E-Paper
Advertisement

Maoist Ganapathy: ముగిసిన మావోయిజం? లొంగిబాటు దిశగా అగ్రనేత గణపతి.. లైన్ క్లియర్ చేసిన తెలంగాణ పోలీసులు?

Maoist Ganapathy: ముగిసిన మావోయిజం? లొంగిబాటు దిశగా అగ్రనేత గణపతి.. లైన్ క్లియర్ చేసిన తెలంగాణ పోలీసులు?

Maoist Ganapathy: భారతదేశంలో దశాబ్దాల పాటు సాగిన సాయుధ విప్లవ పోరాటం ఒక ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీ (CPI-Maoist) అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పోలీస్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇటీవలే మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసులకు లొంగిపోయారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా గణపతి ఆచూకీని పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గణపతి అడవుల్లో లేరని, ఏదో ఒక నగరంలో షెల్టర్ తీసుకుని ఉండొచ్చని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఇదివరకే వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం, గణపతి తన లొంగిబాటుకు సంబంధించి తెలంగాణ పోలీసులతో రాయబారం నడుపుతున్నట్లు సమాచారం.

గణపతి నేపాల్ లేదా ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో తలదాచుకున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన, తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లొంగిబాటుకు సంబంధించి ఆయన ప్రభుత్వం ముందు కొన్ని షరతులు, డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. 2004లో మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి 2018 నవంబర్ వరకు గణపతి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీలో అత్యున్నత స్థాయి వ్యూహకర్తగా పేరుగాంచిన ఆయన లొంగిపోతే, మావోయిస్టు ఉద్యమం దాదాపుగా అంతరించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కీలక పరిణామాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబి (SIB) ఐజీ సుమతి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల లొంగిబాటు, గణపతికి సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, శాంతి భద్రతల అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. గణపతి వంటి అగ్రనేత లొంగిబాటు అనేది కేవలం రాష్ట్రానికే కాకుండా దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో కేంద్ర హోంశాఖ కూడా దీనిపై నిశితంగా దృష్టి సారించింది.

మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఎన్‌కౌంటర్లలో చనిపోవడం లేదా అనారోగ్యంతో లొంగిపోవడంతో పార్టీ క్యాడర్ ప్రస్తుతం కుదేలైంది. మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్ జీ), నంబాల కేశవరావు (బసవరాజ్) వంటి కీలక నేతల తదుపరి వరుసలో ఇప్పుడు గణపతి మాత్రమే మిగిలి ఉన్నారు. ఆయన గనుక అధికారికంగా పోలీసులకు లొంగిపోతే, అడవిలో తుపాకీ గర్జనలు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. గణపతి లొంగిబాటు ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఈ పరిణామం తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థాపనకు పెద్ద ముందడుగుగా నిలవనుంది.

Read Also:  ఇరాన్ ను నమ్మించి గొంతు కోసిన మ‌హిళ‌.. ఆమె ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ విధ్వంసం?

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×