Byjus CEO Resignation: ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్ కు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ సోమవారం రాజీనామా చేశారు. దీంతో సీఈఓ బాధ్యతలను కంపెనీ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు సెప్టెంబర్లో అర్జున్ మోహన్ సీఈఓగా పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సంస్థ కష్టకాలంలో ఉండగా.. సీఈఓ బాధ్యతల నుంచి అర్జున్ తప్పుకోవడం గమనార్హం. దీంతో నేటి నుంచి రవీంద్రన్ సంస్థ రోజూ వారి కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
రవీంద్రన్ క్యాట్ కోచింగ్ ఇస్తున్న తొలినాళ్లలో అర్జున్ ఆయనకు స్టూడెంట్ కావడం విశేషం. రవీంద్రన్కు అత్యంత నమ్మకస్తుడిగా పనిచేసిన అర్జున్ మోహన్కు సంస్థలో మంచి పేరుంది. సీఈఓ అయిన తర్వాత అర్జున్ కంపెనీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడంతో పాటు, మరికొందరికి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించారు. దేశవ్యాప్తంగా ఆఫీసులన్నింటినీ మూసివేశారు. అనుబంధ సంస్థ ఆకాశ్ కార్యకలాపాలను సైతం ఆయనే పర్యవేక్షించారు. తొలుత కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన మధ్యలో రెండేళ్లపాటు అప్గ్రాడ్ ఇండియా సీఈఓగా పనిచేయగా గత సెప్టెంబరులో బైజూస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: Odisha Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
అర్జున్ రాజీనామాతో కంపెనీ తన వ్యాపారాలను మూడు కేంద్రీకృత విభాగాలుగా విభజించింది. లెర్నింగ్ యాప్, ఆన్లైన్ తరగతులు, ట్యూషన్ కేంద్రాలు, టెస్ట్-ప్రిప్లుగా వర్గీకరించింది. కంపెనీ రోజువారీ కార్యకలాపాలకు బాహ్య సలహాలు ఇవ్వడం కోసం అర్జున్ సహకారాన్ని కంపెనీ కోరింది. ఇన్ని రోజులు కంపెనీ కష్టకాలంలో పనిచేసినందుకు అర్జున్ మోహన్ కు బైజూస్ ధన్యవాదాలు తెలిపింది.