YS Family: వైఎస్ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. ఆస్తి కోసమే షర్మిల జగన్కు రాజకీయ విరోధిగా మారారని, వైసీపీ నేతలువిమర్శల దాడి చేస్తుండటంతో… తల్లి వైఎస్ విజయలక్ష్మి రంగంలోకి దిగారు. క్లారిఫికేషన్ రూపంలో కుమారుడు వైఎస్ జగన్కు షాక్ ఇచ్చారు. దివంగత నేత హయాంలో ఆస్తుల పంపకం జరగలేదని, వైఎస్ మరణించేనాటికి ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడివేనని ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. దీనిపై వస్తున్న రాజకీయ విమర్శలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాండ్ పేపర్పై, నోటరీ చేయించి మరీ విజయలక్ష్మి స్పష్టత ఇవ్వడంతో.. తల్లిచెల్లికి అన్యాయం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్లైంది.
తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతా రెడ్డికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అండగా నిలుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వివేకా హత్య కేసిన షర్మిల పదేపదే ప్రస్తావించి జగన్ పార్టీని డిఫెన్స్లో పడేశారు. తాజాగా .. జగన్ లాంటి అన్న ఉంటే ప్రత్యేకంగా మరో శత్రువు అక్కర్లేదు. అన్న అనే పదానికే కళంకం అంటూ జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అంశంపై విశాఖలో షర్మిల సుదీర్ఘంగా మాట్లాడారు. సూటి ప్రశ్నలు సంధించారు. మనస్సాక్షితో సమాధానం చెప్పాలని సోదరుడికి సవాలు విసిరారు.
దీంతో జగన్ మరోసారి ఆత్మరక్షణలో పడాల్సి రావడంతో.. వ్యూహాత్మకంగా వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వైఎస్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరులోకి చంద్రబాబును లాగారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ.. అంటూ షర్మిలను నిందించడమే కాకుండా… ‘30 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న మీకు ఇప్పుడు వాటాలు ఇవ్వడమేంటి!? ఇవ్వాల్సిన అవసరం లేకున్నా… జగన్ తన స్వార్జితం నుంచి కోట్లు పంచి ఇచ్చారు’ అంటూ షర్మిలపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండు రోజులుగా షర్మిలను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ముఖ్యనేతలూ సునీత, షర్మిలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఇక… వైసీపీ సోషల్ మీడియాలో అయితే ఇష్టమొచ్చినట్లు ప్రచారం మొదులపెట్టారు.
షర్మిలకు జగన్ ఇప్పటికే అవసరానికి మించి వాటాలుఇచ్చేశారంటూ వైసీపీ నేతలు వరుసగా చేస్తున్న దాడికి నేరుగా వైఎష్ విజయలక్ష్మి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ‘క్లారిఫికేషన్’ పేరుతో ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. చెల్లెలు, మేనల్లుడు, మేనకోడలికి జగన్ అన్యాయం చేశారని అందులో పేర్కొన్నారు. అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఆ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు షర్మిలను దూషించినట్లే విజయలక్ష్మిపైనా విరుచుకుపడతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, అన్ని ఆస్తులను నలుగురు మనుమలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశమనిదగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదని విజయలక్ష్మి పేర్కొన్నారు. జగన్కి ఇద్దరు కుమార్తెలు, షర్మిలకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఆ నలుగురికి తన ఆస్తులు సమానంగా చెందాలని వైఎస్ ఆదేశించినట్లు ఆయన సతీమణి కుంట బద్దలు కొట్టారు.
కుటుంబ ఆస్తుల పంపకాల్లో ఎన్సీఎల్టీ లో వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తల్లి, వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి విజయమ్మ మీడియాకు లేఖ విడుదల చేయడం గమనార్హం. అందులో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆమె పూర్తి స్పష్టత నిచ్చారు. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని విజయలక్ష్మి స్పష్టం చేశారు. అందుకే జగన్ ఎంవోయూ రాశారని చెప్పారు. నిజానికి షర్మిలకు తక్కువే రాశారన్న ఆమె, సరస్వతి సిమెంట్తో సహా ఎంవోయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని చెప్పారు. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం విషయంలో తన మేనల్లుడు, మేనకోడలికి జగన్ అన్యాయం చేశారన్న వైఎస్ విజయలక్ష్మి, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని తెలిపారు.
నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసని పేర్కొన్నారు. మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయమని విజయలక్ష్మి తేల్చిచెప్పారు. గ్లోబల్స్ ప్రచారం మానుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానని, దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
జగన్, షర్మిల మధ్య కుటుంబంలో సరస్వతి పవర్ ఆస్తుల వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. దీనిపై కొద్ది రోజుల క్రితం విజయలక్ష్మి స్పందించారు. ఈ వివాదంలో షర్మిలకు నేను బినామీగా లేదా ప్రతినిధిగా ఏ మాత్రం వ్యవహరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. జగన్, భారతిలు ఇచ్చిన గిఫ్ట్డీడ్ ద్వారా తనకు సైతం ప్రయోజనం ఉందన్నది కాదనలేని వాస్తవమని తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగా క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్కు కట్టాల్సిన ప్రతిఫలాన్ని చెల్లించి ఆ తర్వాత వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని విజయమ్మ తెలిపారు. అంతేకాకుండా ఈ పత్రాలను ఎవరూ కూడా తిరస్కరించలేరని వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆ ప్రకారమే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ చెన్నై బెంచ్కు విజయలక్ష్మి నివేదించడం గమనార్హం.
మొత్తమ్మీద వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదం మరోసారి రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. షర్మిలకు అన్యాయం చేస్తున్నారని తల్లి విజయలక్ష్మి పేర్కొనడంతో జగన్ డిఫెన్స్లో పడ్డారు. మరి ఇంత కాలం అదే వాదన వినిపిస్తున్న సొంత చెల్లెల్ని వైసీపీ నేతలతో టార్గెట్ చేయిస్తున్న జగన్… మరిప్పుడు తల్లి విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ విషయంలో సడన్ నిర్ణయం వెనుక అసలు గుట్టు ఇదే!
Story by: Apparao, Big Tv