Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఫైనల్స్కు ముందు చివరి ఎలిమినేషన్కు సమయం వచ్చేసింది. మామూలుగా ఫైనల్స్కు టాప్ 6 కంటెస్టెంట్స్ వెళ్తారని అనుకుంటే అనూహ్యంగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అలా అయితే ఫైనల్స్కు కేవలం అయిదుగురు మాత్రమే వెళ్తారని ప్రకటించారు. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుండి మొదటిసారి నామినేషన్స్లోకి వచ్చిన రోహిణి.. ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. ఇక ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో మరొక ఎలిమినేషన్ జరగనుంది. ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పే ముందు కంటెస్టెంట్స్తో సరదా ఆటలు ఆడించారు నాగార్జున. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
అవినాష్తోనే ఆటలు
రోహిణి కూడా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది అవినాష్ మాత్రమే. అందుకే తనతోనే ఆటలు ఆడించారు నాగార్జున. గార్డెన్ ఏరియాలో చివర్లో ఉన్న బెల్ను ఒంటి కాలిపై తీసుకొచ్చి యెల్లో మార్క్పై పెట్టమని అవినాష్ను నాగార్జున ఆదేశించడంతో ఈ లేటెస్ట్ ప్రోమో ప్రారంభమవుతుంది. నాగ్ చెప్పినట్టుగానే ఆ బెల్ను ఒంటి కాలిపై తీసుకొచ్చాడు అవినాష్. దీంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అసలు ఆట మొదలయ్యింది. ఒక సినిమా క్యారెక్టర్ను మొహం లేకుండా చూపిస్తారు. అది చూసిన తర్వాత ఎవరైతే ముందుగా బెల్ కొడతారో వారికే సమాధానం చెప్పే ఛాన్స్ దొరుకుతుంది.
Also Read: మళ్లీ గౌతమే టార్గెట్? నిఖిల్, విష్ణుప్రియాకు ఎందుకంత చనువు? నాగార్జునపై నెటిజన్ల ఫైర్
రెండు టీమ్స్గా విడిపోయి
‘గెస్ ది క్యారెక్టర్’ టాస్కులో నబీల్, అవినాష్, ప్రేరణ ఒక టీమ్ అయితే.. నిఖిల్, గౌతమ్, విష్ణుప్రియా ఒక టీమ్గా విడిపోయారు. ముందుగా ‘అఖండ’లో బాలకృష్ణను చూపిస్తే.. నబీల్ బెల్ కొట్టాడు. కానీ సమాధానం మాత్రం అవినాష్ చెప్పాడు. అయితే అలా చెప్పడం ఓకే అని నాగార్జున చెప్పడంతో అవినాష్ సాయంతోనే నబీల్ అన్నీ సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ‘ఛత్రపతి’లో ప్రభాస్ క్యారెక్టర్ను చూపించగా విష్ణుప్రియా కరెక్ట్గా గెస్ చేసింది. ఆ సినిమాలోని పాటకు గౌతమ్, నిఖిల్తో కలిసి స్టెప్పులేసింది. ఆపై ‘దసరా’లో నాని క్యారెక్టర్ను చూపించగా గౌతమ్ కరెక్ట్గా గెస్ట్ చేశాడు. కానీ అక్కడే నాగార్జున మరొక ట్విస్ట్ ఇచ్చారు.
అవినాష్ డ్యాన్స్కు ప్రశంసలు
సినిమాను, క్యారెక్టర్ను గెస్ చేయడం మాత్రమే కాకుండా క్యారెక్టర్ పేరును కూడా గెస్ చేయాలని అన్నారు నాగార్జున. దీంతో ‘దసరా’లో నాని పాత్ర పేరేంటో వెంటనే గుర్తురాక తికమక పడ్డారు గౌతమ్, విష్ణుప్రియా. ఆ తర్వాత సినిమాలను బ్యాక్ టు బ్యాక్ గెస్ చేసింది నబీల్ టీమ్. దీంతో ‘మగధీర’లోని ఒక పాటకు ఆ టీమ్ అంతా కలిసి స్టెప్పులు కూడా వేశారు. అవినాష్ డ్యాన్స్ చూసి అభినందించారు నాగార్జున. ‘బీబీ జోడీలో టాప్ 2 కంటెస్టెంట్’ అని గుర్తుచేశాడు అవినాష్. మరి ఎందుకు గెలవలేదని నాగార్జున అడగగా.. మోషన్స్ అయ్యాయని చెప్పాడు అవినాష్. అలా సరదా ఆటలు అన్నీ పూర్తయిన తర్వాత నబీల్, విష్ణుప్రియాలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చూపించడంతో ప్రోమో ముగిసింది.