ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్. పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేయడానికి ఇప్పటి వరకు ఉన్న గడువుని పొడిగించింది. వాస్తవానికి జులై -31 వరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆ గడువుని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పొడిగించింది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరానికి గాను.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి కొత్త గడువుని సెప్టెంబర్ 15 గా ఫిక్స్ చేసింది. ఈమేరకు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తాజాగా ట్వీట్ చేసింది.
Kind Attention Taxpayers!
CBDT has decided to extend the due date of filing of ITRs, which are due for filing by 31st July 2025, to 15th September 2025
This extension will provide more time due to significant revisions in ITR forms, system development needs, and TDS credit… pic.twitter.com/MggvjvEiOP
— Income Tax India (@IncomeTaxIndia) May 27, 2025
గడువు పెంచిన కేంద్రం..
2025-26 మదింపు సంవత్సరానికి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్ లలో చేపట్టిన మార్పులకు అనుగుణంగా కొత్త సిస్టమ్ ని రెడీ చేయాల్సి ఉంది. దీనికోసం మరింత సమయం పట్టేలా ఉంది. దీంతో ఐటీ ఫైలింగ్ కోసం ఎలాంటి అవాంతరాలు లేకుండా చేసేందుకు కేంద్రం గడువు పెంచింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం జులై 31 దాకా ఉన్న గడువుని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నామంటూ ఐటీ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పింది. ప్రస్తుతానికి లాంఛనంగా గడువు పెంచుతున్నట్టుగా ఐటీ శాఖ ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ లో మరిన్ని వివరాలు ఉండే అవకాశం ఉంది.
వాస్తవానికి.. ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం ఐటీ పోర్టల్ లో ఈరోజు వరకు అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు అనుమతి ఇచ్చినా.. జులై-31 లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం కష్టసాధ్యమని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో సరైన AIS డేటా, TDS డేటాను పొందడంలో సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు గడువు పెంచడం ద్వారా ఈ సమస్యలు ఉత్పన్నం కావు. ఐటీ రిటర్న్స్ ని కచ్చితమైన సమాచారంతో దాఖలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఫైలింగ్ లో లోపాలు ఉండవు. ఐటీఆర్ దాఖలు చేసేవారు తప్పుల్లేకుండా దరఖాస్తులు నింపుతారు. దరఖాస్తులు నింపేవారి సౌలభ్యం కోసం, ఐటీఆర్ ఫైలింగ్ లో వివాదాలకు తావు లేకుండా చూసేందుకే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ గడువు పెంచింది.
సెప్టెంబర్-15 తుది గడువు
ఐటీ రిటర్న్స్ ని దాఖలు చేయడానికి వ్యక్తిగతంగా అందరికీ అవకాశం ఉన్నా కూడా, చాలామంది థర్డ్ పార్టీలను ఆశ్రయిస్తుంటారు. ఇటీవల యూజర్ ఫ్రెండ్లీగా ఐటీ వెబ్ సైట్ లో చాలా మార్పులు చేశారు. ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేయడం సులభతరం చేశారు. దీనికితోడు ఈ ఏడాది కొన్ని నియమాలు మార్చారు. ITR-1 నుంచి ITR-7 వరకు ఈ ఫైలింగ్ లో కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. వీటి వల్ల మరిన్ని అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ దశలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారికి మరింత సమయం కచ్చితంగా అవసరం అవుతుంది. అందుకే ఆదాయ పన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి సెప్టెంబర్-15ని తుది గడువుగా నిర్థారించింది.