కడప ఎంపీ అవినాష్రెడ్డిని వైఎస్ సునీత వేటాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యపై న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత కడప ఎంపీ అవినాష్పై మరో కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. వివేకా హత్యకేసులో నిందితుడిగా విచారణలు ఎదుర్కొంటూ ఆపసోపాలు పడుతున్న అవినాష్పై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పులివెందులలో మరో కేసు నమైదు కానుంది. వైసీపీ సోషల్ మీడియా సైకో వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాగ్మూలం మేరకు అవినాష్ పీఏ రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐ విచారాణ పరిధిలో ఉంది. ఆ కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలు నిందితులుగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం తనకు అన్న వరుస అయ్యే వైఎస్ జగన్ అండతో అవినాష్రెడ్డి సీబీఐ విచారణలకు డుమ్మా కొట్టి, అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ కేసు విచారణలతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న అవినాశ్ పై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత మరో కేసు పెట్టడానికి సిద్దమయ్యారు.
తండ్రి హత్యకేసులో నిందితులకు శిక్షపడాలని న్యాయపోరాటం చేస్తున్న సునీత.. ఎన్నికల ప్రచారంలో అవినాష్పై పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ ఆక్కాచెల్లెల్లు ఇద్దరూ వివేకా సెంటిమెంట్తో అవినాష్తో పాటు అప్పటి ముఖ్యమంత్రి, తమ అన్న జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు . వివేకా కేసు విచారణ వేగవంతం అవుతున్న ప్రస్తుత తరుణంలో అవినాష్పై సునీత మరో కేసు పెట్టడానికి రెడీ అవ్వడం విశేషం.
ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో కడప ఎంపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు వర్రా రవీంద్రరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సునీత తాజా ఫిర్యాదుతో అవినాశ్ పైన తీసుకునే చర్యల పై ఉత్కంఠ పెరుగుతోంది. పోలీసుల విచారణలో వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి తనకు కంటెంట్ ఇచ్చాడని వర్రా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు
దాంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అవినాశ్ రెడ్డి సూచనల మేరకే పీఏ రాఘవ రెడ్డి ఈ పోస్టులు పెట్టారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారంట. ఆ క్రమంలో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తరువాత ఈ కేసులో అవినాశ్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ పోస్టుల విషయంలో సునీత, షర్మిల హైదరాబాద్ లో ఫిర్యాదు చేయటంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు ఉంటాయంటున్నారు.
Also Read: పరారీలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అరాచకాలు
తాజాగా పులివెందులలో అవినాశ్ పైన ఫిర్యాదు చేయాలని సునీత నిర్ణయించారు. అవినాష్ రెడ్డి పై ఏవిధంగా కేసు పెట్టాలనే అంశం పైన న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారంట. అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకొని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుంది. ఆ క్రమంలో సునీత చేసే ఫిర్యాదుతో అవినాశ్ మెడకు ఉచ్చు బిగిసినట్లేనని భావిస్తున్నారు. ఒకవైపు పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు, మరోవైపు సునీత ఫిర్యాదుతో అవినాష్రెడ్డి టాపిక్ వైసీపీలో ఉత్కంఠ రేపుతుంది.