Warangal: హైదరాబాద్ మేయర్ పీఠం తర్వాత రాష్ట్రంలో కీలకమైన స్థానం వరంగల్ మేయర్ స్థానం. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. ఓరుగల్లు జిల్లా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగడంతో మేయర్ పీఠం కోసం ఆ పార్టీ నుండి భారీ పోటీ నెలకొందంట. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇద్దరు నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలు తమ వర్గానికి మేయర్ పీఠం కోసం అంతర్గతంగా పోటీ పడుతున్నారన్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం మే మొదటి వారంతో ముగుస్తోంది. ఈసారి మేయర్ పీఠం జనరల్ కు రిజర్వ్ కావడంతో అందరి చూపు ఆ కూర్చీ పైనే పడిందంట. అధికార పార్టీ నుండి పదుల సంఖ్యలో ఆశవహులు ఉండగా, ఒకరిని మించి మరొకరు మేయర్ కుర్చీపై కర్చీఫ్ వేసుకునేందుకు సిద్ధమవుతున్నారట. హస్తం పార్టీ నుండి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తమ వర్గీయులకు మేయర్ పీఠం కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా…. కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మేయర్ బరిలో ఉండబోతున్నారట.
సిట్టింగ్ ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి తమ వారసులకు, బంధు గణానికి మేయర్ పీఠం కట్టబెట్టాలని చూస్తున్నారట. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ , ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు పృథ్వీరాజ్ మేయర్ బరిలో నిలవబోతున్నారని చర్చ జరుగుతోంది. బీజేపీ నుండి యువ నాయకుడు అభినవ్ భాస్కర్, బీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కుమారుడు విశాల్ సైతం మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తన వర్గం నేతకే మేయర్ పీఠం దక్కేలా తెరవ వెనుక పావులు కదుపుతున్నారట.
అధికారపార్టీలో పదుల సంఖ్యలో మేయర్ పదవి ఆశవహులు ఉండడంతో, ఎన్నికల ఫలితాలను బట్టి అధిష్టానం ముందుకు వెళ్తుందని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. మరోవైపు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్గా జోడు పదవుల్లో ఉన్న వెంకట్రాంరెడ్డి సైతం మేయర్ పీఠం కావాలని పట్టుబడుతున్నారట. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, ఘనపూర్ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న వరంగల్ మేయర్ పీఠం కోసం అధికార పార్టీలోనే భారీగా ఆశవహులు ఉండడం.. ప్రతిపక్ష పార్టీలకు కలిసొస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ నుండి వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నమిండ్ల శ్రీనివాస్ సైతం మేయర్ పదవి కోసం అధిష్టానం వద్ద ప్రయత్నాలు మొదలుపెట్టారట. అంతమంది ఆశావాహులు వర్గాలుగా విడిపోయి మేయర్ పదవిపై కన్నేయడంతో, ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముందస్తుగానే అధిష్టానం కల్పించుకుని ఆశావాహులందరినీ సమన్వయం చేసుకోకపోతే మేయర్ స్థానం కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారట.
వారసుల కోసం కొందరు, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ మరికొందరు, ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇంకొందరు ఇలా ఎవరికి వారిగా తమ ప్రయత్నాలు చేస్తుంటే…పార్టీకి నష్టం తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఆశావాహులందరినీ బుజ్జగించి.. కార్పొరేషన్ ఎన్నికల నాటికి ఎలా ఏకతాటిపైకి తేవడం కాంగ్రెస్ పెద్దలకు పెద్ద సవాలే అంటున్నారు.
Also Read: జగన్ మాస్టర్ ప్లాన్ రివర్స్.. ‘మావిగన్’ పేరు వెనుక అసలు గుట్టు విప్పిన నెటిజన్లు
Story by: Apparao, Big Tv