Amaravati Capital: రాజధాని అమరావతే అని ఆంధ్రులంతా ఫిక్స్ అయ్యారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తిప్పికొట్టి గత ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ కొట్టారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ కూడా రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును ఆమోదించింది. అయినా జగన్ పార్టీ స్టాండ్ మాత్రం మారడం లేదు. వైసీపీలో అదే గందరగోళం కొనసాగుతూ…. బూమరాంగ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు రాజధాని విషయంలో వైసీపీలో ఎందుకంత గందరగోళం? వైసీపీ నేతలు పార్టీ స్టాండ్పై స్పష్టంగా ఎందుకు మాట్లాడలేక పోతున్నారు?
రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. అంటే ఇక భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతిని కదిలించే ప్రసక్తే లేదు. కాదుకూడదని రాజధాని మార్చాలని చూస్తే.. తిరిగి అసెంబ్లీ తీర్మానం, తర్వాత పార్లమెంట్ ఆమోదం వంటి ప్రక్రియ మళ్లీ మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడంటే రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వమే ఉండటంతో అంతా సజావుగా సాగి పోయి ఏపీ వాసులందరూ హ్యాపీ అవుతున్నారు. మరి పొరపాటున రేపు వేరేవరైన రాజధానికి మార్పుకు తిరిగి కుట్రలు పన్నితే.. ఈ చట్టబద్దత ప్రోసెస్ అంత ఈజీ ఏమీ కాదు.
కళ్ల ముందే వాస్తవ పరిస్థితి కనిపిస్తున్నా అమరావతిపై వైసీపీ ఇంకా విషం కక్కే ప్రయత్నం చేస్తూనే ఉంది, సందర్భం వచ్చినప్పుడల్లా …కొత్త అంశాన్ని తెరపైకి తేస్తూ వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధ్యక్షుడు విచిత్రమైన లాజిక్ వినిపించారు. మచిలీపట్నం, విజయవాడు, గుంటూరు నేషనల్ హైవే పరిసరాలను అనుసంధానం చేస్తూ రాజధాని ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న వాదన మెదలుపెట్టారు. ఆ మూడు ప్రాంతాల పేర్లలో అక్షరాలు కలిసి వచ్చేలా ‘మావిగన్’ అని తన రాజధానికి పేరు కూడా పెట్టేసుకున్నారు.
జగన్ నోట మావిగన్ మాట రాగానే అందులో కూడా తన పేరు ఉండేలా మాజీ సీఎం పెద్ద స్కెచ్చే గీశారన్న సెటైర్లు పేలడం మొదలైంది. మరి ముందు నుంచి జగన్కు మావిగన్ ఆలోచన ఉన్నప్పుడు, మూడు రాజధానుల ప్రతిపాదన ఎందు కొచ్చిందో? గతంలో విజయవాడ – గుంటూరు మధ్యలో రాజధాని భవనాలు కడితే సరిపోతుందని ఎందుకన్నారో ఆ ప్రభువుకే తెలియాలని అందరూ పెద్ద ఎత్తున వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు.
మరోవైపు అసలు రాష్ట్రాలకు రాజధాని అన్న ప్రస్తావనే రాజ్యాంగంలో లేదని మాజీ ముఖ్యమంత్రివర్యులు అంటున్నారు. మరి అసలు ఆ పార్టీ వారు అమరావతికి వ్యతిరేకంగా అన్ని వాదనలు ఎందుకు వినిపిస్తున్నారో వారికే తెలియాలి. ఇక ఇప్పుడు అమరావతి రాజధాని చట్టం పార్లమెంటులో ఆమోదం పొందింది. అమరావతే రాజధానని రాజముద్ర పడింది. అయినామే ము అధికారంలోకి వస్తే మార్చలేమా అంటున్నారు. ఇప్పటికీ మూడు రాజధానులు నినాదమే కరెక్ట్ అనే విధంగా నాయకులు మాట్లాడుతుండటంతో.. వైసీపీ శ్రేణులే ఇదేం గోలరా అని జుట్లు పీక్కుంటున్నాయంట.
పార్లమెంట్లో రాజధానికి చట్టబద్దత బిల్లుపై చర్చ సందర్భంగా పాల్గొన్న అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి. కాని వైసీపీ సభ్యులు మాత్రమే అటు లోక్ సభ, ఇటు రాజ్యసభల్లో బిల్లును వ్యతిరేకిస్తున్నామని వాకౌట్ చేశారు. సభలో చర్చలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు…బిల్లుకు మద్దతు ప్రకటించి….కొన్ని సూచనలు చేశాయి. అయితే వైసీపీ మాత్రం తన రూటే సెపరేటు .. అన్నట్లు వ్యవహరించడం జాతీయ పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారి… ఆ పార్టీ అభాసుపాలవుతోంది.
రాష్ట్రానికి రాజధానిగా రాజముద్ర వేయించుకున్న అమరావతి విషయంలో వైసీపీ ఇంకా అదే గందరగోళంలో ఉందా అన్న చర్చ సాగుతోంది. అమరావతి మీద వైసీపీ నేతలు, సీనియర్లు, మాజీ మంత్రులూ తలో మాట మాట్లాడుతుండటంతో ఆ ఇష్యూ మీద వైసీపీకే క్లారిటీ లేకుండా పోయిందంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాల విషయంలో అవినీతి చోటు చేసుకుందని దాని మీదనే మాట్లాడుతున్నామని అన్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో తీర్మానం పెట్టి మండలిలో పెట్టలేదని విమర్శించారు.
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. మద్రాస్ నుంచి కర్నూల్, హైదరాబాద్ , అమరావతి ఇలా ఎన్ని రాజధానులు మారలేదని ధర్మాన అంటే పరిపాలనా వికేంద్రీకరణ అంటూ బొత్స పాత పాటే పాడుతున్నారు . జగన్ ఏమో కొత్తగా ‘మావిగన్’ పల్లవి ఎత్తుకున్నారు. ఇలాంటి తలాతోకా లేని వాదనలతో వైసీపీ ప్రజల్లో మరింత చులకన అవుతూ.. తన గొయ్యి తానే తవ్వుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అమరావతే తన రాజధాని అని అయిదు కోట్ల మంది ఆంధ్రులు ఫిక్స్ అయ్యారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల భావాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తుంది. ఇక ప్రాంతీయ సెంటిమెంట్లను గౌరవించడం తప్పు కాదు కానీ రాజధాని విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదంటున్నారు మేధావులు. వైసీపీ ఇప్పటికైనా రాజధాని విషయంలో సైలెంట్ గా ఉంటే మేలని సూచిస్తున్నారు. లేకపోతే అమరావతికి తాము అనుకూలమే అని ఒక్క మాట స్పష్టంగా చెప్పినా అంతో ఇంతో వారికి ప్లస్ అవుతుందంటున్నారు. అలాకాకుండా ఇంకా అమరావతి మీద అక్కసు వెళ్లగక్కుతూ పోతే. అది బూమరాంగ్ అవ్వడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
Also Read: పటాన్చెరు గడ్డపై పౌరుషాల పోరు.. కాట వర్సెస్ గూడెం.. గెలిచేదెవరు?
Story by: Apparao, Big Tv