Vijayawada Politics: విజయవాడ ఎంపీ సీటు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తోందంట. వైసీపీ పుట్టిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి కీలకమైన విజయవాడ లోక్సభ స్థానం అందని ద్రాక్షగానే మారింది. 2014 నుంచి ఆర్థికంగా స్థితిమంతులైన కమ్మవార్గానికి వైసీపీ ఎంపీ టికెట్ కేటాయిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. అదే కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు వైసీపీకి షాక్ ఇస్తూనే ఉన్నారు. దాంతో జగన్ ఈ సారి ఈ సారి కుల సమీకరణలకు సంబంధించి సందిగ్ధంలో ఉన్నారంట. బలహీన వర్గాల అభ్యర్ధిని ఈ సారి బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగానే అభ్యర్ధిని ప్రకటించి గ్రౌండ్ వర్క్ మొదలుపెడితే విజయం తధ్యమని వైసీపీ అధ్యక్షుడు భావిస్తున్నారంట. మరి 2029 ఎన్నికల్లో అయినా వైసీపీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా?
ఏపీ రాజకీయ రాజధానిగా వెలుగొందుతున్న విజయవాడ ఎంపీ స్థానం ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కనీసం ఒక్కసారి కూడా ఈ సీటు గెలుచుకోలేకపోవడంతో 2029 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుందంట. ముఖ్యంగా కుల సమీకరణలతో ఓట్లు కోల్పోవాల్సి వస్తోందని భావిస్తూ, గేమ్ ఛేంజర్ పాలసీని అనుసరించాలని చూస్తోంది. కమ్మ సామాజిక వర్గం అభ్యర్ధులను బరిలోకి దింపితే .. ఆ వర్గీయుల బలం పుష్కలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోలేమని, మరో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2014 నుంచి 2014 వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు సార్లు ఈ స్థానం అందని ద్రాక్షగానే మారడంతో వైసీపీ వ్యూహం మార్చేందుకు సిద్ధమైందంటున్నారుయ 2014 ఎన్నికల్లో కోనేరు రాజేంద్రప్రసాద్ అనే పారిశ్రామికవేత్తను బరిలోకి దించిన వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది. 2019లో పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్కు ఎంపీ టికెట్ ఇచ్చిన వైసీపీ రెండో సారి కూడా చేతులు కాల్చుకుంది. ఆ రెండు సార్లు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేశినేని నాని 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరి.. ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి, తన సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. అలా మూడు సార్లు కమ్మ నేతలతో చేసిన ప్రయోగం విఫలమవ్వడంతో జగన్ వచ్చే ఎన్నికల్లో స్ట్రాటజీ మార్చాలని ఫిక్స్ అయ్యారంట.
విజయవాడ ఎంపీ సీటును జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచన చేస్తున్నారంట. విజయవాడ ఎంపీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ ఎంపీ నియోజకవర్గంలో ఓటింగ్ పరంగా కమ్మ కులస్తులు గణనీయంగా ఉండడంతో సాధారణంగా అన్ని పార్టీలు ఈ స్థానంలో సామాజిక వర్గ అభ్యర్థికే అవకాశం ఇస్తాయి. వైసీపీ, టీడీపీలు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి నిలబెట్టడంతో వైసీపీకి ప్రతిసారి భంగపాటు తప్పలేదు. కమ్మ వర్గీయులు టీడీపీకే స్కిక్ఆన్ అవుతండటంతో వైసీపీ వ్యూహాలు విఫలమవుతూనే వచ్చాయి.
గత మూడు ఎన్నికల ఫలితాలతో వైసీపీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోందంట. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉండగానే .. ఇప్పటి నుంచే విజయవాడ ఎంపీ సీటు ఎవరికి కేటాయించాలనే అంశంపై వేట మొదలు పెట్టిందంట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం ప్రకటించడంతో.. కొత్త సమీకరణలతో వైసీపీ క్యాండెట్ కోసం అన్వేషిస్తోందంట. వైసీపీ గత రెండు ఎన్నికల్లోనూ ఎంపీ అభ్యర్థి పేరును ఆఖరు నిమిషంలో ప్రకటించడంతోనే ప్రతికూల ఫలితాలు వచ్చాయని వారికి వారే వశ్లేషించుకుంటున్నారు. ఓటమికి అదే ప్రధాన కారణమని తమ సర్వేలు కూడా వెల్లడించాయిన వైసీపీ నేతలు అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికలకు ముందుగా విజయవాడ ఎంపీ స్థానం నుంచే అభ్యర్ధి ఎంపిక ప్రారంభించాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందంట.
మూడు సార్లు అపజయాలతో సరిపెట్టుకోవాల్సిన వైసీపీ ఎలాగైనా 2029 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలన్న కసితో ఉందంటున్నారు. అందుకు మూడేళ్ల ముందునుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తూ, సరైన అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం లేకుండా ముందుగానే ప్రకటిస్తే తప్పక విజయం సాధిస్తామని విశ్లేషకులు చెబుతుండడంతో ఆ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ముందస్తు ప్రకటన ద్వారా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతోంది.
కమ్మ వర్గం వైసీపీకి ఓటు వేసేందుకు అంత ఆసక్తి కనబర్చడం లేదని గ్రహించిన అధిష్టానం, ఈ సారి ఆ వర్గీయుల తర్వాత అధికంగా ఉన్న సామాజిక వర్గంపై దృష్టి సారించిందట. ఆ కుల అభ్యర్థిని పోటీకి దింపి విజయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోందంట. 2029 ఎన్నికల్లో బీసీ లేదా ఎస్సీ వర్గాలకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లా నేతలు నివేదికలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. విజయవాడ వంటి ప్రతిష్టాత్మక సీటులో గెలుపు సాధించడం వైసీపీకి కీలకంగా మారిన నేపథ్యంలో, త్వరలోనే అభ్యర్ధిపై స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జగన్ లెక్కలు విజయవాడ రాజకీయాల్లో ఎంత వరకు వర్కౌట్ అవుతాయో?
Also Read: వైసీపీ కొత్త ‘ఫైర్ బ్రాండ్’కు బ్రేక్ పడిందా? అంబటి రాంబాబు వ్యూహం ఇదేనా?
Story by: Apparao, Big Tv