ల ముందే భార్య గొంతుకోసి చంపేశారని నమ్మించే ప్రయత్నం చేశాడు.
Also Read: కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన.. వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది? చిన్నారి ఎక్కడ?
పోలీసులు స్పాట్కు వెళ్లారు. సీన్ అంతా చూశారు. అక్కడే భర్త అనిల్ ప్రవర్తన తేడాగా అనిపించింది. ప్రధానంగా రెండు అంశాలు కేసును మలుపు తిప్పాయి. అనిల్ చేతులు, వీపుపై ఉన్న కత్తిగాట్లు వేరొకరు దాడి చేసినట్టు కాకుండా, సినిమా తరహాలో కావాలనే బ్లేడుతో కోసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. హత్యకు ముందు భార్యాభర్తలిద్దరూ సంచి నిండా కూరగాయలు కొన్నారు. దుండగులు భార్యను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్తుంటే కూరగాయలు కిందపడి చెల్లాచెదురు కావాలి. కానీ, ఆ సంచి మాత్రం ఏమాత్రం పాడవకుండా ఓ మూలన పద్ధతిగా పెట్టి ఉంది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళ.. ఆ సంచిని పక్కన పెట్టి వెళ్లదు కదా అనే లాజిక్ పోలీసులకు స్ట్రైక్ అయ్యింది. ఈ అనుమానాలతో అనిల్ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. బీహార్కు చెందిన రింకు కుమార్కు 2 లక్షల సుపారి ఇచ్చాడు. రింకు కుమార్, రంజన్, నీరజ్లతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారమే ఆమెను బైక్పై బయటకు తెచ్చి, నిందితులతో గొంతు కోయించి హత్య చేయించాడు. భర్త అనిల్తో పాటు సుపారీ గ్యాంగ్కు చెందిన రంజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రింకుకుమార్, నీరజ్ పరారీలో ఉన్నారు. రింకు కుమార్ పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. మిగతావాళ్ల కోసం ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి.